Wednesday, February 10, 2016

51వ వసంతంలోకి ఎస్బీఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ ఈ మధ్యే 50 ఏళ్లు దాటి 51 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. బ్యాంక్ ఏడో సర్కిల్‌గా మొదలైన ప్రస్థానం ఇప్పుడు అనూహ్యమైన వృద్ధిని సాధించి మిగిలిన శాఖలకు పోటీగా ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తమ సేవలు కొనసాగిస్తూ.. రెండు రాష్ట్రాల వృద్ధిలో తాము కీలకపాత్ర పోషిస్తామని సిజిఎం హర్‌దయాల్ ప్రసాద్ చెబ్తున్నారు.

1965లో ఫిబ్రవరి ఒకటో తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఏడో సర్కిల్‌గా హైదరాబాద్ లోకల్ హెడ్ ఆఫీస్  ప్రారంభమైంది. అప్పట్లో 61 బ్రాంచీలు, 41 సబ్ ఆఫీసులు మాత్రమే ఉండేవి. 22 కోట్ల డిపాజిట్లు, 8 కోట్ల అడ్వాన్సులతో మొదలైన ఎల్‌హెచ్ఓ(లోకల్ హెడ్ ఆఫీస్) ప్రస్థానం 50 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు 91 వేల కోట్ల డిపాజిట్లు, 1.03 లక్షల కోట్లు అడ్వాన్సులతో మిగిలిన సర్కిల్స్‌కు ధీటుగా ఎదుగుతోంది హైదరాబాద్.

చీఫ్ జనరల్ మేనేజర్‌గా గతేడాది పదవీ బాధ్యతలు స్వీకరించిన హర్‌దయాల్ ప్రసాద్.. హైదరాబాద్ సర్కిల్‌ను మరింత అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్‌దయాల్ ప్రసాద్, 1983లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తన కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత ఒక్కో మెట్టూ ఎక్కుతూ తన సత్తాను చాటి ఎస్బీఐ లాస్ ఏంజెల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. ఇక్కడి బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన ముంబై ఎల్‌హెచ్‌ఓలో జనరల్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. బ్యాంకింగ్‌లోని వివిధ శాఖల్లో విస్తృతమైన అనుభవాన్ని సంపాదించుకున్న హర్‌దయాల్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇప్పుడు 1,435 శాఖలు పనిచేస్తున్నాయి.

50 సంవత్సరాలు పూర్తిచేసుకుని.. కొద్ది రోజుల క్రితమే 51 సంవత్సరంలోకి అడుగుపెట్టిన హైదరాబాద్ లోకల్ హెడ్ ఆఫీస్ ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. సర్కిల్‌లో పనిచేసిన మాజీ ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైన తమ అనుభవాలు పంచుకున్నారు. ఉద్యోగులంతా ఒక్క చోట చేరి.. జరుపుకున్న సంబరాలు అందరినీ సంతోషంలో ముంచెత్తాయి.

కస్టమర్లకు సులువుగా ఎస్బీఐ రుణాలు

ఒకప్పుడు లోన్లు కావాలంటే.. బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే ఈ మధ్య బ్యాంకులో మన ముంగిట్లోకి వచ్చి లోన్లు ఇచ్చే పరిస్థితి వస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న కార్, హౌజింగ్ మేళాతో కస్టమర్లకు సులువుగా రుణాలు దొరుకుతున్నాయి. డిస్కౌంట్లతో పాటు స్పాట్ అప్రూవల్‌ ఉండడం కూడా కస్టమర్లకు కలిసొస్తోంది.

ఇల్లు.. ఓ సామాన్యుడి కల. సొంతింట్లో ఉంటే ఆ అనందమే వేరు. ఎన్ని తిప్పలు పడ్డా.. చివరకు ఓ గూడు ఉండాలనేది ప్రతీ ఒక్క మధ్యతరగతి వ్యక్తి ఆలోచన. అందుకే బ్యాంకులు కూడా ముందుకు వచ్చి విరివిగా తమ కస్టమర్లకు లోన్లు ఇస్తూ ఉంటాయి. అయితే ప్రభుత్వ బ్యాంకులు మేలా.. ప్రైవేట్ బ్యాంకులు మేలా అనే కన్ఫ్యూజన్‌తో ఉంటారు జనాలు. సాధారణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడల్లా ఎస్బీఐ వంటి ప్రముఖ బ్యాంకులే వడ్డీల్లో మొదట కోత విధిస్తాయి. మిగిలిన వాటితో పోలిస్తే కొన్ని బేస్ పాయింట్లు వడ్డీ కూడా తక్కువే ఉంటుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు వంటివి కూడా కాస్త అందుబాటులోనే ఉంటాయి. అందుకే ఎస్బీఐ వంటి వాటికే కస్టమర్లు ఎక్కువగా మొగ్గుచూపుతూ ఉంటారు.

లోన్లు కావాలంటే ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు బ్యాంకులే మన ఇళ్ల దగ్గరికి వచ్చేస్తున్నాయి. కార్ మేళా, హౌజింగ్ లోన్ మేళా పేరుతో కస్టమర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంది. తరచూ రుణమేళాలు నిర్వహిస్తూ కస్టమర్లకు చేరువవుతోంది. ఇలాంటి ప్రాపర్టీ షోస్ నిర్వహించడం వల్ల బిల్డర్లు, కస్టమర్లను ఒకే వేదికపైకి తెచ్చినట్టు అవుతుందని బ్యాంకర్లు చెబ్తున్నారు.
ప్రాసెసింగ్ ఫీజ్‌ను రద్దు చేయడంతో పాటు సింపుల్ లోన్ ప్రాసెస్‌ ఉండడం వల్ల కస్టమర్ల టైం సేవ్‌ అవుతుందనేది వీళ్ల భావన.

అటు బిల్డర్లు, ఇటు బ్యాంకూ ఒకే చోట ఉండడం చాలా సంతోషంగా ఉందంటున్నారు కస్టమర్లు. మొదట ప్రాపర్టీల చుట్టూ తిరగడం, వాటికి లోన్లు వస్తాయో రావడం తికమకపడాల్సిన అవసరం లేదంటున్నారు. రుణాలు ఇచ్చే బ్యాంకులే ముందుకు రావడం సంతోషంగా ఉందనేది మరికొంత వినియోగదారుల మాట.

ఇలాంటి ప్రాపర్టీస్ మేళా వల్ల తమకు కన్వర్షన్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయని బిల్డర్స్ చెబ్తున్నారు. స్పాట్ సాంక్షన్స్ వల్ల కస్టమర్లకు కూడా ఒక క్లారిటీ వస్తుందనేది వాళ్ల సంతోషం.

ఇలాంటి రుణమేళాలలో ప్రాసెసింగ్ ఫీజులు రద్దు చేయడం, కొన్ని బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లలో డిస్కౌంట్లు కూడా ఇవ్వడంతో కస్టమర్లు కూడా ఆకర్షితులవుతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తామని చెబ్తున్నారు అధికారులు.

అరుంధతీ భట్టాచార్య నాయకత్వంలో ఎస్బీఐ

రెండు శాతాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న బ్యాంకులో మొదటిసారిగా మహిళ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు అరుంధతీ భట్టాచార్య. మూడేళ్ల క్రితం ఆమె ఎస్బీఐ పగ్గాలు చేపట్టినప్పుడు అంతా నోరెళ్లబెట్టారు. అయితే అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ.. అరుంధతీ భట్టాచార్య దూసుకుపోతున్నారు. ప్రైవేట్ బ్యాంకులకు ధీటుగా తీర్చిదిద్దడంతో పాటు కొత్తతరం జనాలకు చేరువ చేసేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు అందరి మన్ననలూ పొందుతున్నాయి.


బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం అరుంధతీ భట్టాచార్య సొంతం. 1977లో ఎస్‌బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా ఆమె చేరారు. 39 సంవత్సరాల తన కెరీర్‌లో రిటైల్, ట్రెజరీ, కార్పొరేట్ ఫైనాన్స్ వంటి విభాగాల్లో కీలక బాధ్యతలను నిర్వహించారు. డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్, కార్పొరేట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, మర్చంట్ బ్యాంకింగ్‌ చీఫ్ వంటి ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించారు. జనరల్ ఇన్సూరెన్స్, కస్టడీ సర్వీసెస్, ఎస్‌బీఐ మెక్వైరీ ఇన్‌ఫ్రా ఫండ్ సబ్సిడరీస్ వంటి విభాగాల ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించారు. బ్యాంక్ న్యూయార్క్ ఆఫీస్ ఎక్స్‌టర్నల్ ఆడిట్, కరస్పాండెంట్ రిలేషన్స్ చీఫ్‌గా కూడా ఆమె బాధ్యతలు నిర్వహించారు.

