Friday, December 7, 2012

కొత్త సంవత్సరంలో కార్ల ధరలకు రెక్కలు


రూ.20 వేల వరకూ పెంచుతున్నట్లు ప్రకటించిన మారుతీ సుజుకీ...


3 శాతం వరకూ జీఎం పెంపు..
ఇదే బాటలో మరిన్ని కంపెనీలు


న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలో కార్ల ధరలు పెరగనున్నాయి. జనవరిలో కార్ల ధరలను రూ.20,000 వరకూ పెంచాలని మారుతీ సుజుకీ ఇప్పటికే నిర్ణయించింది. 1-2% ధరలను పెంచనున్నామని టయోటా పేర్కొం ది. జనరల్ మోటార్స్ 3% వరకూ ధరలను పెంచుతోంది. హోండా కార్స్ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నాయి. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయని, డాలర్‌తో రూపాయి మారకం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతుండటంతో మార్జిన్లపై తీవ్ర ప్రభావం పడుతోందని, అందుకే ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీలంటున్నాయి.

మోడళ్లను బట్టి కార్ల ధరలను రూ.20,000 వరకూ పెంచుతున్నామని మారుతీ సుజుకి ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పరీక్ చెప్పారు. మారుతీ సుజుకి కంపెనీ ఎం800 నుంచి కైజాషి మోడళ్లను రూ.2.09 లక్షల నుంచి రూ.17.52 లక్షల రేంజ్‌లో విక్రయిస్తోంది. ఇక వచ్చే నెల 1 నుంచే అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నామని టయోటా కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ ఇటియోస్ లివా నుంచి ల్యాండ్ క్రూయిజర్ వరకూ మోడళ్లను రూ.4.44 లక్షల నుంచి రూ.99.27 లక్షల రేంజ్‌లో కార్లను విక్రయిస్తోంది. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా ధరలు పెంచక తప్పడం లేదని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. జనవరి నుంచే తాము కూడా మోడళ్లను బట్టి ధరలను 1-3 శాతం వరకూ పెంచనున్నామని జనరల్ మోటార్స్ పేర్కొంది. రూ.3.32 లక్షల స్పార్క్ కారు నుంచి రూ.24.59 లక్షల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ క్యాప్టివా వరకూ వివిధ మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది.

ఇక ఫియట్ జీప్‌లు

ముంబై: జీప్‌మార్కెట్లో మళ్లీ ప్రవేశిస్తున్నామని ఫియట్ ఇండియా గురువారం తెలిపింది. వచ్చే ఏడాది చివరి కల్లా తమ జీప్ మోడళ్లు- గ్రాండ్ చెరోకీ, రాంగ్లర్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తామని పేర్కొంది. 2016 కల్లా తొమ్మిది కొత్త వాహనాలను భారత మార్కెట్లో అం దించే వ్యూహంలో భాగంగా ఈ జీప్‌లను తెస్తున్నామని వివరించింది. 25 నగరాల్లో ఉన్న 32 డీలర్ల ద్వారా ఈ జీప్‌లను విక్రయిస్తామని తెలిపింది. ప్రస్తుతం 120 దేశాల్లో ఈ జీప్‌లను అమ్ముతున్నామని వివరించింది. ఇక ఈ జీప్‌లతో పాటు వచ్చే ఏడాది తమ రేసింగ్ కార్డ్ బ్రాండ్ అబర్త్‌ను, 2014లో కాంపాక్ట్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తెస్తామని పేర్కొంది.