Saturday, March 20, 2010

విద్యుత్తు 'లోడ్‌' పెరిగింది

రాష్ట్ర ప్రభుత్వం తాజా వివరాలతో విడుదల చేసిన 'స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌-2009' సంచికలో పొందుపరచిన గణాంకాల ప్రకారం.. 2008-09లో రహదారుల పొడవు, విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య, లోడ్‌ వివరాలు ఇలా ఉన్నాయి...
పెరిగిన కనెక్షన్లు.. లోడు తీరిదీ..
అన్ని కేటగిరీల్లోని విద్యుత్‌ సర్వీసుల సంఖ్య ఏడాదిలోనే సుమారు 12లక్షల పైగా పెరిగాయి. 2007-08లో సుమారు 3.56 కోట్ల కిలోవాట్ల విద్యుత్తు లోడు నమోదు కాగా.. 2008-09(మార్చి వరకు)లో సుమారు 3.83 కోట్ల కిలోవాట్లు నమోదైంది.

* రంగాల వారీగా విద్యుత్తు కనెక్షన్లు, లోడు పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నల్గొండ జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి.

* గృహ విద్యుత్తు కనెక్షన్లలో గుంటూరు జిల్లా అగ్రభాగంలో ఉంది. ఆ తర్వాత వరుసగా రంగారెడ్డి, హైదరాబాద్‌, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలున్నాయి.

* పారిశ్రామిక కనెక్షన్లు, లోడ్‌లో రంగారెడ్డి, నెల్లూరు జిల్లాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌ కంటే కృష్ణా జిల్లాలో పారిశ్రామిక కనెక్షన్లు, లోడ్‌ ఎక్కువగా ఉండటం గమనార్హం.
* తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో వ్యవసాయ లోడ్‌ చాలా ఎక్కువగా ఉంది. విద్యుత్తు లోడ్‌లో వరంగల్‌ అగ్రభాగాన ఉంటే చిత్తూరు రెండో స్థానంలో ఉంది.

రహదారులివీ..
రాష్ట్రంలో అన్ని రకాల రహదారులు 1,96,191 కి.మీ. మేర ఉన్నాయి. ఇందులో జాతీయ రహదారులు 4,645 కి.మీ., ఆర్‌అండ్‌బీ ఆధీనంలో 64,404 కి.మీ., పంచాయతీరాజ్‌ ఆధీనంలో 1,27,142 కి.మీ. ఉన్నాయి.

* జాతీయ రహదారులు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 528 కి.మీ. ఉండగా రాష్ట్ర రాజధానిలో 36 కి.మీ. మాత్రమే ఉన్నాయి.
* ఆర్‌అండ్‌బీ రోడ్లు అత్యధికంగా కడప జిల్లాలో 4,792 కి.మీ. ఉండగా, రాజధానిలో 173 కి.మీ. మాత్రమే ఉన్నాయి.
* పంచాయతీరాజ్‌ రహదారులు మహబూబ్‌నగర్‌ జిల్లాలో 9,360 కి.మీ. ఉండగా విజయనగరం జిల్లాలో 2854 కి.మీ. మాత్రమే ఉన్నాయి.
* రాజధానిలో పంచాయతీరాజ్‌ రహదారి ఒక్క కిలోమీటరు కూడా లేదు.