57 ఏళ్ల అరుంధతీ భట్టాచార్య.. బ్యాంకులో నూతన్నోత్తేజాన్ని నింపారు. సోషల్ మీడియాలో రావాలని గతంలో ప్రయోగం చేసి కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎస్బీఐ.. ఈమె సారధ్యంలో దూసుకుపోయింది. వస్తూవస్తూనే ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్‌లలో బ్యాంక్ ప్రమోషన్‌కు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఎస్బీఐకి ట్విట్టర్‌లో  3.24 లక్షల మంది, ఫేస్ బుక్‌లో 39 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇవే కాదు ఇన్‌స్టాగ్రామ్, పిన్‌ట్రెస్ట్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ ఎస్బీఐ హవా కనిపిస్తోంది. ఎస్బీఓ అంటే ఓ ఓల్డ్ ఫ్యాషన్డ్ గవర్నమెంట్ బ్యాంక్ అనే ట్యాగ్‌ను పూర్తిగా చెరిపేసి 'జెన్ వై' కస్టమర్లకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

బ్యాంకును అంతర్గతంగా, బహిర్గతంగా పటిష్టం చేసేందుకు ఎన్నో చర్యలు చేపట్టారు. మొండి బకాయిలతో ఇబ్బందిపెట్టేవాళ్లను గుర్తించడం, ఖర్చుల తగ్గింపు, హెచ్ఆర్‌ విభాగాల్లో మార్పులు, కస్టమర్ సర్వీస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం వంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భట్టాచార్య బాధ్యతలు చేపట్టాక బ్యాంక్ డిపాజిట్స్ 13 శాతం పెరిగాయి. ఎస్బీఐ ఆస్తులు 14.24 శాతం వృద్ధి చెందడంతో పాటు లాభాలు కూడా ఇరవై శాతం వరకూ పెరిగాయి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆమెను బెస్ట్ సీఈఓ 2015గా మార్చాయి.

స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ యాప్ కూడా ఆమె సారధ్యంలో రూపకల్పన జరిగిందే. ఒక్క ఏడాదికాలంలోనే రూ. 11,662 కోట్ల విలువ చేసే 7.71 కోట్ల లావాదేవీలు ఈ వేదిక ద్వారా జరిగాయి. మొబైల్ బ్యాంకింగ్ స్పేస్‌లో ఇప్పుడు ఎస్బీఐ మార్కెట్ లీడర్. ప్రస్తుతం ఎస్బీఐ దగ్గర 1.35 కోట్ల మంది మొబైల్ యూజర్స్ ఉన్నారు. మొత్తం మొబైల్ బ్యాంకింగ్‌లో ఒక్క ఎస్బీఐ వాటానే 46 శాతం. 13 భాషల్లో ఉన్ 'బడ్డీ' డిజిటల్ వాలెట్ ఇప్పటికే ఎంతో మంది చేరువైంది. 'బటువా' పేరుతో మరో యాప్‌ను మాస్‌ కోసం తయారు చేసేందుకు భట్టాచార్య ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలా ఒక్క రిటైల్ కస్టమర్లకే పరిమితం కాకుండా కార్పొరేట్ జనాలకు కూడా ఎన్నో సేవలను అందుబాటులోకి తెచ్చి డిటిటల్ సీఈఓగా పేరుతెచ్చుకున్నారు అరుంధతీ భట్టాచార్య.

దూసుకుపోతోన్న ఎస్బీఐ

లీడర్.. లీడ్స్ ఫ్రం ది ఫ్రంట్.. అంటారు. అంటే.. ముందుండి నడిపించే వాడే నాయకుడు. బ్యాంకింగ్ సామ్రాజ్యంలో ఎస్బీఐ కూడా అలాంటి పాత్రే పోషిస్తోంది. బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్ అని అనిపించుకుంటున్న ఎస్బీఐ... టెక్నాలజీని, వినూత్నతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటోంది. ఇతర బ్యాంకులు ఎంత పరిజ్ఞానంతో ముందుకు వచ్చినా.. వాళ్లందరినీ బీట్ చేస్తూ.. దూసుకుపోతోంది.


ఏ వ్యవస్థనైనా నూతనత్వమే ముందుకు నడిపిస్తుంది. కస్టమర్ల అవసరాలు, మారుతున్న కాలానికి తగ్గట్టు మారితేనే మనుగడ ఉంటుంది. ప్రపంచమంతా అత్యంత వేగంగా ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ఏ మాత్రం వెనుకబడినా ఇబ్బందులు తప్పవు, అందునా ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో ఆ జోరు మరింత ముఖ్యం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత స్పీడ్‌లో ఓన్ చేసుకుంటే.. అంత స్పీడ్‌గా వృద్ధి కూడా ఉంటుంది. బ్యాంకులకు వచ్చి కార్యకలపాలు నిర్వహించుకునే స్థాయి నుంచి జనాలు ఇంట్లో కూర్చునే పనులు కానించేసే పరిస్థితులు వచ్చేశాయి. చేతుల్లో ఉన్న మొబైల్‌తోనే ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు జనాలు ఎక్కువగా మొగ్గుచూపుతున్న పరిస్థితులు. బ్యాంక్ శాఖల్లో క్యూ లైన్లలో నిలబడేందుకు కూడా జనాలు సిద్ధంగా లేరు. అందుకే వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఎస్బీఐ కూడా జోరు పెంచుతూ వస్తోంది. ఓ వైపు బ్రాంచ్ నెట్‌వర్క్ విస్తరించుకుంటూనే టెక్నాలజీని కూడా బలోపేతం చేస్తోంది.

ఎస్‌బిఐఐన్ టచ్ (SBIIN TOUCH) పేరుతో బ్యాంక్ ఈ మధ్యే ఆరు సరికొత్త డిజిటల్ టెక్నాలజీ బ్రాంచులను ప్రారంభించింది. ఢిల్లీ సహా ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో ఈ శాఖలు ఉన్నాయి. యంగ్ జనరేషన్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వీటిని ప్రారంభించారు. ఈ కియోస్క్ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే బ్యాంక్ ఖాతాను తెరవచ్చు. ఈ ఇంటరాక్టివ్ మెషీన్స్ ద్వారా అక్కడికక్కడే ఫోటోగ్రాఫ్స్ తీసుకుని, డాక్యుమెంట్లను స్కాన్ చేసుకుని సబ్మిట్ చేయవచ్చు. త్వరలో ఇలాంటి డిజిటల్ బ్యాంకుల సంఖ్యను 250కి పెంచబోతున్నట్టు ఎస్బీఐ చెబ్తోంది. ఇప్పటికే బిజినెస్ కరస్పాండెంట్ల నెట్‌వర్క్ ఉన్న ఈ సంస్థ.. మరింత మందికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. డిజిటల్ బ్యాంకుల్లో కేవలం ఒకరిద్దరు ఉద్యోగులు మాత్రమే ఉండి సేవలందిస్తారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా వీటిని విస్తరించాలని బ్యాంక్ యోచిస్తోంది. స్మార్ట్ ఏటిఎం, పర్సనలైజ్డ్ ఏటిఎం కార్డులు వంటివి కూడా కస్టమర్ల అభిమానాన్ని చూరగొన్నాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోనూ నిత్యం మార్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియాలో భాగంగా అనేక కార్యక్రమాలను బ్యాంక్ డిజిటలైజ్ చేస్తూ వస్తోంది.

గతేడాది బడ్డీ పేరుతో స్టేట్ బ్యాంక్ ఓ మొబైల్ వాలెట్ ప్రారంభించింది. యాక్సెంచర్, మాస్టర్ కార్డ్‌ కలిసి దీన్ని రూపొందించింది. ఇప్పుడు బ్యాంకుకు ఉన్న దాదాపు 30 కోట్ల మంది కస్టమర్లలో దాదాపు రెండు కోట్ల మంది ఇంటర్నెట్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. కోటి ఇరవై లక్షల మంది మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్లు ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఈ బ్యాంకును అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ లాంటి దేశంలో బ్యాంకింగ్‌కు ఇంకా చాలా స్కోప్ ఉంది. ఇక్కడి నుంచి ఎన్నో రెట్లు అభివృద్ధి చెందేందుకు కూడా అవకాశం కలిగి ఉన్న నేపధ్యంలో ఎస్బీఐ లాంటి అతిపెద్ద బ్యాంక్ ఇలాంటి ఆలోచనలతో ముందుకు రావడం హర్షించాల్సిన విషయం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుదీర్ఘమైన చరిత్ర

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ది బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. దేశంలోని నెంబర్ ఒన్ ప్రభుత్వ బ్యాంక్. దేశవ్యాప్తంగా అనేక మారుమూల ప్రాంతాల్లో ఈ బ్యాంక్ తన నెట్‌వర్క్ విస్తరించి ఉంది. కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం ఉంటుందో ఉండదో కానీ.. అక్కడ మాత్రం ఎస్బీఐ శాఖ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్ అనే ట్యాగ్ లైన్‌లానే.. మన దేశంలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక రూపంలో ఎస్బీఐతో అనుబంధం ఉండనే ఉంటుంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రైవేట్ బ్యాంకులతో పోటీపడడం, వినూత్న ప్రోడక్టులతో కస్టమర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకోవడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే సాధ్యమైంది. అందుకే కోట్లాది మంది కస్టమర్లు ఎస్బీఐని తమ సొంత బ్యాంకులా భావిస్తారు.

