Friday, June 21, 2013

రూపాయితో మనకేంటి నష్టం?

ఈనాడు సౌజన్యంతో...

మనకేంటి నష్టం? మన రూపాయి విలువ పతనం అవుతోంది. దీంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. విదేశీ నిల్వలు అడుగంటి పోతున్నాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దాదాపు ప్రతి వస్తువు ధరా ప్రభావితం అవుతోంది. ఈ రూపాయి, డాలర్ పోటీలో మనకు వచ్చే లాభనష్టాలేమిటి? రూపాయి కన్నా డాలరుకు ఎక్కువ గిరాకీ ఉంటే.. రూపాయి మారకపు విలువ తగ్గుతుంది. మనదేశం ఎక్కువగా దిగుమతుల మీదే ఆధారపడి ఉంటుంది. సహజంగానే డాలరుకు రూపాయితో పోలిస్తే గిరాకీ ఎక్కువ. ముడి చమురు, ఎరువులు, బంగారం తదితర విలువైన లోహాలు, బొగ్గు, విద్యుత్ ఉపకరణాలు, రక్షణరంగానికి సంబంధించిన వస్తువులు, ఆహారపు నూనెలు తదితర వస్తువులను మనం ఇతర దేశాల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. దీనికి చెల్లించేదంతా డాలర్ల రూపంలోనే. దిగుమతులు ఎక్కువ కావడం, డాలర్ల కొరత ఏర్పడటంలాంటి పరిస్థితుల వల్ల నేడు రూపాయి విలువ గరిష్ఠ స్థాయిలో పతనం అయ్యింది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి దిశలో పయనించడం, భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గత పదేళ్ల కనిష్ఠానికి పడిపోవడం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల పనితీరు ఆశాజనకంగా లేకపోవడం వల్ల కూడా రూపాయిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల్లో కొంత దిద్దుబాటు కన్పించింది. దీంతో పెద్ద మొత్తంలో ఈ విలువైన లోహాలను దిగుమతి చేసుకోవడంతో విదేశీ మారక ద్రవ్య నిలువలు చాలా వేగంగా ఖాళీ అయ్యాయి. ఫలితంగా రూపాయి విలువ పతనం కావడానికి కారణం అయ్యింది. ఇతర దిగుమతులను ఆపడం సాధ్యం కాదు. దీంతో ఎగుమతులు, దిగుమతులను సమతౌల్యం చేసే దిశగా బంగారంలాంటి లోహాలను దిగుమతి చేసుకోకుండా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దీనివల్ల రూపాయి విలువ మరింత పతనం కాకుండా చూడాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఎంత వరకూ.. 1947లో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ఎంతో తెలుసా? ఒక రూపాయికి ఒక డాలరు. ఇప్పుడు వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. ఇది నిజం. తర్వాత రోజుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ మన దేశంకన్నా ముందుకు వెళ్లడంతో డాలరుతో రూపాయి మారకం విలువ పతనం అవ్వడం ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం కనిష్ఠ స్థాయికి రూపాయి చేరుకుంది. ఒక డాలరు విలువ సుమారు 60 రూపాయలు (59.57) వెచ్చించాల్సి వస్తోంది. అన్నీ భారమే మన దేశంలో అవసరమయ్యే ముడి చమురులో 70శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్నదే. రూపాయి విలువ ఏ మాత్రం తగ్గినా వెంటనే ఆ ప్రభావం పెట్రోలు ధరలపై పడుతుంది. ఇటీవలే రూ.2 మేరకు పెరిగిన పెట్రోలు ధరే ఇందుకు నిదర్శనం. ఇది సామాన్యుడిపై పడే ప్రత్యక్ష భారం. డీఖ్ణ్మీ;లు/పెట్రోలు ధరల పెరుగుదల కారణంగా ఉత్పాదన వ్యయం, రవాణా ఖర్చులు ఎక్కువ అవుతాయి. దీంతో పరోక్షంగా మనపైనే