Saturday, March 8, 2014

సీఐఐ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్‌గా సురేష్ రాయుడు

వైస్‌ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన వనితా దాట్ల

ఈనాడు, హైదరాబాద్: భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆంధ్ర ప్రదేశ్ ఛైర్మన్‌గా 2014-15 సంవత్సరానికి సురేష్ రాయుడు చిట్టూరి ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన సీిఐఐ- ఏపీ వార్షిక సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. వైస్-ఛైర్‌పర్సన్‌గా వనితా దాట్లను ఎన్నుకున్నారు. సురేష్ రాయుడు చిట్టూరి హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న శ్రీనివాసా హ్యాచరీస్ గ్రూపు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. బెంగుళూరు ఆర్‌వీ కాలేజీలో ఇంజినీరింగ్ చదివిన ఆయన అనంతరం అమెరికా వెళ్లి అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హార్వార్డ్ బిజినెస్ స్కూల్‌లలో కొన్ని స్వల్పకాలిక కోర్సులు కూడా చేశారు. వైస్-చైర్‌పర్సన్‌గా ఎన్నికైన వనితా దాట్ల హైదరాబాద్‌కు చెందిన ఎలికో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఎఫ్ఓగా ఉన్నారు. ఆమె సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బి.ఏ. అభ్యసించారు. కొన్ని కంప్యూటర్ కోర్సులు చేశారు. అంజనీ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్, రాశి ఫైనాన్స్ తదితర సంస్థల్లో డైరెక్టరుగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది.