Thursday, December 6, 2012

మాలె ప్రాజెక్టు పరిణామాలు

మాలె సంక్షొభంలో విదేశీ హస్తం

న్యూఢిల్లీ : మాలె అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు నుంచి తమను బలవంతంగా బయటకు పంపడం వెనుక పరదేశ ప్రమేయం ఉన్నట్టు జిఎంఆర్ గ్రూప్ అనుమానిస్తోంది. మాల్దీవుల రాజకీయ పరిస్థితిని, అక్కడి రాజకీయ చట్రాన్ని దృష్టిలో ఉంచుకుంటే.. మాలె ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు వ్యవహారంలో విదేశీ హస్తం ఉందన్న అనుమానాలను తోసిపుచ్చలేమని సంస్థ సిఎఫ్ ఒ సిద్ధార్థ కపూర్ చెప్పారు. 50 కోట్ల డాలర్ల మాలె ఎయిర్‌పోర్ట్ ఆధునీకరణ ప్రాజెక్టు నుంచి జిఎంఆర్‌ను బయటకు పంపాలన్న మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయం వెనక చైనా హస్తం ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. జిఎంఆర్ ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడేందుకు నిరాకరించినప్పటికీ అనుమానాలను మాత్రం తోసిపుచ్చలేదు.

మాలె ఎయిర్‌పోర్ట్ సంక్షోభం పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో... వాస్తవాలను వెల్లడించడానికి జిఎంఆర్ సిఎఫ్ఒ సిద్ధార్ధ కపూర్ బుధవారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయక్రీడాంగణంలో మాలె ఎయిర్‌పోర్టు ఫుట్‌బాల్‌గా మారిందని కపూర్ వ్యాఖ్యానిం చారు. టూరిజంను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసేందుకు ఒక పక్క విదేశీ పెట్టుబడులను కోరుతూ.. మరో పక్క మాలె ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు రద్దు వంటి నిర్ణయాలను తీసుకోవడాన్ని కపూర్ తప్పుబట్టారు. మాల్దీవుల ప్రభుత్వ వైఖరికి బయట ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రారని ఆయన చెప్పారు. మాలె ప్రాజెక్టును వదులుకోవాల్సి వస్తే నష్టం ఏమేరకు ఉంటుందనే విషయంలో లెక్కలు వేయలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

బల ప్రయోగం వద్దు
మాలె ఎయిర్‌పోర్టు నుంచి జిఎంఆర్‌ను ఖాళీ చేయించేందుకు బలప్రయోగానికి దిగే ప్రయత్నం చేయవద్దని సిద్ధార్థకపూర్ మాలె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బలప్రయోగానికి దిగితే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని ఆయన అన్నారు. ఇది భారత దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. మాలె ఎయిర్‌పోర్టులో 140 మంది విదేశీయులు పనిచేస్తున్నారని చెప్పారు. మాలె ఎయిర్‌పోర్టును శుక్రవారం ఆర్ధరాత్రికల్లా ఖాళీ చేసి తమకు అప్పగించాలని మాలె ప్రభుత్వం జిఎంఆర్‌ను హెచ్చరించింది. అయితే జిఎంఆర్ మాత్రం ససేమిరా ప్రాజెక్టును వదిలేది లేదని అంటున్నది.

ఈ నేప«థ్యంలో బలప్రయోగంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాల్సిందిగా మాల్దీవుల ప్రభుత్వానికి తాము విజ్ఞప్తి చేస్తున్నట్టు కపూర్ చెప్పారు. ఈ సంక్షోభానికి అందరికీ అమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్టు ఆయన చెప్పారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం అండగా నిలబడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మాల్దీవుల ప్రభుత్వ అధినేతతో సంప్రదించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. సమస్య పరిష్కారానికి మాల్దీవుల ప్రధాన ప్రతిపక్షంతో సహా అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుత్నుట్టుగా వెల్లడించారు.

ఎవరికి లాభం...
కాంట్రాక్టును బలవంతంగా రద్దుచేస్తే మాల్దీవుల ప్రభుత్వం పరిహారం కింద జిఎంఆర్‌కు కనీసం 70 కోట్ల డాలర్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా. అంతకంటే ఎక్కువే ఉండవచ్చు కూడా. ఈ భారాన్ని మాల్దీవుల ప్రజలే మోయాలి. ప్రాజెక్టు కొనసాగితే వచ్చే పాతికేళ్ల కాలంలో మాల్దీవుల ప్రభుత్వానికి 250 కోట్ల డాలర్లు లభిస్తాయి. అవి కాకుండా ఇతరత్రా ఆదాయం మరో 100 కోట్ల డాలర్లు ఉంటుంది.