మన ఊళ్లో.. మన కాలనీలో, ఇంటర్నెట్లో.. ఇంటిపక్కన కనిపించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుదీర్ఘమైన చరిత్రే ఉంది. బలమైన పునాదులపై నిర్మాణమైన ఈ బ్యాంక్ నానాటికీ అంతే ధృడంగా మారుతూ వస్తోంది. 1806లో మొదలైన ప్రస్థానం.. అంచలంచెలుగా... ఎదిగి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో చేరింది.

బ్రిటిష్ పాలనా కాలంలో నుంచే ఎస్‌బీఐ మూలాలు ఉన్నాయి. 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తా ఏర్పాటయ్యింది. తరువాత 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబేను నెలకొల్పారు. 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఏర్పాటయ్యింది. 1921లో ఈ మూడు బ్యాంకుల విలీనంతో కలకత్తా కేంద్రంగా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను బ్రిటిషర్లు ఏర్పాటు చేశారు. ఈ బ్యాంకును 1955లో నెహ్రూ ప్రభుత్వం జాతీయీకరణ చేసింది. ఇంపీరియల్ బ్యాంక్ పేరును పార్లమెంటులో చట్టం ద్వారా  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద 66వ బ్యాంకుగా ఎస్బీఐ కీర్తిగడించింది. దేశంలోని మొత్తం బ్యాంకింగ్ అసెట్స్‌లో ఎస్‌బీఐ, దాని ఐదు అనుబంధ బ్యాంకులు 20 శాతం పైగా వాటాను కలిగి ఉన్నాయి.

20 లక్షల కోట్లకు పైగా ఆస్తులు, 16 వేలకు పైగా శాఖలు, 36 దేశాల్లో 190కి పైగా ఫారిన్ ఆఫీసులు.. ఇదీ సింపుల్‌గా ఎస్బీఐ ట్రాక్ రికార్డ్. దాదాపు 29 కోట్ల మంది ఖాతాదారులు, 45 కోట్లకుపైగా ఖాతాలతో ఎస్బీఐ దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థగా అలరారుతోంది. దేశంలో ఉన్న శాఖల్లో దాదాపు 66 శాతం బ్రాంచ్‌లు గ్రామీణ - ద్వితీయ శ్రేణి నగరాల్లోనే ఉన్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, చిన్న పట్టణాలపై కూడా బ్యాంకుకు ఉన్న శ్రద్ధ ఎలాంటిదో. అదే స్థాయిలో మాస్కో, కొలంబో, హాంకాంగ్, ఫ్రాంక్‌ఫర్ట్, టోక్యో, సిడ్నీ, లండన్.. ఇలా వివిధ దేశాల్లో ఎన్‌ఆర్‌ఐలకు చేరువయ్యేందుకు కూడా ఎస్బీఐ శాఖలను తెరిచింది. 2014 ఆర్థిక సంవత్సరం నాటికి ఎస్బీఐకి 43,515 ఏటిఎంలు ఉన్నాయి. అనుబంధ బ్యాంకులతో కూడా కలిపి చూసుకుంటే ఈ సంఖ్య 53 వేలకు పెరుగుతుంది. జమ్మూ - కాశ్మీర్ కార్గిల్ వంటి అతి సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతంలో ఏటిఎం ఏర్పాటు చేసిన ఘనత కూడా ఎస్బీఐకే దక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. దేశ అత్యున్నత బ్యాంకుకు ఉన్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. వీటిని బ్రేక్ చేయడం కాదు కదా.. దరిదాపుల్లోకి వచ్చే సత్తా కూడా మిగిలిన వాటికి లేదు అంటే ఆశ్చర్యం కాదు.

