Saturday, February 15, 2014

బిర్యానీ ప్రియుల ప్యారడైజ్ !

Sakshi | Updated: February 15, 2014 08:37 (IST)
బిర్యానీ ప్రియుల ప్యారడైజ్ !
  1953 నాటి మాట.. సికింద్రాబాద్‌లో ‘ప్యారడైజ్ టాకీస్’ పేరిట సినిమా థియేటర్ నడిచేది. థియేటర్‌కు అనుబంధంగా సమోసా, చాయ్, బిస్కెట్ అమ్మే చిన్న టీ కొట్టు ఉండేది. ఇరాన్ నుంచి వలస వచ్చిన హుస్సేన్ హిమ్మతీ దాన్ని నడిపేవారు. మెల్లగా ప్యారడైజ్ టాకీస్ కనుమరుగైపోయింది. కానీ హుస్సేన్ హిమ్మతీ టీకొట్టు మాత్రం మెల్లగా ఎదగటం మొదలుపెట్టింది. 10 మందికి పని కల్పించిన ఆ టీ కొట్టు ఇప్పుడు 800 మందికి పైగా ఉద్యోగాలిచ్చే ప్యారడైజ్ హోటల్‌గా ఎదిగింది. హుస్సేన్ తర్వాత ఆయన కొడుకులు అలీ హిమ్మతీ, డాక్టర్ ఖాజీం హిమ్మతీలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చే లా దాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మొత్తం 2.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో ప్యారడైజ్ హోటళ్లు విస్తరించాయి.

 స్థానికానికే ప్రాధాన్యం...
 దేశ, విదేశీ ప్రతినిధుల నోరూరించే ప్యారడైజ్ బిర్యానీ తయారీకి వస్తువుల్ని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారనేది చాలా మంది ప్రశ్న. ప్యారడైజ్ బిర్యానీకి ఉపయోగించే ధావత్ బాస్మతీ బియ్యాన్ని ఢిల్లీ నుంచి, సుగంధ ద్రవ్యాలైన సాఫ్రాన్‌ను కాశ్మీర్, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. మాంసం ఉత్పత్తుల్ని మాత్రం హైదరాబాద్‌లోని చెంగిచెర్ల నుంచి, తృణ ధాన్యాలు, గరం మసాలా, ఇతర దినుసులన్నిటినీ బేగంబజార్ నుంచే తెచ్చుకుంటారు. ఇవన్నీ స్థానికంగా లభించేవే.

 మొదటి గ్రేడువే వాడుతుంటారు. ‘‘మేం బిర్యానీ కోసం ఉపయోగించే మాంసం ఎంత లేతదంటే.. పచ్చి మాంసంతోనే బిర్యానీ వంటకం మొదలుపెడతాం’’ అంటారు గత 30 ఏళ్లుగా ప్యారడైజ్‌లో పనిచేస్తున్న చంద్రశేఖర్. హైదరాబాద్ నుంచి దుబాయ్, ముంబై, చెన్నై నగరాలకు విమానాల్లో బిర్యానీ పార్శిల్స్ వెళ్తుంటాయి.

 త్వరలో మరో 4 బ్రాంచీలు..
 ప్రస్తుతం సికింద్రాబాద్ ప్యారడైజ్‌తో పాటు హైదరాబాద్‌లో 6 ప్యారడైజ్ హోటళ్లున్నాయి. హైటె క్‌సిటీ, మాసబ్‌ట్యాంక్, ఎన్టీఆర్ గార్డెన్, కూకట్‌పల్లి, బేగంపేటల్లో ఇవి పనిచేస్తున్నాయి. ఈ ఏడాదిలో దిల్‌సుఖ్‌నగర్, ఏఎస్‌రావ్ నగర్, నాంపల్లి, ఎర్రగడ్డ ప్రాంతాల్లో మరో 4 హోటళ్లు ప్రారంభం కానున్నా చెప్పారు ఖాజిం హిమ్మతీ. ఇప్పటికే అందుబాటులో ఉన్న కూకట్‌పల్లి ప్యారడైజ్ హోటల్  నుంచి హోమ్ డెలివరీని కూడా ప్రారంభిస్తున్నామని, జనాదరణ బట్టి మిగతా బ్రాంచీలకూ హోమ్ డెలివరీని విస్తరిస్తామని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారాయన.

 ఇత ర నగరాల్లోనూ... : ఇప్పటిదాకా హైదరాబాద్ వాసులు మాత్రమే రుచిచూసిన తమ బిర్యానీని ఇతర జిల్లాలు, మెట్రో నగరాలకు సైతం అందించడానికి ప్యారడైజ్ ప్రణాళికలు వేస్తోంది. 2015 ముగిసేలోగా రాష్ర్టంలోని విజయవాడ, విశాఖపట్నం జిల్లాల్లోను, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనూ ప్యారడైజ్ హోటళ్లు ఏర్పాటు కానున్నాయి. ఏ నగరంలో మొదట ప్రారంభించాలి? అక్కడ అనువైన ప్రాంతమేది? అనే విషయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజల ఆదరణ, అవసరాలను బట్టి బ్రాండ్ అంబాసిడర్ ను కూడా ఎంపిక చేసుకుంటారు.

 పాఠశాల నుంచి మేనేజ్‌మెంట్ వరకు..
 ఇప్పటివరకు ప్యా రడైజ్ హోటళ్లలో పనిచేసే వారంతా హోటల్ మేనేజ్‌మెంట్‌లలో శిక్షణ పూర్తి చేసినవారే. ఎక్కడో కోర్సులు పూర్తి చేసిన వారికి కాకుండా తామే సొంతగా శిక్షణ ఇవ్వటానికి ప్యారడైజ్ హోటల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ‘ప్యారడైజ్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ‘ప్యారడైజ్ రెస్టారెంట్ మేనేజ్‌మెంట్’ను కూడా ప్రారంభించనున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణతో పాటు శిక్షణానంతరం తమ బ్రాంచీల్లో ఉద్యోగులుగా కూడా నియమించుకుంటారు.

 రుచి చూడని వారు లేరు...
 హైదరాబాద్‌కు ప్రముఖులు ఎవరొచ్చినా ప్యారడైజ్ బిర్యానీ రుచి చూడాలని కోరుకుంటారు. రాహుల్‌గాంధీ, ఎంపీలు జ్యోతిరాదిత్య సింధియా, ప్రియాదత్, సచిన్‌పైలట్, మిలింద్ దేవరా, కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, క్రికెట  ర్ సచిన్ టెండూల్కర్, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి; చిత్రకారుడుఎంఎఫ్ హుస్సేన్, నాటి మంత్రులు గురుమూర్తి, రోడా మిస్త్రీ, సికింద్రాబాద్ మేయర్ సాంబయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ప్రముఖుల లిస్ట్ చాలా పెద్దదేనన్నారు ఖజీం హిమ్మతీ.

 ‘పీ’ లోగో ఉంటేనే ప్యారడైజ్...: ప్యారడైజ్ పేరుతో నగరంలో చాలా హోటళ్లు, బేకరీలున్నాయని అవన్నీ తమవి కావని ఖాజీం చెప్పారు. ‘పీ- అనే అక్షరం, 1953 ఉన్న లోగో హోటళ్లు మాత్రమే మావి. సికింద్రాబాద్‌లోని సెంట్రల్ కిచెన్‌లోనే బిర్యానీ వండుతాం. ఇక్కడి నుంచే అన్ని బ్రాంచీలకు సరఫరా చేస్తాం. రాబోయే తరాలూ ఈ వ్యాపారంలోనే ఉంటాయి’ అన్నారాయన.