మాలె పరిణామాలపై ప్రపంచబ్యాంకు కన్ను
నిజానికి మాలె ఎయిర్‌పోర్టు బిడ్డింగ్ ప్రక్రియ అంతా ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ ఐఎఫ్‌సి కనుసన్నల్లో జరిగింది. అందువల్ల ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పరిణామాలను ప్రపంచ బ్యాంకు నిశితంగా గమనిస్తోంది. ఈ విషయం జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జునరావుకు రాసిన లేఖలో ప్రపంచబ్యాంకు ప్రెసిడెంట్ జిమ్‌యాంగ్ కిమ్ స్వయంగా తెలిపారు. ప్రాజెక్టు బిడ్డింగ్ జరిగిన సమయంలో మాల్దీవుల ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న ఐఎఫ్‌సి, కన్సిషన్ అగ్రిమెంట్ రూపకల్పన, బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. మాల్దీవుల చట్టాలు, అంతర్జాతీయ ఉత్తమ సంప్రయాలాకు అనుగుణంగా బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించారు.

ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఐఎఫ్‌సిని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మాల్దీవులు కోరింది. ఐఎఫ్‌సి ప్రతినిధి బృందం అవసరమైన మొత్తం సమాచారాన్ని మాల్దీవుల ప్రభుత్వానికి అందించినట్టు జిమ్‌యాంగ్ కిమ్ జిఎంఆర్‌కు రాసిన లేఖలో వెల్లడించారు. పైగా ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా వైస్ ప్రెసిడెంట్ ఇసాబెల్ గురెరో మాల్దీవుల అధ్యక్షున్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా కలుసుకున్నారు. ఐఎఫ్‌సి వైస్‌ప్రెసిడెంట్ కరిన్ ఫిన్‌కెల్‌స్టన్ కూడా మాల్దీవుల ఆర్థికమంత్రితో త్వరలో సమావేశం కానున్నారని వెల్లడించారు. ప్రపంచబ్యాంకు కూడా ప్రాజెక్టు విషయంలో సీరియస్‌గా ఉన్నందున మాల్దీవుల ప్రభుత్వం ఆఖరు క్షణంలోనైనా దారికి రావచ్చని అంటున్నారు. . 


మాలె ప్రాజెక్టు పరిణామాలు..

2010లో జరిగిన అంతర్జాతీయ బిడ్డింగ్‌లో 50 కోట్ల డాలర్లకు ఈ ప్రాజెక్టును జిఎంఆర్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ ఐఎఫ్‌సి సార«ధ్యంలో బిడ్డింగ్‌ను నిర్వహించారు.ఆ ప్రాజెక్టు కన్సీషన్ కాలవ్యవధి 25 ఏళ్లు. ప్రాజెక్టు బిడ్డింగ్ జరిగిన సమయంలో మాల్దీవుల్లో మహమమ్మద్ నషీద్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మాల్దీవుల చరిత్రలో స్వేచ్ఛ గా జరిగిన ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రభుత్వంగా నషీద్ ప్రభుత్వాన్ని చెబుతారు.

ఈ ఏడాది ప్రారంభంలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల్లో నషీద్ ప్రభుత్వం కూలిపోయింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మాలె ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును టార్గెట్‌గా పెట్టుకుంది. గతవారం హఠాత్తుగా జిఎంఆర్ కాంట్రాక్టును రద్దు చేస్తూ.. వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సింగపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ మాల్దీవుల ప్రభుత్వం తన పట్టు వీడటం లేదు. భారత ప్రభుత్వం నిరసన తెలిపినప్పటికీ మాల్దీవుల ప్రభుత్వం దిగిరాలేదు. మాలె ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులో అక్రమాలు,అవినీతి చోటుచేసుకున్నట్టుగా కొత్త ప్రభుత్వం వాదిస్తోంది.

