Monday, September 3, 2012

భారత్ - బంగారం

భారత్ - బంగారం
అన్ని రకాల లోహాలతో తయారు చేసిన ఆభరణాలు ధరించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఒక ప్రాంత సంస్కృతినీ, సంప్రదాయాలను, వేషభాషలను కించపరచడం, హేళన చేయడం మంచిపద్దతికాదు. ‘పీపుల్స్ డెయిలీ’ భారత్ కు క్షమాపణలు చెప్పాలి.
 
మనదేశంలో బంగారు ఆభరణాల ధరించడంపై చైనా అధికారిక పత్రిక ‘పీపుల్స్ డెయిలీ’ అర్థంపర్ధంలేని కథనాన్ని ప్రచురించింది. అభ్యంతరకరమైన రాతలు రాసింది. ఇందుకు ఆ పత్రిక భారత్ కు క్షమాపణలు చెప్పాలి. భారత ప్రభుత్వం కూడా నిరసన తెలుపవలసిన అవసరం ఉంది.

ఆధునిక యుగంలో భారతదేశమంటే చైనాకు ఈర్ష, ద్వేషాలు ఎక్కువ.వీలు దొరికినప్పుడల్లా తన ద్వేషాన్ని వెళ్లగక్కుతూ వస్తోంది. తాజాగా భారతీయ మహిళలు బంగారు ఆభరణాలు ధరించడంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది. బంగారు ఆభరణాలపై భారతీయులకు గల మోజును కించపరుస్తూ చైనా విద్వేషాన్ని వెళ్లగక్కింది. బంగారు ఆభరణాలంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఈ ఇష్టం ఈనాడు కొత్తగా వచ్చింది కాదు. వేల సంవత్సరాలుగా మన దేశంలో స్వర్ణాభరణాలను ధరించడం ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని చైనా కించపరిచింది. భారతీయుల నల్లని శరీరంపై బంగారం ధగధగలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయని చైనా అధికార పత్రిక పీపుల్స్‌ డెయిలీలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆ వ్యాసంతోపాటు ఐశ్వర్యారయ్‌ సహా పలువురు మోడళ్లు ఆభరణాలు ధరించిన ఫోటోలను ప్రచురించి జాత్యంహకార వ్యాఖ్యలు చేసింది. బంగారు చెవి రింగులు, నెక్లెసులు ధరించిన మహిళలు మన దేశంలో ఎటు చూసినా కనిపిస్తారని రాసింది. చివరకు రోడ్ల పక్కన భిక్షం అడుక్కునే బాలికలు సైతం ముక్కు పుడకలు ధరించి కనిపిస్తారని ఆ కథనంలో పేర్కొంది. ముక్కు పుడక లేకుండా భారతీయ మహిళలు బయటకు వెళ్లరని వ్యాఖ్యానం చేసింది. మన దేశంలో పురుషులు సైతం బంగారు ఆభరణాలు ధరించడం సర్వ సాధారణమని చెప్పింది. మూడేసి ఉంగరాలు, భారీ బంగారు ఆభరణాలు ధరించిన మగవారు భారతదేశంలో చాలా మంది కనిపిస్తారని రాసింది. పెళ్లిళ్లలో వధువు తల్లిదండ్రులు స్వర్ణాభరణాలను కట్నంగా ఇస్తారన, ఇవి పెళ్లికూతురు అందాన్ని కనబడకుండా చేస్తాయని పేర్కొంది. ఈ ఆభరణాలకు వధువు వైవాహిక జీవితంలో ఆస్తిగా ఉపయోగపడతాయని వ్యాఖ్యానించింది.

మన దేశంలో చిన్న చిన్న పట్టణాల్లో సైతం ధగధగలాడే దుకాణాలు దర్శనమిస్తాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ ఏడాది బంగారం దిగుమతుల్లో ఇండియాను చైనా అధిగమిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా అధికార దినపత్రిక పీపుల్స్‌ డైలీ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తూ మన బంగారు ఆభరణాలపై అర్థం లేని రాతలు రాసింది.

