Friday, March 19, 2010

మహీంద్రా సత్యంను వదిలేస్తున్న సీనియర్లు!


మహీంద్రా సత్యంను వదిలేస్తున్న సీనియర్లు!
ఈనెలలో ఇప్పటికే 1500 మంది
9 నెలల్లో 12000 మంది బయటకు
కొత్త యాజమాన్యంతో ఇమడలేకే!
భవిష్యత్తుపై కొరవడిన భరోసా
వలస రేటు 16-18 శాతమే: కంపెనీ
కంపెనీకి నిపుణుల కొరత!
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కుంభకోణం బయటపడ్డాక 'సత్యం' గట్టెక్కుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ.. ఊహించని స్థాయిలో కోలుకుంది. ఖాతాదారుల్లో కంపెనీపై విశ్వాసం పెరిగింది. కొత్త పనులు లభిస్తున్నాయి. పునర్‌ వ్యవస్థీకరణ ద్వారా కంపెనీని మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దడానికి కొత్త యాజమాన్యం కృషి చేస్తోంది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఉద్యోగులను ఇప్పటికీ అభద్రతా భావం వీడలేదనే అనిపిస్తోంది! కొత్త యాజమాన్యం, కొత్త విధానాల్లో ఇమడలేక ఉద్యోగులు భారీగా బయటకు వెళ్లిపోతున్నారు. 'కొత్త యాజమాన్యంపై అనేకమంది అసంతృప్తిగా ఉన్నారు. పునర్‌ వ్యవస్థకరణలో భాగంగా కొంతమంది ఉద్యోగులను టెక్‌ మహీంద్రాకు తరలించడం, భవిష్యత్తుపై భరోసా లేకపోవడం, బయట అవకాశాలు మెరుగుపడడం వంటి కారణాలతో ఇతర కంపెనీలకు వలస వెళ్తున్న ఉద్యోగుల సంఖ్య (యాట్రిషన్‌ రేటు) ఎక్కువగానే ఉంది' అని సీనియర్‌ ఉద్యోగులు చెబుతున్నారు. వచ్చే జూన్‌ నాటికి ఆరేళ్లు అంతకు మించిన అనుభవం కలిగిన ఉద్యోగులు ఇంకా కంపెనీకి గుడ్‌బై చెప్పొచ్చని అంచనా వేస్తున్నారు. కంపెనీలో నిపుణుల అవసరం చాలా ఉందని, పని చేయడానికి ఉద్యోగులు లేరన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జూన్‌లో వర్చ్యువల్‌ పూల్‌ ప్రొగ్రామ్‌ (వీపీపీ) అమలులోకి వచ్చిన నాటి నుంచి దాదాపు 12,000 మంది 'సత్యం' ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వీరిలో వీపీపీలో ఉన్నవారు, పని చేస్తున్న వారు కూడా ఉన్నారు. డిసెంబరు నెలలో అత్యధికంగా 2,000 మంది బయటకు వెళ్లారని, మార్చిలో ఇప్పటి వరకు 1,500 మంది ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు చూసుకున్నారని చెబుతున్నారు. ఒక్కోసారి రోజుకు గరిష్ఠంగా 200 మంది వరకు రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఉద్యోగుల వలస 16-18 శాతం వరకు ఉందని, ఇది పరిశ్రమ తీరుకు అనుగుణమేనని కంపెనీ ప్రతినిధి తెలిపారు. జూన్‌ తర్వాత కంపెనీ నుంచి ఎంత మంది బయటకు వెళ్లింది చెప్పలేమని అన్నారు.

వీరి పరిస్థితి ఏమిటి?: సత్యంను గత ఏప్రిల్‌లో హస్తగతం చేసుకున్న తర్వాత ఉద్యోగుల సంఖ్యను హేతుబద్ధం చేయడానికి టెక్‌ మహీంద్రా యాజమాన్యం వర్చ్యువల్‌ పూల్‌ కార్యక్రమాన్ని ప్రకటించింది. పని లేకుండా ఖాళీగా ఉన్న (బెంచ్‌పైన ఉన్న) ఉద్యోగులను ఇందులో చేర్చింది. డిసెంబరు వరకు వారికి మూలవేతనం, ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు కల్పించింది. డిసెంబరు తర్వాత కూడా మూడు నెలల పాటు ఎటువంటి చెల్లింపులు లేకుండా కొనసాగడానికి వెసులుబాటు కల్పించింది. వీపీపీలో ఉన్న నిపుణుల్లో (ఇంజినీర్లు) దాదాపు 3,000 మందిని మళ్లీ కంపెనీలోకి తీసుకున్నామని కంపెనీ ప్రతినిధి 'న్యూస్‌టుడే'కు తెలిపారు. అయితే.. ఇంకా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు మాత్రం మార్చి తర్వాత ఇంటిదారి పట్టక తప్పదు.

కింది స్థాయి ఉద్యోగులతో పనులు!: వీపీపీలో దాదాపు 8000 మందిని చేర్చగా ఇందులో నిపుణులు (బిల్లబుల్‌) 6,000 మంది, నాన్‌ బిల్లబుల్‌ 2,000 మంది ఉన్నట్లు వర్గాలు చెబుతున్నాయి. నిపుణుల్లో 4,000 మంది కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నాన్‌బిల్లబుల్‌లో రవాణా, కార్పొరేట్‌ సర్వీసెస్‌, మానవ వనరులు, గ్రంథాలయ ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు మినహా ఎవరినీ మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోలేదు. అధిక శాతం మంది ఇప్పటికే బయటకు వెళ్లిపోయారు. మిగిలిన కొద్ది మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కంపెనీ ప్రతినిధి మాత్రం భవిష్యత్తులో వీరికే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఇటీవల నియామకం చేసుకున్న ఉద్యోగార్ధులకు హైదరాబాద్‌లోని సత్యం టెక్నాలజీ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడి గ్రంథాలయంలో కూడా తగిన సిబ్బంది లేరని, అన్ని పనులూ కింది స్థాయి ఉద్యోగులే చూసుకుంటున్నారని తెలుస్తోంది.