Friday, March 19, 2010

భారత్‌ భవిష్యత్‌ బంగారమే

ప్రతికూలతలు దాటి స్థిరత్వానికి
రేటింగ్‌ను సవరించిన స్టాండర్డ్‌ & పూర్స్‌
ద్రవ్యోల్బణంపై ఆందోళన
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో భారత్‌ తన వృద్ధి బాటను కొనసాగిస్తుందని క్రెడింగ్‌ రేటింగ్‌ ఏజెన్సీ స్టాండర్డ్‌&పూర్స్‌(ఎస్‌&పీ) తేల్చిచెప్పింది. భారత్‌పై తన రేటింగ్‌ను ప్రతికూలం నుంచి స్థిరానికి సవరించింది. భారత మూలాల్లో వస్తున్న మార్పులను గమనించి ఈ మార్పులు చేసినట్లు ఎస్‌&పీ చెబుతోంది. ఆదాయ, వ్యయం మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రకటించిన పథకాల నేపథ్యంలో భవిష్యత్‌లో భారత రేటింగ్‌ను తగ్గించే అవకాశం ఉండదని కూడా అభిప్రాయపడింది. అయితే ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరువ కావడం భారత స్థిరత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరించింది.

అధిక రుణభారంపైనా ఆందోళన: అధిక రుణ భారం, ద్రవ్యలోటులు సైతం భారత్‌ రేటింగ్‌పై ఒత్తిడి తేవచ్చని అంచనా వేసింది. భారత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏకీకృత రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సర జీడీపీలో 80 శాతంగా ఉంది. వీటికి వడ్డీ చెల్లింపులు ప్రభుత్వ ఆదాయంలో 27 శాతాన్ని తినివేయగలవని ఎస్‌&పీ అంచనా వేసింది. ప్రస్తుతం భారత దీర్ఘకాల క్రెడిట్‌ రేటింగ్‌ 'బీబీబీ మైనస్‌'గా ఉండడం గమనార్హం. ఇదే అత్యంత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఇక స్వల్పకాలానికి(ఏడాది వరకూ) ఏ-3గా రేటింగ్‌ను ఇచ్చింది. ఇది ఓ మోస్తరు గ్రేడింగ్‌గా భావించొచ్చు. ఈ సంస్థ ఇచ్చే రేటింగ్‌ ఒక దేశంలోని పెట్టుబడుల వాతావరణం, అప్పులు తీర్చే విషయంలో ఆ దేశ సామర్థ్యం వంటి విషయాలను ప్రతిబింబిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 5.5 శాతానికి పరిమితం చేయగలమని బడ్జెట్‌ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 6.7%గా ఉండొచ్చన్న అంచనాలున్నాయి. కాగా, భారత అంచనాలకు దగ్గరగా ఎస్‌&పీ సైతం వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 8 శాతంగా నమోదు కాగలదని అంచనా వేయడం విశేషం. గతేడాది ఫిబ్రవరిలో భారత్‌ భవిష్యత్‌ అంచనాలను ఈ ఏజెన్సీ స్థిరం నుంచి ప్రతికూలానికి సవరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఉద్దీపన పథకాల ప్రభావంతో ద్రవ్యలోటు భారీగా పెరిగింది.

కంపెనీల రేటింగ్‌ పెరిగింది: ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, పీఎఫ్‌సీ, ఐఐఎఫ్‌సీఎల్‌, ఎగ్జిమ్‌ బ్యాంక్‌, ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వంటి ఆరు ప్రభుత్వ రంగ కంపెనీలతో పాటు 12 బ్యాంకుల భవిష్యత్‌ అంచనాలను ఈ రేటింగ్‌ ఏజెన్సీ పెంచడం గమనార్హం.