బంగారు ఆభరణాలకు భారతదేశానికి విడదీయరాని సంబంధం ఉంది. ఆభరణాలు మనదేశ సంస్కృతిలో ఒక భాగం. ప్రపంచంలో అత్యంత పురాతనమై నాగరికతల్లో ఒకటైన సింధూనాగరికతలో కూడా ఇక్కడివారు అనేక ఆభరణాలు ధరించారు. రాళ్ల దగ్గర నుంచి ప్లాటినం వరకు అన్ని రకాల లోహాలతో తయారు చేసిన ఆభరణాలు ధరించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. క్రీస్తు పూర్వం నుంచి భారత దేశం సంపన్న దేశం. స్వర్ణయుగాలు నడిచాయి ఇక్కడ. ఇక్కడ సంపదని కొల్లగొట్టడానికి గ్రీకులు, మహమ్మదీయులు, మొగలాయిలు, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, ఆంగ్లేయులు .. ఇలా అనేకమంది మన దేశంపై దాడులు, దండయాత్రలు చేశారు. మన సంపదని కొల్లగొట్టారు. బంగారు నగలు, మణిమాణిక్యాలు, వజ్రవైఢూర్యాలు దోచుకువెళ్లారు. స్త్రీలే కాకుండా పురుషులు కూడా ఆభరణాలు ధరించడం ఇక్కడి ఆచారం. రాజుల కాలంలో బంగారు సింహాసనాలు ఉండేవి. రాజులు బంగారు కిరీటాలు, ఆభరణాలు ధరించేవారు. ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రాలు మనదేశంలో ఉండేవని చరిత్ర చెబుతోంది. ఎంతమంది ఎంత సంపద దోచుకువెళ్లినా మనదేశంలో బంగారానికి కొందవలేదు. అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో ఇటీవల బయటపడిన సంపదే అందుకు నిదర్శనం. ఇంకా వివరించి చెప్పవలసిన అవసరంలేదు. మహిళలు బంగారు ఆభరణాలు ధరించే విషయంలో ధనిక, పేద అన్న తేడా ఉండదు. ఇక్కడ మహిళలందరూ వివాహానికి గుర్తుగా బంగారు మంగళసూత్రాలను ధరిస్తారు. సామూహిక వివాహాలు జరిపించేవారు కూడా బంగారు మంగళసూత్రాలను ఉచితం ఇస్తారు. మంగళసూత్రం అనేది ఇక్కడ సంస్కృతి ఒక భాగం.

ఇప్పడు చిన్న చిన్న పట్టణాల్లో సైతం ధగధగలాడే దుకాణాలు ఇక్కడ ఉన్నట్లు ‘పీపుల్స్ డెయిలీ’ రాసింది. ఇప్పుడేమిటి వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ అంగళ్లలో రత్నాలు అమ్మారు. ఆనాడే బంగారు దుకాణాలు ధగధగలాడాయి. ఇదంతా చారిత్ర చెబుతున్న సత్యం. శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో బంగారానికి, నవరత్నాలకు కొదవలేదు. దేవాలయాలు నిర్మించే సమయంలో శంకుస్థాపనల సందర్భంగా, ధ్వసస్థంభం ప్రతిష్టాపన సమయంలో ఇప్పుడు నవధాన్యాలు వేస్తున్నారు. అప్పట్లో నవధాన్యాలతోపాటు బంగారం,నవరత్నాలు, వజ్రవైఢూర్యాలు వేసేవారు. వాటినే ఇప్పుడు గుప్త నిధులుగా వెలికితీస్తున్నారు. రాయలు పరిపాలించిన ప్రాంతం అంతా ఈ రకమైన గుప్తనిధులు బయటపడుతూనే ఉన్నాయి. ఇంకా ఎన్నో నిధులు ఉన్నాయి.

ఒక దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను, భాషని, మాండలికాలను కించపరిచేవారు నైతికంగా పతనమైనట్లే లెక్క. అటువంటి వ్యాసాలను ప్రచురించే పత్రికలు విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్లే భావించాలి. ఒక ప్రాంత సంస్కృతినీ, సంప్రదాయాలను, వేషభాషలను కించపరచడం, హేళన చేయడం మంచిపద్దతికాదు. ఇటువంటి దిగజారుడు రాతలను ఖండించవలసిన అవసరం అందరిపైన ఉంది.  
(Sakshi Telugu Daily)