Tuesday, December 8, 2015

స్టార్టప్ మానియా

ప్రపంచంలో ఎక్కడాలేని స్టార్టప్ మానియా మనదేశంలో కనిపిస్తోంది. ఉద్యోగాల్ని అర్థించకుండా.. కల్పించాలన్న ప్రభుత్వాల పిలుపు యువతపై బాగా ప్రభావం చూపింది. ఏమాత్రం అనుభవం లేకుండానే ఈ రంగంలోకి దిగుతూ బోర్లా పడుతున్నారు. అదే చక్కని వ్యాపార వ్యూహాలతో ముందుకెళ్లే కంపెనీలు మంచి లాభాల్నే చవిచూస్తున్నాయి.

మనదేశంలో స్టార్టప్ కంపెనీల్లో పదిశాతం మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. వ్యాపారంలో అనుభవం లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. టాప్ బిజినెస్ స్కూళ్లు, ఐఐటీ, ఐఐఎంల్లో చదువుకున్న వాళ్లయినా సరే.. నేరుగా వ్యాపారంలో దిగితే నష్టపోతున్న వారు అనేకం. అదే కొన్నాళ్ల ఉద్యోగ అనుభవం తర్వాత వస్తున్న వారు మాత్రం ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న సందర్భాలు చాలా తక్కువ. స్టార్టప్ ల కోసం యూత్ తహతహలాడేందుకు కారణం ఈ-కామర్స్ బూమే. నాలుగైదేళ్లు వెనక్కి వెళ్తే టెలికాం రంగంలో ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్.. ఇలా అన్ని కంపెనీలు పోటాపోటీగా ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేవి. నెలనెలా కోట్లలో కొత్త సిమ్ కార్డులు సేల్ అవుతుండేవి. కారణం.. కంపెనీల ఆఫర్ల కోసమే తీసుకునేవాళ్లు ఎక్కువ. ఆఫర్ అయిపోగానే వాటిని పక్కన పడేసేవాళ్లు. అంటే వాపు చూసి బలుపు అనుకున్నాయి అప్పట్లో టెలికం కంపెనీలు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఈకామర్స్ రంగంలో కనిపిస్తోంది.

ప్రస్తుతం భారత ఈకామర్స్ మార్కెట్ విలువ దాదాపు రెండు లక్షల కోట్లు. 2020 నాటికి నాలుగు రెట్లు పెరుగుతుందని గోల్డ్ మాన్ శాక్స్ అంచనా. టాప్ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ అయిన ఫ్లిప్ కార్ట్ సేల్స్ చూస్తే 2013-14కన్నా 14-15వ ఆర్థిక సంవత్సరంలో మూడింతలు  పెరిగాయి. కానీ పైసా లాభం రాలేదు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2వేల కోట్లు నష్టపోయింది. అంతకుముందు ఏడాది నష్టం 715 కోట్లు.  సేల్స్ పెరుగుతున్నకొద్దీ నష్టాలు ఇంకా ఎక్కువవుతున్నాయి. ఆపరేషనల్ కాస్ట్ పెరగడమే దీనికి కారణం. డిస్కౌంట్లు, ప్యాకేజింగ్, రవాణా, ఉద్యోగుల జీతాలు, వెబ్ సైట్ నిర్వహణ, లేటెస్ట్ టెక్నాలజీ వాడకం.. ఇలా అన్నీ ఖర్చులే. ఆదాయ మార్గాలు మాత్రం సెల్లర్స్ నుంచి వచ్చే కమీషన్, కస్టమర్ డేటా, లాయల్ కస్టమర్స్ కొనుగోళ్లు. అన్ని వెబ్ సైట్లదీ ఇదే పరిస్థితా అంటే అదేంలేదు. ఇందుకు అమెజాన్, ఈబే లాంటి కంపెనీలే నిదర్శనం. బహుళజాతి ఆన్ లైన్ మార్కెట్ సంస్థలైన అమెజాన్, ఈబే, అలీబాబా చక్కని లాభాల్ని ఆర్జిస్తుండటం విశేషం. కారణం.. వాటికి పటిష్టమైన బ్యాక్ ఎండ్ వ్యవస్థ ఉండటం ఒకటైతే.. ఒక్కసారిగా లాభాలు ఆర్జించే దగ్గరి దారుల్ని వెతకవవి. ఎంత డిస్కౌంట్ ఇవ్వొచ్చో అంతే ఇస్తాయి. అదే వాటిని ఇంతటి పోటీ ప్రపంచంలోనూ మేటి ఈకామర్స్ కంపెనీలుగా నిలబెట్టాయి.

