వైభవం తగ్గొచ్చు మార్చితో ముగిసిన ఏడాది చాలాప్రోత్సాహకరంగానే సాగినప్పటికీ కొత్త ఏడాది వాహన తయారీ సంస్థలకు కష్టకాలంగానే కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. జనవరి నుంచి వాహనాల ధరలు 2 సార్లు పెరిగాయి. తాజాగా 13 ప్రధాన నగరాల్లో బీఎస్ IV కాలుష్య ప్రమాణాల అమలులోకి రావడంతో ధరలు మళ్లీ పెరగనున్నాయి. విక్రయాలూ కొంత ప్రభావితం కానున్నాయి. దేశీయ వాహన సంస్థల విక్రయాల్లో సగానికి పైగా అమ్మకాలు ఈప్రధాన నగరాల్లోనే ఉండడం ఆందోళనకర అంశం. కొత్త ప్రమాణాల వల్ల ఆదరణ ఉన్న పలు వాహనాల అమ్మకాలు నిలిచిపోతుండడం బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడం, ఏడాది మధ్యలో ప్రభుత్వం మరోసారి పన్ను'పోటు' వేసే ప్రతిపాదనల్లో ఉండడం, బ్యాంకుల రుణాలు భారం కానుండడంతో కొత్త ఏడాదిలో అమ్మకాలు తగ్గుతాయని అంచనా. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటున్నందున వాహన సంస్థలు వినూత్న పద్ధతుల ద్వారా వినియోగదారులకు చేరువైతే తిరిగి పూర్వవైభవం సొంతం అవుతుందని వారు చెబుతున్నారు. |