ఆ భారం పడి, వస్తువులకు ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సి వస్తుంది. సబ్సిడీకి (9 సిలిండర్లు) మించి వినియోగించే వంటగ్యాసు ధర కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. చి మనం వినియోగించే ఆహార నూనెల్లో విదేశాల నుంచి 60శాతం వరకూ దిగుమతి చేసుకుంటున్నదే. పామ్ఆయిల్, సోయాబీన్ నూనె ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు. రూపాయి పతనం ఫలితంగా ఈ నూనెల ధర ఇటీవల కాలంలో లీటరుకు రూ.3 దాకా పెరిగింది. ఇతర దేశాల నుంచి వచ్చే పప్పుధాన్యాల ధరలు కూడా పెరగడం చూస్తేనే ఉన్నాం. చి బంగారం, వెండిలాంటి లోహాల ధరలు రూపాయి పతనంతో పెరిగాయి. మనదేశంలో బంగారం గనుల్లో చెప్పుకోదగ్గ ఉత్పత్తి లేకపోవడంతో మొత్తంగా విదేశాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. రూపాయి విలువ తగ్గడంతో బంగారం దిగుమతులపై ఆ ప్రభావం పడుతోంది. చి విద్యుత్ ఉపకరణాలను కూడా ఎక్కువగా చైనా, ఇతర దేశాలనుంచే దిగుమతి చేసుకుంటున్నాం. రూపాయి విలువ పతనం అవడంతో ఈ వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. చి సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లు తదితర వస్తువుల తయారీకి ముడి చమురు నుంచి వచ్చిన కొన్ని పదార్థాలను వినియోగిస్తారు. ముడి చమురు దిగుమతి ధర పెరిగితే.. సహజంగానే.. ఈ ఉత్పాదనల విలువ పెరిగే అవకాశం ఉంది. చి విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు కూడా డాలర్ ధర పెరగడంతో ఇక్కట్లు తప్పడం లేదు. విహార యాత్రలకు వెళ్లేవారిపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది. చి రూపాయి విలువ పతనం ద్రవ్యోల్బణం పెరగడానికి అవకాశాన్నిస్తుందన్న కారణంతో వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మాత్రం సవరించలేదు. దీంతో రుణం తీసుకున్నవారికి నెలసరి వాయిదాల్లో ఎలాంటి తేడా రాలేదు. లాభాలూ ఉన్నాయి డాలరు ధర పెరగడం వల్ల అన్నీ నష్టాలే లేవు. కొన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు మన దేశంలో ఉన్నవారికి డాలర్లలో డబ్బు పంపిస్తుంటారు. దీనివల్ల వారికి ఎక్కువ రూపాయలు వచ్చేందుకు వీలు కల్గింది. దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రవాస భారతీయులకు ఇది అనువైన సమయమే. అయితే, ఇప్పటికే పెట్టుబడులు పెట్టి, వాటిని వెనక్కి తీసుకోవాలనుకున్న వారికి మాత్రం కొంత వ్యతిరేక ఫలితాలు రావచ్చు. చి ఎగుమతులకు ఎక్కువ అవకాశం ఉన్న ఐటీ, ఫార్మా రంగాల్లోని కంపెనీల షేర్లలో మదుపు చేసిన వారికి రూపాయి పతనం లాభాలు తెచ్చిపెట్టే ఆస్కారం ఉంది. దిగుమతుల మీద ఆధారపడ్డ కంపెనీల షేర్లకు ఇబ్బందికర పరిణామమే అని చెప్పవచ్చు. విదేశీ సంస్థాగత మదుపరులు మన మార్కెట్లలో కీలకమైన పెట్టుబడిదారులు. ఇలాంటి సమయంలో రూపాయి మరింత తగ్గితే స్వల్పకాలంలో మార్కెట్‌లో కొంత వ్యతిరేక పవనాలు వీచే అవకాశం లేకపోలేదు. చి ఇటు ఈక్విటీ మార్కెట్లలోనూ, అటు బాండు మార్కెట్లోనూ మదుపు చేసేవారిపై స్వల్పకాలంలో రూపాయి పతనం ప్రభావం కనిపిస్తుంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.