వెబ్ సైట్లు, యాప్ లంటూ టెక్నాలజీకి, కస్టమర్లను ఎట్రాక్ట్ చెయ్యడానికే ఎక్కువ ఖర్చు పెడుతున్న మన కంపెనీలు.. ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టట్లేదన్నది నిపుణుల విశ్లేషణ. వాట్సాప్ లాంటి కంపెనీలు ఖాతాదారుల అభిరుచులు, ఆలోచనలను తెలుసుకుని.. వాటిని విశ్లేషించి విక్రయించడం ద్వారా భారీ ఆదాయం ఆర్జిస్తున్నాయి. కానీ మన ఈకామర్స్ సైట్ల దగ్గరా కోట్లలో కస్టమర్లున్నా.. వారు ఏమేం కొంటారో తెలిసినా.. ఆ డేటాని విశ్లేషించలేకపోతున్నాయి. పైగా యాడ్ రెవెన్యూని పెంచుకోవడంలోనూ వెనుకబడ్డాయి. అందుకే చివరికి ఉద్యోగుల్ని తొలగిస్తూ.. ఆపరేషన్స్ క్లోజ్ చేస్తూ అబాసుపాలవుతున్నాయి. సో ఏ రకంగా చూసుకున్నా... అనుభవం... అనుభవ రాహిత్యం మధ్య తేడా గమనించకుండా వ్యాపార రంగంలో అడుగు పెడితే చేతులు కాలడం ఖాయమన్నది ఈ కామర్స్‌ బిజినెస్‌ను చూస్తే అర్థమవుతుంది.

ఆన్‌లైన్ బూమ్‌తో తంటా

యూత్ ఎక్కువగా ఉన్న మన దేశంలో ఆన్ లైన్ బూమ్ తెచ్చిన తంటా అంతాఇంతా కాదు. సంప్రదాయ వ్యాపారాన్ని దెబ్బతీస్తూ యావద్దేశాన్ని ఈ-కామర్స్ వైపు ఆకర్షిస్తోంది. ఐతే సరైన ప్లాన్ లేక.. గంపెడాశలతో వచ్చిన చాలా స్టార్టప్ కంపెనీలు ఏడాది తిరక్కముందే చాపచుట్టేస్తున్నాయి. చిన్నాచితకా వెబ్ సైట్లే కాదు.. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి టాప్ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ లకూ నష్టాలు తప్పలేదు.

ఆన్ లైన్ బూమ్ మనదేశంలో వ్యాపార పోకడల్ని పూర్తిగా మార్చేసింది. గుండు పిన్ను మొదలు కార్ల వరకూ ఇప్పుడేది కావాలన్నా ఆన్ లైన్లో కొనుక్కోవచ్చు. కొన్ని కంపెనీలు సొంతంగా.. వాటి ఉత్పత్తుల కోసమే ఆన్ లైన్ మార్కెట్లో ప్రవేశిస్తే.. అంగళ్లను పోలిన వ్యాపార విధానంలో ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, ఆస్క్ మీ బజార్, పేటీఎం లాంటివి అమ్మకాల్లో అదరగొడుతున్నాయి.

బిగ్  బిలియన్ డే, వీకెండ్ ఆఫర్స్, ఫెస్టివల్ డేస్.. ఇలా తోచిన ఆలోచనని అమలు చేస్తూ కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇన్ని వెబ్ సైట్లలో దేంట్లో కొనాలో అన్న అయోమయం మీకెందుకంటూ.. ఎక్కడ తక్కువ ధర ఉందో చెప్పేందుకు మరో వెబ్ సైట్.. ఇలా వ్యాపారమంతా ఆన్ లైన్ అయిపోయింది. అదే వాటికి చేటు తెస్తోంది. అంతా ఒక్క క్లిక్ తోనే తెలిసిపోతుంది. ఇది ఓ విధంగా కస్టమర్లకు వరంలా మారినా.. కంపెనీలకు ప్రతికూలంగా తయారైంది. కస్టమర్లను నిలుపుకోవడం ఇప్పుడు ఈకామర్స్ కంపెనీలకు సవాల్‌గా మారింది.

