Friday, March 19, 2010

సిమెంటు బస్తా రూ.200!

మరో రూ.25 పెరిగే అవకాశం!
అధిక డిమాండ్‌, కరెంటు కోతలే కారణం
రు నెలల్లోనే ఎంత తేడా...! రాష్ట్రంలో గత ఏడాది ఆగస్టు- సెప్టెంబరు మాసాల్లో రూ.130కి పడిపోయిన సిమెంటు బస్తా ధర ఇప్పుడు మళ్లీ రూ.200కు చేరుకుంది. ప్రీమియం బ్రాండ్ల నుంచి సాధారణ బ్రాండ్ల వరకూ సిమెంటు ధర ప్రస్తుతం రూ.190 నుంచి రూ.205 వరకూ పలుకుతోంది. గత రెండు మూడు నెలల వ్యవధిలోనే సిమెంటు ధర వేగంగా పెరుగుతూ రావడం గమనార్హం. వేసవి కాలం నిర్మాణాలకు అనువైన సీజన్‌ కావడంతో మిగిలిన సీజన్లతో పోల్చితే ధర కాస్త ఎక్కువగా ఉండటం సహజమే. కానీ ఇంత త్వరగా మళ్లీ రూ.200 ధరను చేరుకుంటుందని ఊహించలేదని వినియోగదార్లు వాపోతున్నారు. 'పదిరోజుల క్రితం ప్రముఖ బ్రాండ్‌ సిమెంటు లోడు బస్తా రూ.175కు తీసుకున్నాం. ఇప్పుడు మరో లోడు అడిగితే రూ.200 చెబుతున్నారు' అని గుంటూరుకు చెందిన ఒక వినియోగదారుడు విచారం వెలిబుచ్చారు. అదేమని డీలర్లను అడిగితే ఇంకా ధర పెరుగుతుందని అంటున్నారని పేర్కొన్నారు.

మరోపక్క ఈ వారంలో బస్తాకు రూ.25 వరకూ ధర పెంచేందుకు ఉత్పత్తిదార్లు సన్నాహాలు చేస్తున్నారు. డిమాండ్‌ అధికంగా ఉందని, అదే సమయంలో కరెంటు కోత వల్ల భారీగా ఉత్పత్తి నష్టం జరుగుతూ ఉండటంతో రిటైల్‌ మార్కెట్లో ధర పెరిగిపోతోందని సిమెంటు కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అంతేగాక ఈ వారంలో మరో విడత ధర పెంచేందుకు ఉత్పత్తిదార్లు సిద్ధమవుతున్నారని తెలిసింది. బస్తాకు రూ. 25 వరకూ పెంచే ఆలోచన ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. బొగ్గు ధర పెరగడం, ఇతరత్రా ఉత్పత్తి వ్యయాలు అధికం అయినందున ధర పెంచాల్సి వస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏడాది క్రితం సిమెంటు ఇదే ధర పలికింది. మళ్లీ ఇప్పుడు అక్కడికే చేరుకుంటోంది.

8% పెరిగిన అమ్మకాలు
సిమెంటు విక్రయాలు మనరాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. గత నెలలో దేశవ్యాప్తంగా 13.71 మిలియన్‌ టన్నుల సిమెంటు విక్రయాలు నమోదయ్యాయి. ఈ అమ్మకాలు గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే 8 శాతం అధికం. ఇదేవిధంగా సిమెంటు ఉత్పత్తి కూడా 9.5 శాతం పెరిగి 13.91 మిలియన్‌ టన్నులు అయింది. ఈ ఫిబ్రవరి నెలలో దాదాపుగా అన్ని ప్రముఖ సిమెంటు కంపెనీలు అధిక అమ్మకాలను నమోదు చేశాయని సీఎంఏ (సిమెంటు ఉత్పత్తిదార్ల సంఘం) వర్గాలు పేర్కొంటున్నాయి. అధిక డిమాండ్‌ వల్ల దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సిమెంటు ధర పెరుగుతున్నట్లు ఆ వర్గాలు వివరిస్తున్నాయి.