Thursday, February 25, 2010

రైల్వేల భవిష్యద్దర్శనం.. వెల్లడిస్తున్న విజన్‌-2020

రైల్వేల భవిష్యద్దర్శనం
వెల్లడిస్తున్న విజన్‌-2020
దేశ రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వేది ప్రముఖ స్థానం. ఏటా 700 కోట్ల మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ప్రయాణికుల రవాణాలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో అలరారుతోంది. సుమారు 64వేల కిలోమీటర్ల రైల్వేలైనుతో ప్రపంచంలో తృతీయ స్థానంలో ఉంది. 83 కోట్ల టన్నుల (దేశంలోని మొత్తం సరకు రవాణాలో 35 శాతం) పైబడి సరకు రవాణా చేస్తూ దేశ ఆర్థిక రంగానికి చేదోడుగా నిలుస్తోంది. దేశంలోని అనేక మారుమూల ప్రాంతాలను కలుపుతూ దేశసమైక్యతకు ప్రతీకగా భాసిల్లుతోంది. ఇంతటి ఘన నేపథ్యం గల భారత రైల్వే వ్యవస్థను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు అభివృద్ధి చేసేందుకు రైల్వే మంత్రి మమతాబెనర్జీ నిర్ణయించారు. ఈ క్రమంలో వచ్చే 10 సంవత్సరాల్లో భారత రైల్వేలో తీసుకురాదలచిన ప్రగతిపై విజన్‌-2020 (దార్శనికపత్రం-2020)ని 2009లో రూపొందించారు. దీని ఆధారంగానే 2010-11 రైల్వేబడ్జెట్‌ను ఆమె పార్లమెంటుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో విజన్‌-2020లో ప్రధాన లక్ష్యాలు సంక్షిప్తంగా...

* వచ్చే 10 ఏళ్లలో రైల్వేల అభివృద్ధికి రైల్వే సొంతనిధుల నుంచి రూ.14 లక్షల కోట్లు (64శాతం) పెట్టుబడి.
* స్థూల జాతీయోత్పత్తిలో 1.2 శాతం (రూ.90వేల కోట్లు) గా ఉన్న రైల్వేల వాటాను వచ్చే పదేళ్లలో 3 శాతాని (రూ.2.70కోట్లు) కి పెంచడం.
* ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ప్రతిఏటా కొత్తగా 2,500 కిలోమీటర్ల చొప్పున 2020 నాటికి కొత్తగా 25 వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం. దీనికి తోడు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 11,985 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం.
* సరుకు, ప్రయాణికుల రవాణాకు ప్రత్యేక మార్గాల ఏర్పాటు. దీని వల్ల ప్రస్తుతం గంటకు 130 కిలోమీటర్లుగా ఉన్న ప్రయాణికుల రవాణా వేగం 200 కిలోమీటర్లకు చేరుతుంది. అలాగే సరుకు రవాణా వేగం 70 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు పెరుగుతుంది.
* అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, కచ్చితమైన ప్రణాళికతోరైలు ప్రమాదాలను పూర్తిగా నివారించడం.
* రైల్వేలో 10 శాతం పునరుత్పాదక ఇంధన వినియోగం ద్వారా వాతావరణ పరిరక్షణకు కృషి. తద్వారా కార్బన్‌ క్రెడిట్లను సాధించి అదనపు ఆదాయాన్ని సాధించడం.
* ప్రయాణికులకు అత్యుత్తమ సేవల్లో భాగంగా డబుల్‌ డెక్కర్‌ కోచ్‌ల నిర్మాణం, మరింత సౌకర్యవంతమైన స్లీపర్‌ క్లాస్‌ బోగీల రూపకల్పన, గ్రీన్‌ టాయ్‌లెట్స్‌ ఏర్పాటు, మొబైల్‌ టిక్కెట్‌ బుకింగ్‌ సదుపాయాల కల్పన.
* శాటిలైట్‌ అనుసంధాన రైల్వే లైను విధానం ద్వారా రైలు వచ్చే సమయాన్ని కచ్చితంగా గుర్తించడం, ప్రయాణికుల రవాణా బోగీల ఉత్పత్తి పెంపు వంటి అంశాల్లో సాహసోపేతమైన, నూతన విధానాలకు పెద్దపీట.
* 250-300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్‌ రైళ్ల కోసం 4 హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టుల నిర్మాణం. దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా వివిధప్రాంతాలు, పారిశ్రామిక వాడలు, నౌకాశ్రయాలు, వాణిజ్య, పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైల్వే సేవల విస్తరణకు 8 కారిడార్ల ఏర్పాటు.
* రైల్వే సరుకు రవాణాను 50 శాతానికి పెంచడం.
* రైల్వే భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించడం, రైల్వే లైన్ల వెంట ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌, సిగ్నలింగ్‌ టవర్ల ఏర్పాటుకు అనుమతుల ద్వారా టెలికాం, ఐటీ రంగాల నుంచి ఆదాయాన్ని ఆర్జించడం.
* ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సేవలు. రైల్వే నెట్‌వర్క్‌ ఆధునికీకరణ, విస్తరణ.
* కొత్త లైన్ల నిర్మాణానికి 50 శాతం పైగా నిధులు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడితే అటువంటి లైన్లకు రైల్వే మిగిలిన నిధులు సమకూరుస్తుంది.
* ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సీఎస్‌ఐఆర్‌, డీఆర్‌డీఓ వంటి సంస్థల భాగస్వామ్యంతో రైల్వే మౌలిక సదుపాయాలు, సేవల్లో పోస్టుగ్రాడ్యుయేట్‌, డాక్టరేట్‌ డిగ్రీల స్థాయిని పెంచడం.