బూమ్ ని చూసి మొదట్లో ఈ-కామర్స్ సైట్లకు వందలు, వేల కోట్ల పెట్టుబడులు వరదలా వచ్చిపడ్డాయి. విదేశీ వెంచర్ క్యాపిటల్ సంస్థలతోపాటు దేశీయంగానూ ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడికి ఛాన్స్ వస్తే చాలన్నట్లు వ్యవహరించారు. ఒక్కసారిగా వచ్చిపడ్డ నిధుల్ని చూసి చాలా కంపెనీలు వాటి వ్యాపారాన్ని వేగంగా విస్తరించాయి. ప్రాడక్ట్ పోర్ట్ ఫోలియోతోపాటు తమ వెబ్ సైట్లో అమ్ముకునే రిటైలర్ల సంఖ్యనీ గణనీయంగా పెంచుకున్నాయి. ఇందుకోసం వేలమంది ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. దీంతో దశాబ్దాలుగా మెట్టూ మెట్టూ ఎక్కుతూ వచ్చిన టాటా, బిర్లా, రిలయన్స్ లాంటి కంపెనీల మార్కెట్ విలువ సైతం వీటిముందు దిగదుడుపైంది. ఒక్కరోజే ఆరొందల కోట్ల అమ్మకాలు జరిగితే ఏటా ఎంతుండాలి.. లాభమెంత వస్తుంది.. ఐదేళ్లు, పదేళ్లు.. ఇలా భవిష్యత్తు లాభాల్ని పేపర్ పై పెట్టడంతో ఈ-కామర్స్ కంపెనీల మార్కెట్ విలువ లక్షల కోట్లకు చేరింది. అంతా గుడ్ విలే.. కానీ విలువ మాత్రం వేలు, లక్షల కోట్లలనే ఉంది. దీన్ని చూసి కొత్త స్టార్టప్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్లాన్ ని పేపర్ పెట్టడం, నిధులు రాబట్టడం.. అనుకుందే తడవు నెలలోపే స్టార్ట్ చెయ్యడం జరిగిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఆ తర్వాతే వాటికి చుక్కలు కనిపిస్తున్నాయి. మొదట్లో కస్టమర్ ని రాబట్టుకోవడానికి రిటైలర్ రేట్ మీద మరికొంత డిస్కౌంట్ ఇచ్చిన కంపెనీలు.. తర్వాత వారిని నిలబెట్టుకోవడానికి కూడా మళ్లీ మళ్లీ డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తోంది. అంటే తయారీ ధరకన్నా తక్కువ ధరకే అమ్ముతున్నారన్నమాట. వాటికితోడు ప్యాకింగ్, డెలివరీ అదనపు ఖర్చులు ఎలాగూ ఉన్నాయి. ఇంతా చేసినా కస్టమర్లు సెలెక్టివ్ గా కొన్ని ఉత్పత్తులు మాత్రమే  ఎక్కువగా కొంటున్నారు. అవికూడా కంపెనీలకు తక్కువ మార్జిన్లు వచ్చే ఉత్పత్తులే. ఎక్కవు కమీషన్ ఉండే ఉత్పత్తుల అమ్మకాలు పెరిగితేనే నష్టాల్ని తగ్గించుకోవచ్చన్నది వాటి వ్యూహం. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. దీంతో నిర్వహణ కష్టంగా మారింది. కొత్త నిధులు రాక, ఇక డిస్కౌంట్లు ఇచ్చేపరిస్థితి లేక.. చాలా కంపెనీలు చేతులెత్తేశాయి. కొంతమంది ఎంతకో అంతకు వెబ్ సైట్లను అమ్మేసుకుంటుండగా.. ఇంకొంతమంది కార్యకలాపాలను పూర్తిగా ఆపేశారు. ఈ ప్రభావం రెడీమేడ్ ఫుడ్, గ్రాసరీ రంగంలోని వెబ్ సైట్లపై ఎక్కువగా పడింది. ఫుడ్ పాండా, స్విగ్గీ, జొమాటో.. ఇలా ఎన్నో సైట్లు మనకు దగ్గర్లోని రెస్టారెంట్లను వెతికి పెట్టడమే కాక.. ఆర్డరిస్తే అరగంటలో రెస్టారెంట్ రేటు కన్నా తక్కువకే ఇంటికి తెచ్చిస్తున్నాయి. రెస్టారెంట్ల నుంచి వచ్చే 10-15శాతం కమీషన్ ట్రాన్స్ పోర్టేషన్ కే పోతుంది. మరి ఉద్యోగి శాలరీ, వెబ్ సైట్ నిర్వహణ, ప్రకటనల ఖర్చులు.. ఇలా చూస్తే ఏ విధంగానూ లాభం వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అటు ట్యాక్సీ క్యాబ్స్ కోసం వచ్చిన ఓలా, ఉబర్ లాంటి కంపెనీలు గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి.

ఇక కిరాణా సరకుల రంగంలో ఉన్న గ్రాసరీ వెబ్ సైట్లదీ మరీ దీనగాధ అని చెప్పాలి. డిస్కౌంట్లు, కూపన్స్ అంటూ ఇంటర్నెట్లో విచ్చలవిడి ప్రచారమే వాటి కొంపముంచుతోంది. ఇలాంటి ఎత్తుగడల్ని ఎలా సొమ్ము చేసుకోవచ్చో బాగా తెలిసిన మన నెటిజన్లు.. ఫ్రీ కూపన్స్ వరకే వాటి దగ్గర కొనుగోలు చేస్తున్నారు. మిగతా వాటికోసం ఇంటి దగ్గర్లోని దుకాణాలకు, హోల్ సేల్ షాపులకు వెళ్తున్నారు. అందుకే చాలా వెబ్ సైట్లు ఒకట్రెండు నెలల్లో వందల మంది ఉద్యోగుల్ని తొలగించాయి. భవిష్యత్తు లాభాల్ని చూసి వీటిలో పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. లాభం మాట దేవుడెరుగు అసలొస్తే చాలన్నట్లు తమ వాటాల్ని అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