ఎస్బీఐ అసోసియేట్ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ ఉన్నాయి. నాన్ బ్యాంకింగ్ సబ్సిడరీల్లో క్యాపిటల్ మార్కెట్స్, ఎస్బీఐ కార్డ్స్, జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి. ఆర్థిక, బ్యాంకింగ్ విభాగాల్లో తన సత్తా చాటుతున్న బ్యాంక్ నానాటికీ విస్తరిస్తోంది. అందుకే అవార్డుల్లోనూ ఈ  బ్యాంకుకు సాటిలేదు. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్‌లో చేరిన మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఇదే. ఫోర్బ్స్ టూ థౌజండ్ (2000) లార్జెస్ట్ కంపెనీస్ ఇన్ ది వాల్డ్‌ లిస్ట్‌లో కూడా తన స్థానాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటోంది ఎస్బీఐ. లండన్‌కు చెందిన ది బ్యాంకర్ మ్యాగ్జైన్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్  - 2008గా అవార్డును ఇచ్చింది. ఆర్థిక రంగంలో రెప్యుటేషన్ ఉన్న టాప్ కంపెనీలపై వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన సర్వేలో మొదటి ర్యాంకును కైవసం చేసుకున్న ఘనత కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే దక్కింది. రికార్డులు క్రియేట్ చేయడంలో అయినా, వాటిని బ్రేక్ చేయడంలో అయినా ఎస్బీఐకి ఎస్బీఐ మాత్రమే సాటి అని ప్రపంచం మొత్తం మెచ్చుకుంటోంది.

Tuesday, January 5, 2016

స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిలుపుదల ఎందుకు?

(ఈనాడు సౌజన్యంతో)
నూతన సంవత్సరం తొలి ట్రేడింగ్‌ రోజైన సోమవారం చైనా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో షేర్లు 7% నష్టపోవడంతో, ట్రేడింగ్‌ను నిలిపి వేశారు. విపణిలో అధిక హెచ్చుతగ్గులను నివారించేందుకు ప్రవేశపెట్టిన సర్క్యూట్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ ఈ రోజు నుంచే పని ప్రారంభించినట్లు అయ్యింది. అయితే దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మాత్రం షేర్ల ధరల్లో 20 శాతం కదలిక ఉంటేనే ట్రేడింగ్‌ నిలుపుతారు.
చైనాలో ఇలా: చైనాలో అమల్లోకి వచ్చిన సర్క్యూట్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ ప్రకారం సీఎస్‌ఐ300 సూచీ 5 శాతం నష్టపోతే, షాంఘై, షెన్‌జెన్‌ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్‌ను 15 నిముషాల పాటు నిలుపుతారు. ఒకవేళ పతనం కొనసాగి చూసీ 7% నష్టపోతే, మిగిలిన రోజంతా ట్రేడింగ్‌ను రద్దు చేస్తారు.
మన దేశంలో..: దేశీయ ఈక్విటీ విపణుల్లో మాత్రం సర్క్యూట్‌ బ్రేకింగ్‌ అమలుకు సూచీ కదలికల పరిధిని మరింత పెంచారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలలో ఏ సూచీలో అసాధారణ కదలిక ఏర్పడినా, ఈక్విటీలతో పాటు డెరివేటివ్‌ల ట్రేడింగ్‌ మొత్తాన్ని నిలిపేస్తారు.
* మధ్యాహ్నం ఒంటి గంటలోపు సూచీ 10 శాతం పెరిగినా/నష్టపోయినా ట్రేడింగ్‌ మొత్తాన్ని 45 నిముషాలు నిలిపేస్తారు. అదే మధ్యాహ్నం 1-2.30 గంటల మధ్య సూచీ కదలికల్లో 10 శాతం తేడా వస్తే, ట్రేడింగ్‌ను 15 నిముషాలే ఆపుతారు. ఒకవేళ మధ్యాహ్నం 2.30 గంటల తరవాత ఈ పరిణామం సంభివిస్తే, ట్రేడింగ్‌ను నిలుపరు.
* మధ్యాహ్నం ఒంటి గంట లోపే సూచీ 15 శాతం క్షీణించినా, లాభాలతో దూసుకెళ్లినా 105 నిముషాల సేపు ట్రేడింగ్‌ ఆపేస్తారు. ఇది మధ్యాహ్నం 1-2 గంటల మధ్య సంభవిస్తే ట్రేడింగ్‌ను 45 నిముషాలు నిలుపుతారు. అదే మధ్యాహ్నం 2 గంటల తరవాత సూచీలో 15 శాతం కదలిక వస్తే, మిగిలిన సమయం మొత్తం ట్రేడింగ్‌ ఆగిపోతుంది.
* ఒకవేళ సూచీ 20 శాతం కుంగినా, లాభపడినా మిగిలిన రోజంతా ట్రేడింగ్‌ను నిలిపి వేస్తారు.