Monday, April 5, 2010

ఫండ్‌కాలమ్‌... ఆస్తులు 50% పెరిగాయ్‌

న్యూఢిల్లీ: మాంద్యం మత్తు వీడింది. మ్యూచువల్‌ ఫండ్‌లు 2009-10లో ఏకంగా 51 శాతం మేర తమ ఆస్తులను పెంచుకోవడమే ఇందుకు నిదర్శనం. అంతక్రితం ఆర్థిక సంవత్సరం చివరకు ఫండ్‌ల నిర్వహణ కింది ఆస్తులు(ఏయూఎమ్‌) రూ.4.92 లక్షలుగా ఉండగా.. 2009-10కల్లా ఇవి రూ.2.54 లక్షలు పెరిగి ఒక్కఉదుటన రూ.7.47 లక్షల కోట్లకు చేరుకున్నాయని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా(యాంఫీ) సమాచారం.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎప్పటిలాగే తన తొలిస్థానాన్ని పదిలంగానే ఉంచుకుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 36 శాతం వృద్ధితో రూ.1,10,413 కోట్లకు చేరి అన్నిటికన్నా ముందు నిలిచింది. ఇతర ప్రధాన ఫండ్లూ రాణించాయి(పట్టిక చూడండి). రుణ వితరణ తక్కువగా ఉన్న సమయంలో బ్యాంకులు ఫండ్ల వద్ద నిధులను ఉంచడానికి ఇష్టపడ్డాయి. దీంతో భారీ స్థాయిలో డెట్‌ పెట్టుబడులు తరలి రావడంతో గత ఆర్థిక సంవత్సరం ఈ స్థాయి వృద్ధి సాధ్యమైందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఫిబ్రవరి 2010 వరకూ డెట్‌/ఆదాయ పథకాల్లో మొత్తం పెట్టుబడులు రూ.2.61 లక్షల కోట్లుగా ఉండగా.. ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులు రూ.2,611 కోట్లకే పరిమితమైంది. ప్రవేశ రుసుము రద్దు, స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఫండ్ల ట్రేడింగ్‌నకు అనుమతి వంటి సెబీ నిర్ణయాలు మదుపర్లను ఈ రంగం వైపు ఆకర్షించడానికి కారణాలయ్యాయి.

డీడబ్ల్యూఎస్‌ గ్లోబల్‌
పేరు: డీడబ్ల్యూఎస్‌ గ్లోబల్‌ అగ్రిబిజినెస్‌ ఫండ్‌
రకం: ఓపెన్‌ ఎండెడ్‌
విభాగం: గ్రోత్‌
ప్రవేశ రుసుము: లేదు
నిష్క్రమణ రుసుము: 1%(ఒక ఏడాది లోపు)
ప్రారంభం: ఏప్రిల్‌ 6
ముగింపు: ఏప్రిల్‌ 30
కనీస పెట్టుబడి: రూ.5,000
లక్ష్యం: విదేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలంలో మూలధన వృద్ధిని సాధించడం. ప్రధానంగా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టిసారిస్తుంది.
మరిన్ని వివరాలకు:www.dws-india.com