కస్టమర్లకు వరం.. కంపెనీలకు నష్టాలు

ఏ వస్తువైనా తయారీ ధరకు దొరుకుతుందా? పైసా లాభం లేకుండా ఎవరైనా అమ్ముతారా? సంప్రదాయ వ్యాపారంలో ఈ పరిస్థితి ఎక్కడా ఉండదు. ఒక్కో మెట్టు ఎక్కితేనే పైకెళ్లేది.. ఒకేసారి ఆకాశానికి నిచ్చెనెయ్యాలని చూస్తే ఏమవుతుంది? ఈ తప్పే ఇండియన్ ఈ-కామర్స్ ని ఒక్కసారిగా పాతాళంలోకి నెట్టేసింది. భవిష్యత్తు లాభాల్ని బేరీజు వేసుకొని వర్తమానంలో నష్టాల్ని కోరి కొనితెచ్చుకుంటున్నాయి.

అతి సర్వత్రా వర్జేయత్.. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ఏ వ్యాపారంలోనైనా ప్రాథమిక సూత్రం ఒకటి ఉంటుంది. లాభాల విషయం పక్కనబెడితే నష్టం రాకుండా అమ్ముకోవాలి. కానీ స్టార్టప్ ల పేరుతో రోజుకో ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ పుట్టుకొచ్చి.. పూర్తి వ్యతిరేక విధానంలో వ్యాపారం చేస్తున్నాయి. నష్టమొచ్చినా సరే కస్టమర్ ని ఆకర్షించాలన్న సూత్రంతో ముందుకెళ్తున్నాయి. కస్టమర్ బేస్ పెరిగితే లాభాలు వాటంతటవే వస్తాయన్నది ఈ-కామర్స్ కంపెనీల వ్యూహం. అందుకే కొనుగోలుదారులను పెంచుకోవడమే లక్ష్యంగా ఇబ్బడిముబ్బడిగా ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఇందులోనూ వైవిధ్యం కనిపిస్తోంది. ఆఫర్లకోసం వీకెండ్స్, పండగల దాకా ఎందుకు ఎదురుచూపులు ఇదుగో తీసుకోండంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి.

కొన్ని కంపెనీలైతే కస్టమర్లను ఎట్రాక్ట్ చేసేందుకు మరో అడుగు ముందుకేసి రూపాయికే అంటూ ఊదరగొడుతున్నాయి. మరికొన్ని ఈ-కాం వెబ్ సైట్లు యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే వందల రూపాయల విలువైన కూపన్స్ ఫ్రీగా ఇస్తున్నాయి. మనదేశంలో ఇప్పుడిదో వ్యాధిలా మారింది. లాయల్టీ కస్టమర్లుగా మార్చుకుంటే జీవిత కాలం ఆదాయం పొందొచ్చన్నది వాటి ఆలోచన. ఇదే వాటి కొంప ముంచుతోంది. వాటి దూరాలోచనే దురాలోచనగా మారి నష్టాలపాలు జేస్తోంది.

ఒక్కో కస్టమర్ ని ఆకర్షించడానికి ఈ-కామర్స్ వెబ్ సైట్లు సగటున 200 నుంచి 500 రూపాయల దాకా ఖర్చు చేస్తున్నట్లు ఓ అంచనా. ఆన్ లైన్ కొనుగోళ్ల సగటు ఆర్డర్ విలువ నాలుగొందలకు మించట్లేదని ఓ అధ్యయనంలో తేలింది. రోజురోజుకూ కొనుగోలు దారుల సంఖ్య, ఆన్ లైన్ మార్కెట్ సైజ్ పెరుగుతోందే తప్ప.. సగటు కొనుగోలు విలువ మాత్రం వందల్లోనే ఉంటుంది. అటు ఎక్కువ అమ్ముడయ్యే చాలా ఉత్పత్తులపై ఈ కంపెనీలకొచ్చే కమీషన్ పది శాతానికి మించట్లేదు. అంటే ఒక కస్టమర్ కు ఇచ్చిన డిస్కౌంట్ ని రాబట్టుకోవాలంటే మళ్లీ అతను మరో 10-12 సార్లయినా అదే వెబ్ సైట్లో కొనుగోలు చెయ్యాలి. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. కస్టమర్లేం తెలివి తక్కువవాళ్లు కాదుకదా.. ఏ వెబ్ సైట్లో తక్కువ ధర ఉందో తెలిపే మై స్మార్ట్ ప్రైస్ డాట్ కామ్ లాంటి వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. ఎక్కడ తక్కువుంటే అక్కడే కొంటారు.. అది ఫ్లిప్ కార్ట్ అయితేంటి, స్నాప్ డీల్ అయితేంటి? ఆన్ లైన్లో ఎక్కడా ఎమ్మార్పీ మీద ఐదు, పదిశాతానికి మించి డిస్కౌంట్ రావట్లేదని గ్రహిస్తే.. ఆఫ్ లైన్ లో సంప్రదాయ రిటైల్ షాపులకు వెళ్లి కొనుక్కుంటున్నారు. పైగా కొత్తగా పుట్టుకొచ్చే కంపెనీలు సైతం ఒకేసారి పాతవాటికి పోటీ ఇవ్వాలని చూస్తున్నాయి. ఇందుకోసం కూపన్లు, ఫ్రీగిఫ్ట్ లు, సినిమా టికెట్ల పేరుతో కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇదే వాటిని బొక్కబొర్లా పడేస్తోంది.

