టన్నుకు రూ.2,500 పెరిగిన ఉక్కు ధరలు
ముడిపదార్థాలు భారం: స్టీల్ కంపెనీలు
కోకింగ్ బొగ్గూ భగ్గు
ఉక్కు పరిశ్రమలు బ్లాస్ట్ ఫర్నేసులను నడపడానికి కోకింగ్ కోల్ అవసరం. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కోకింగ్ కోల్ ధరలు ఇటీవల ఒక్కసారిగా 55 శాతం మేర పెరిగాయి. 2010 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి టన్నుకు 200 డాలర్ల స్థాయిని నమోదు చేశాయి. అంతకు సంవత్సరం క్రితం టన్ను ధర 105 నుంచి 130 డాలర్లు ఉండేది. కోల్ ఇండియా లిమిటెడ్ సరఫరా చేసే బొగ్గుపై ఆధారపడ్డ సెయిల్ మినహా ఇతర కంపెనీలు ఎక్కువగా కోకింగ్ కోల్ను దిగుమతి చేసుకొంటాయి. అలాంటిది కోకింగ్ కోల్ ధరలు పెరిగితే, ఉక్కు ఉత్పాదక వ్యయం దానంతట అదే అధికం కావడం ఖాయం.
సహజ వాయువుల ధరలు కూడా..
ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్లు ఉత్పత్తి చేస్తున్న సహజవాయువు ధరలను పెంచే దిశగా కసరత్తు సాగుతోందని కేంద్ర పెట్రోలియమ్ శాఖ ప్రకటించిన విషయమూ తెలిసిందే. ఉక్కు, సహజవాయువుల ధరలు పెరిగితే నాకేంటట అని పౌరులు అనుకోవడం తగదు.. ఎందుకంటే, పరిశ్రమలకు వస్తూత్పత్తి కోసం ఉక్కు, సహజవాయువుల వంటివి ఎంతో అవసరం. అవి తమ వస్తూత్పత్తి వ్యయం పెరిగే పక్షంలో, ఆ వ్యయం మొత్తాన్ని కాకపోయినా కొంతవరకైనా వినియోగదారులకు బదిలీ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అపుడు అదనపు భారాన్ని మోయాల్సింది అంతిమంగా వినియోగదారే. అంటే- ఉక్కు, సిమెంటు, పెట్రోలు వంటి కీలక సరకుల ధరల పెంపు వస్తువుల ఖరీదుల పైన పరోక్ష ప్రభావాన్ని చూపించగలుగుతాయి.
ఇంతకూ ఉక్కు ధరలు పెరిగితే ఏమవుతుంది?
ఉక్కు ఒక ముడిపదార్థంగా తయారు అయ్యే కార్లు, ఇంకా రిఫ్రిజిరేటర్లు , ఎయిర్కండిషనర్లు, టెలివిజన్ సెట్లు వంటి వస్తువులు ప్రియం కావడానికి ఆస్కారం ఉంది. కొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలు తాము విక్రయించే ఉత్పత్తుల ధరలు ఎగబాకవచ్చని సూచనప్రాయంగా వెల్లడించినట్లు తెలిసింది. ఏసీలు, టీవీల వంటి వస్తువుల అమ్మకాలకు సాధారణంగా వేసవిలో గిరాకీ అధికంగా ఉంటుంది. ఇదే సమయంలో వాటి ధరలను పెంచడం వల్ల కంపెనీలకు లాభదాయకం కావచ్చేమో కాని, వినియోగదారులు వారి జేబుల నుంచి కాస్తంత పెద్ద మొత్తాన్నే తీసి చెల్లించవలసి రావచ్చు.