2010
జూలై : 10 నెలలు సాగిన సుదీర్ఘ బిడ్డింగ్ ప్రక్రియ తర్వాత 50 కోట్ల డాలర్ల మాలె అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీకరణ, నిర్వహణ ప్రాజెక్టును జిఎంఆర్ గెలుచుకుంది.
అక్టోబర్ : ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణ ఏర్పాట్లను పూర్తి చేసినట్టుగా జిఎంఆర్ వెల్లడించింది. 50 కోట్ల డాలర్ల ప్రాజెక్టులో 70 శాతం రుణాలు కాగా 30 శాతం ఈక్విటీ.
నవంబర్ : మాల్దీవుల ఎయిర్‌పోర్టు కంపెనీ అధికారికంగా మాలె ఎయిర్‌పోర్టు అభివృద్ధి, అధునీకరణకు లైసెన్స్‌ను జిఎంఆర్‌కు అందజేసింది.

2011
జనవరి : 2014-15కల్లా ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్టుగా జిఎంఆర్ ప్రకటన.
మార్చి : పనులు వేగం అందుకున్నట్టుగా వెల్లడి

జూన్ : నాన్ ఎయిరో స్పేస్‌ను వాణిజ్య పరంగా అభివృద్ధి చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక రాజకీయ నాయకులు ఆందోళన ప్రారంభించడంతో జిఎంఆర్ కార్యకలాపాలకు విఘాతం కలిగింది.
సెప్టెంబర్ : ఎయిర్‌పోర్టు చుట్టూ ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకుని డెవలప్‌మెంట్‌ను జిఎంఆర్ ప్రారంభించింది.
డిసెంబర్ : జనవరి నుంచి మాలె ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల నుంచి ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ చార్జీల కింద 25 డాలర్లు, బీమా చార్జీ కింద 2 డాలర్ల చొప్పున వసూలు చేస్తున్నట్టుగా జిఎంఆర్ ప్రకటన. ఈ నిర్ణయంపై కోర్టుల్లోనూ జిఎంఆర్‌కు అనుకూలంగా తీర్పువచ్చింది.

2012
జనవరి: ఎయిర్‌పోర్టు చార్జీల వసూలుకు ప్రభుత్వం అడ్డుపడటంపై జిఎంఆర్ అసంతృప్తి.
మార్చి : నషీద్ ప్రభుత్వం కూలిపోయింది. మహమద్ వహీద్ సారధ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే, మాలె ప్రాజెక్టును జిఎంఆర్ అక్రమ పద్ధతుల్లో చేజిక్కించుకుందని, అందువల్ల ప్రాజెక్టు చెల్లదని ప్రకటించింది. జిఎంఆర్ కష్టాలు అప్పటి నుంచే మొదలయ్యాయి.
జూన్ : ప్రపంచబ్యాంక్ అనుబంధ సంస్థ ఐఎఫ్‌సి సారధ్యంలో అత్యంత పారదర్శకంగా జరిగిన బిడ్డింగ్‌లో మాలె ప్రాజెక్టును తాము గెలుచుకున్నామని జిఎంఆర్ మాల్దీవుల కొత్త ప్రభుత్వానికి విన్నవించుకుంది. జూలై : మాల్దీవుల ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టును జిఎంఆర్ వదులుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

సెప్టెంబర్ : మాలె ఎయిర్ పోర్టు ప్రాజెక్టు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 304.3 కోట్ల రూపాయల రాబడిపై 44 కోట్ల రూపాయల లాభం సాధించినట్టు జిఎంఆర్ ప్రకటన. ఢిల్లీ ఎయిర్‌పోర్టుతో పోలిస్తే మాలె ప్రాజెక్టులో భారీ లాభాలున్న విషయం కూడా జిఎంఆర్ వెల్లడించింది.
అక్టోబర్ : ముంబైలో జరిగిన ఒక సమావేశంలో మాల్దీవుల ప్రభుత్వం మాలె ప్రాజెక్టు విషయంలో నాన్చకుండా తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది.
నవంబర్ : కాంట్రాక్టు రద్దు చేస్తూ అధికార ప్రకటన.
డిసెంబర్ : మాల్దీవుల ప్రభుత్వం నిర్ణయంపై సింగపూర్ కోర్టులో జిఎంఆర్ పిటిషన్. అనుకూలంగా తీర్పు. తీర్పును లెక్కించమని మాల్దీవుల ప్రకటన.