Monday, November 9, 2015

ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరికి?

కర్టెసీ : Sakshi

బంగారంతో మనది విడ దీయరాని బంధం. అందుకేనేమో! వినియోగంలో చైనానూ మించిపోయారు మనవాళ్లు. కాకపోతే ఇక్కడో చిక్కుంది. బంగారాన్ని విపరీతంగా దిగుమతి చేసుకుంటుండటంతో భారీ విదేశీ మారకద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. పెపైచ్చు దేశాభివృద్ధికి ఈ బంగారం పెద్దగా ఉపయోగపడటం లేదు. అందుకే ప్రభుత్వం మూడు పథకాలను ప్రకటించింది. ఒకటి బంగారం బాండ్లు. రెండు నాణేలు. మూడు బంగారం డిపాజిట్.

ఈ మూడింటి లక్ష్యం ఒక్కటే. బంగారం కొనుగోలు చేయాలన్న భారతీయుల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే... అందుకోసం వెచ్చించే డబ్బు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చూడటం... విపరీతంగా పెరిగిపోతున్న బంగారం దిగుమతులను సాధ్యమైనంత తగ్గించటం... ఇళ్లలో ఉన్న బంగారాన్ని వ్యవస్థలోకి తీసుకురావటం. ఈ లక్ష్యాలు ఎంతవరకూ నెరవేరతాయనేది పక్కనబెడితే... అసలు ఈ పథకాలు ఎవరికి పనికొస్తాయి? లాభమెంత? ఇవన్నీ తెలియజేస్తున్నదే ఫైనాన్షియల్ ప్లానర్ ‘అనిల్ రెగో’ చేస్తున్న ఈ విశ్లేషణ.

* అందుబాటులోకి కొత్త బంగారు పథకాలు  
* పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేవారికి గోల్డ్ బాండ్లు
* ఇంట్లో భారీ బంగారం ఉన్నవారికి డిపాజిట్ స్కీమ్ 
* చిన్న మదుపరులకు ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్లే బెటర్
* కావాలనుకుంటే కొనుక్కోవటానికి నాణేలు కూడా

కొత్త కొత్తగా గోల్డ్ బాండ్లు...
గోల్డ్ బాండ్లను జారీ చేయటం భారతదేశంలో ఇదే తొలిసారి. ఇది పరిమిత కాల పథకం. అంటే ఈ నెల 5న ఆరంభమైంది. 20వ తేదీ వరకూ మాత్రమే ఉంటుంది. అంటే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు 20వ తేదీలోగా చేయాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు జారీ చేస్తున్న ఈ బాండ్లపై ఏడాదికి 2.75 శాతం వడ్డీ ఉంటుంది. బాండ్లకు, ఈ వడ్డీకి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది.

గ్రాము విలువను ప్రభుత్వం రూ.2,684గా నిర్ణయించింది. అంటే బాండ్లు ఎవరు కొన్నా ఈ ధరకే కొనాల్సి ఉంటుంది. కనీసం రెండు గ్రాముల్ని, గరిష్ఠంగా 500 గ్రాముల్ని కొనుగోలు చేయొచ్చు. దీని కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఎనిమిదేళ్ల తరవాత వీటిని నగదుగా మార్చుకోవచ్చు. అయితే ఐదేళ్ల తరవాత ఎప్పుడైనా నగదుగా మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పించారు.

సరెండర్ చేసేటపుడు అప్పటి బంగారం విలువను బట్టి మీకు నగదు చెల్లిస్తారు. వీటిని స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ మార్కెట్లోని ధరకు విక్రయించి ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికి అదనపు ఆకర్షణేమిటంటే వడ్డీ. ఈ బాండ్లపై  ఏడాదికి 2.75 శాతం వడ్డీని ఆర్‌బీఐ ఆఫర్ చేస్తోంది. దీర్ఘకాల ఆదాయం కనక ఈ వడ్డీకి క్యాపిటల్ గెయిన్స్ కూడా వర్తించవు. అవసరమైనపుడు ఈ బాండ్లను తనఖా పెట్టి రుణం కూడా తీసుకోవచ్చు.

