Saturday, April 3, 2010

25,000 పాయింట్లకు సెన్సెక్స్‌!

భలే బుల్‌
సవాళ్లున్నా.. మెరుగ్గా రాణించనున్న మార్కెట్‌
25,000 పాయింట్లకు సెన్సెక్స్‌!
కొత్త ఆర్థిక సంవత్సరంపై నిపుణుల విశ్లేషణ
కొత్త ఆర్థిక సంవత్సరం శుభాలనే ఇస్తుందని ఆర్థిక నిపుణుల కమిటీ ఒకటి అభిప్రాయపడుతోంది. 2009-10 ఆర్థిక సంవత్సరం 'ఫర్వాలేదు' అని వర్గీకరించిన ఈ కమిటీ రాబోయే 12 నెలలూ దీర్ఘకాల పెట్టుబడులకు ఉత్తమమని అంటోంది. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌(ఐఏఐపీ) ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

ఐఏఐపీ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వే ప్రకారం 80 శాతం మంది ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఈక్విటీ మార్కెట్లు మంచి పెట్టుబడి అవకాశమని పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రాధాన్యం స్థిరాస్తి, కమోడిటీ రంగాలకు ఇచ్చారు. ఇంకా ఆ సర్వే ఏం చెబుతోందంటే..

* సెన్సెక్స్‌ 2010-11లో 50 శాతం ర్యాలీ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుండడంతో మార్కెట్లు 17,500 పైన కదలుతూ ఉన్నాయి. ఆ లెక్కన 50 శాతం అంటే ఈ ఏడాది ఎప్పుడో ఒకప్పుడు 25,000 పాయింట్లనూ దాటేందుకు వీలుంది.

* బ్యాంకింగ్‌, విద్యుత్‌, నిర్మాణ సంస్థలు మెరుగ్గా రాణించగలవు. అదీకాక సిమెంటు కంపెనీలు లక్ష కోట్ల డాలర్ల మూలధన పెట్టుబడులు పెడుతుండడం కూడా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవనుంది.

* ఏప్రిల్‌-జూన్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ స్క్రిప్‌ల మార్కెట్‌ విలువ రూ.36,000 కోట్లకు చేరే అవకాశం ఉంది.

* చాలా వరకు అంతర్జాతీయ తయారీ కంపెనీలను భారత్‌ ఆకర్షిస్తూ ఉండడం కూడా శుభపరిణామం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ) తమ పెట్టుబడులను మరింత పెంచే అవకాశం ఉంది. అంతే కాదు తమ కేటాయింపులను చైనా నుంచి భారత్‌కు మళ్లించే అవకాశాలూ ఎక్కువే.

* ఈ ఆర్థిక సంవత్సరంలో జనరిక్‌ ఫార్మా,. దేశీయ ఎఫ్‌ఎమ్‌సీజీ, రిటైల్‌, మీడియా, వినోద కంపెనీలతో పాటు అధిక ఆర్‌ఓఈ(రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ) గల మధ్య స్థాయి కంపెనీలు బలోపేతం కానున్నాయి.

* ఎక్కువ ఖర్చు చేసే సత్తా ఉన్న భారతీయ యువ జనాభా కూడా ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించొచ్చు. జీడీపీ 9 శాతంగా నమోదవ్వొచ్చు.

* ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటుండం; ఈ ఏడాది మరిన్ని శీతలీకరణ గిడ్డంకులను ఏర్పాటు చేస్తుండడంతో ద్రవ్యోల్బణ కట్టడి సాధ్యమవ్వొచ్చు.

* రుతుపవనాల ధోరణి, కరెంట్‌ అకౌంట్‌ లోటు వంటి అంశాలపై ఆధారపడి వచ్చే 3-4 నెలల్లో స్వల్పకాల సవాళ్లు ఎదురవ్వొచ్చు.

* వేతన/జీతాల పెంపు 15 శాతంగా ఉండొచ్చు.