ఎక్కడ కొనుగోలు చేయాలి?
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద గోల్డ్ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఏజెంట్లకు కూడా దరఖాస్తులు తీసుకుని బ్యాంకుల్లో అందజేయటానికి అనుమతి ఉంది.

ఎవరికి లాభం?
వడ్డీ కూడా వస్తుంది కనక... బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకున్నవారు నేరుగా బం గారం కొనకుండా ఈ బాండ్లు కొనవచ్చు. వీటిని పేపర్ రూపంలోను, డీమ్యాట్ రూపంలోను కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ రకంగా కొనుగోలు చేసినపుడు దీన్ని దాచుకోవటం చాలా ఈజీ. పెపైచ్చు తరుగులాంటి సమస్యలు లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించి నగదు చేసుకోవచ్చు.

నష్టాలున్నాయా?
బాండ్లతో నష్టాలున్నాయని చెప్పలేం. అయితే బంగారం ధరలోని హెచ్చుతగ్గులు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా ప్రభావితం చేస్తాయని తెలుసుకోవాలి. ఎందుకంటే దీన్లో ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరవాత బంగారం ధర తగ్గితే మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ప్రభుత్వం ఈ స్కీమను ప్రకటించినపుడు... అప్పటి ధరను పరిగణనలోకి తీసుకుని గ్రాము ధరను రూ.2,684గా నిర్ణయించింది.

కాకపోతే నవంబరు 5న ఈ స్కీమ్ ఆరంభించేనాడు ముంబై బులియన్ మార్కెట్లో గ్రాము ధర రూ.26,025గా ఉంది. అంటే దాదాపు 660 రూపాయలు తగ్గినట్లు. ఇది 2.75 శాతానికన్నా ఎక్కువే. అంటే తొలి ఏడాది ఇస్తామన్న వడ్డీ ఈ రకంగా పోయినట్లన్న మాట. ఇలాంటి రిస్కులుంటాయని గమనించాలి.

గోల్డ్ ఈటీఎఫ్‌లు/ మ్యూచ్‌వల్ ఫండ్లు
ఇవేవీ కొత్తగా ఆరంభించినవి కావు. కాకపోతే బంగారంలో మదుపు చేసే పథకాల గురించి తెలుసుకుంటున్నాం కనక గోల్డ్ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌లు), గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్ల (ఎంఎఫ్‌లు) గురించి కూడా తెలుసుకోవాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లంటే బంగారం ధరను బట్టి ఆ ధరకే ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే ఫండ్లన్న మాట.

షేర్ల మాదిరే వీటిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయటం, విక్రయించటం చేయొచ్చు. దీన్లో కనీస పెట్టుబడి రూ.5వేలు. డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. అయితే దీన్లో సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్‌మెంట్ కుదరదు. ప్రస్తుతం 13 సంస్థల వరకూ ఈటీఎఫ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అదే గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్లకైతే డీమ్యాట్ ఖాతా అవసరం లేదు. నెలకు రూ.500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ పద్ధతిలో కూడా పెట్టుబడులు పెట్టొచ్చు.

గోల్డ్ డిపాజిట్ స్కీమ్..
ప్రభుత్వం దీన్ని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌గా పిలుస్తోంది. అంటే బంగారాన్ని డబ్బు చేసుకునే పథకమన్నమాట. దీనిప్రకారం మన దగ్గరున్న బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆభరణాల్ని డిపాజిట్ చేస్తే అక్కడ రాళ్లు, ఇతరత్రా తరుగు తీసేసి, దాన్ని కరిగించి నిపుణులు దాని బరువెంతో లెక్కిస్తారు.

ఒకవేళ బంగారు నాణేలు, బార్లు డిపాజిట్ చేస్తే వాటి బరువును అక్కడే చెబుతారు. ఆ బరువును పేర్కొంటూ మీకొక సర్టిఫికెట్ ఇస్తారు. మీరు వెనక్కి తీసుకునేటపుడు ఆ సర్టిఫికెట్‌ను అందజేస్తే దాన్లో పేర్కొన్న బరువు గల బంగారాన్ని మీకిస్తారు. అంతేతప్ప మీ ఆభరణాలను తిరిగివ్వరు. అదనపు ఆకర్షణేంటంటే దీనిపై వడ్డీ కూడా ఇస్తున్నారు.

ఈ వడ్డీ 2.25 శాతం నుంచి 2.5 శాతం వరకూ ఉంటుంది. నిజానికిదేమీ తొలిసారి అందిస్తున్న పథకం కాదు. చాలా కాలం కిందటే ఎస్‌బీఐ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కనీసం 30 గ్రాముల బంగారం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంత బంగారాన్నయినా డిపాజిట్ చేయొచ్చు. దీనికి పరిమితి లేదు. 1999 నాటి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకారం ఇన్వెస్టర్లకు క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో కూడా ఇలాంటి మినహాయింపులు ఉంటాయనే భావిస్తున్నారు.

ఎవరికి లాభం?
ఆభరణాల రూపంలో కాకుండా బార్ల రూపంలోనో, నాణేల రూపంలోనో ఇంట్లో బంగారం ఉన్నవారికి ఇలాంటి పథకాలు లాభదాయకమే. ఎందుకంటే ఇంట్లో ఉంటే దాన్ని భద్రంగా దాచుకోవటం కూడా సమస్యే. అదే బ్యాంకులో అయితే భద్రత సమస్య ఉండదు. పెపైచ్చు ఇంట్లో ఉంటే ఎలాంటి ఆదాయమూ రాదు. బ్యాంకులో ఉంటే ఏటా వడ్డీ కూడా వస్తుంది. బ్యాంకులో కనక ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు.

నష్టాలు ఉన్నాయా?
బంగారం ఉన్నవారు డిపాజిట్ చేస్తే మంచిది తప్ప బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకున్న వారు దాన్ని కొని డిపాజిట్ చేయటం సరికాదనే చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తరవాత ధర తగ్గితే ఆ మేరకు నష్టపోవాల్సి ఉంటుందని గమనించాలి.

కేంద్రం తాజాగా అశోకచక్ర చిహ్నంతో బంగారు నాణేలను కూడా విడుదల చేసింది. ఎంఎంటీసీ ఔట్‌లెట్లలో ఇవి లభ్యమవుతాయి. నాణేలు కొనాలనుకున్నవారికి కేంద్రమే అందిస్తోంది కనక ఇవి ఉపయుక్తమని చెప్పాలి. వీటిని ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించినా ఏకమొత్తంలో మదుపు; ధర తగ్గితే రిస్కు ఉంటాయి.

ఎవరికి ఏ పథకం లాభం?
గోల్డ్ ఈటీఎఫ్/ గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్స్  : ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేవారికి,  రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసేవారికి (సిప్)
 గోల్డ్ బాండు : ప్రభుత్వ మద్దతున్న పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి; భవిష్యత్తులో బంగారం కొనా లనుకున్నవారికి
 గోల్డ్ డిపాజిట్ పథకం : నేరుగా బంగారం ఉండి, దాన్ని అదే రూపంలో తమ వద్ద ఉంచుకోకూడదని భావించేవారికి

ఉదాహరణకు ఈ మూడు పథకాల్లో రూ.2.5 లక్షలు లేదా అంతకు సమానమైన బంగారాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం...

ఈ పట్టిక చూస్తే ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఎంఎఫ్‌లకన్నా గోల్డ్ డిపాజిట్ స్కీమ్, బాండ్లపైనే ఎక్కువ రాబడి వస్తున్నట్లు కనిపిస్తుంది. కారణం... వడ్డీ. అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతిలో గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్లు లేదా ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసినపుడు మిగతా వాటికన్నా ఎక్కుకే రాబడి రావచ్చు. ఎందుకంటే ధరలు పెరిగినా, తగ్గినా ఆ ధరలకే యూనిట్లు లభిస్తాయి కనక సగటు ధర తక్కువే ఉంటుంది.

లాభమూ బాగానే ఉంటుంది. ఒకవేళ బంగారం ధరలు బాగా పడిపోయినా ఒకేసారి ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ బాండ్లు, డిపాజిట్ స్కీమ్‌తో పోలిస్తే సిప్ పద్ధతిలో నష్టాలు పరిమితంగానే ఉంటాయి. అయితే పై స్కీముల్లో వడ్డీ రేట్లు కాస్త ఆకర్షణీయంగానే ఉన్నాయి. అందుకని బాగా డబ్బులుండి ఎక్కడో ఒకచోట ఇన్వెస్ట్ చేదాద్దమనుకున్న వారికి, ఇంట్లో ఆభరణాలు కాకుండా అదనపు బంగారం ఉన్నవారికి మాత్రం పై రెండు స్కీములూ ఆకర్షణీయమేనని చెప్పొచ్చు.

Friday, July 10, 2015

ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ వివిధ పథకాలు

ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ వివిధ పథకాలు

                    గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు పతనమవుతాయో అంచనావేయలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంటున్నవారు చాలామందే ఉన్నారు. ఈక్విటీల్లో నేరుగా పెట్టుబడి పెట్టే కంటే... కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ప్రయోజనం పొందవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇలాంటి హెచ్చుతగ్గుల మార్కెట్లలో చిన్న ఇన్వెస్టర్లకు ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ వివిధ పథకాలతో చక్కని రాబడులను అందిస్తోంది.
                    మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులను దృష్టిలో పెట్టుకొని ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ డైనమిక్ ఫండ్ ను ప్రవేశపెట్టింది.  డైనమిక్ ఫండ్ అనేది పూర్తిగా ఈక్విటీ పథకమే అయినా దీని పనితీరు భిన్నంగా ఉంటుంది. మార్కెట్లు పతనమైనప్పుడల్లా కొనుగోలు చేసి గరిష్టస్థాయికి చేరుకున్నప్పుడల్లా విక్రయిస్తుంటాయి. దీని వలన దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు చక్కని లాభాలు వస్తాయి. 2002 అక్టోబర్ 31న ప్రారంభమైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్.... ప్రస్తుతం 59 స్టాక్స్ ను హోల్డ్ చేస్తోంది. 0.76 కంటే తక్కువగా బీటా ఫండ్ ను కలిగి ఉన్న ఈ ఫండ్ తొలి ఏడాది 7.96 శాతం రిటర్న్స్ ఇచ్చింది. తొలి మూడేళ్ళలో  ఏటా సగటున 19.59 శాతం,  ఐదేళ్ళలో 12.45 శాతం, ఏడేళ్ళలో 15.35 శాతం, పదేళ్ళలో 19.37 శాతం రిటర్న్స్ నిచ్చింది, ఇప్పటి వరకు ఏటా సగటున 25.62శాతం లాభాలను అందించింది. 2002లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్ లో ఏకమొత్తంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత విలువ 18 లక్షల 10 వేల 669 రూపాయలకు పెరిగింది.
                     బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈక్విటీ రాబడితో పాటు డెట్  పథకాల రక్షణనూ పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ విభాగంలో అత్యుత్తమ పనితీరును కనబరిచింది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌‍డ్ అడ్వాంటేజ్ ఫండ్.  2009 డిసెంబర్ లో ప్రారంభమైన ఈ ఫండ్ కూడా ఇన్వెస్టర్లకు చక్కని రిటర్స్ ఇస్తోంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, హెచ్‌‍సీఎల్ టెక్నాలజీస్‌‍తో పాటు మొత్తం 64 కంపెనీల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది.  అత్యుత్తమ కంపెనీలపైనే దృష్టి పెడుతోన్న ఈ ఫండ్..  తొలి ఏడాది 15.75 శాతం రాబడినిచ్చింది. తొలి మూడేళ్ళలో ఏటా సగటున 19.87 శాతం, ఐదేళ్ళలో 14.54 శాతం, ఏడేళ్ళలో సగటున 14.59 శాతం రిటర్న్స్ నిచ్చింది. 2006లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌‍డ్ అడ్వాంటేజ్  ఫండ్‌లో ఏకమొత్తంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత విలువ 2 లక్షల 58 వేల రూపాయలు. ఈ ఫండ్ ద్వారా వచ్చిన రిటర్న్స్‌కు పన్నుపరంగా కూడా ప్రయోజనం ఉంటుంది.
                     ఇక లార్జ్ క్యాప్ ఫండ్స్ లో చక్కని రిటర్న్స్ ఇస్తోంది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్. 2008లో ప్రారంభమైన ఈ ఫండ్...   HDFC బ్యాంక్,  ICICI  బ్యాంక్,  ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్,  HCL టెక్నాలజీస్ తో పాటు మొత్తం 49 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. మెరుగైన కంపెనీలనే దృష్టి పెడుతోన్న ఈ ఫండ్..  తొలి ఏడాది 15.94 శాతం రాబడినిచ్చింది. తొలి మూడేళ్ళలో ఏటా సగటున 21.57 శాతం, ఐదేళ్ళలో 14.41శాతం, ఏడేళ్ళలో ఏటా సగటున 17.60 శాతం రిటర్న్స్ నిచ్చింది.  2008 నుంచి ఇప్పటి వరకు ఈ ఫండ్ సగటున ఏటా 16.19  శాతం రాబడిని అందించింది. 2008లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ ఫండ్ లో ఏకమొత్తంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత విలువ 2 లక్షల 91 వేల 6 వందల రూపాయలుగా ఉంది.
                    మీ పోర్ట్ ఫోలియోలో తప్పనిసరిగా ఉంచుకోదగ్గ మరో ఫండ్... ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్. ఇది వాల్యూ ఓరియెంటెండ్ ఫండ్. 2004లో ప్రారంభమైన ఈ ఫండ్ చక్కని ట్రాక్ రికార్డ్ ను కలిగి ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో 65 నుంచి 75 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తోంది. ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, విప్రోతో పాటు మొత్తం 61 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. తొలి ఏడాది 27.83 శాతం రాబడినిచ్చిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్... తొలి మూడేళ్ళలో ఏటా సగటున 31.58 శాతం, ఐదేళ్ళలో 19.39శాతం, ఏడేళ్ళలో సగటున 24.58 శాతం రిటర్న్స్ నిచ్చింది. 2004 నుంచి ఇప్పటి వరకు ఈ ఫండ్ సగటున ఏటా 24.95 శాతం రాబడిని అందించింది. 2004లో  ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ లో ఏకమొత్తంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత విలువ 11 లక్షల 34 వేల ఒక వంద రూపాయలుగా ఉంది.