Saturday, February 27, 2010

శత్రు దుర్భేద్య భారతం

శత్రు దుర్భేద్య భారతం
ఇంకా ఎంత దూరం! కంచె బలంగా ఉంటేనే చేనుకు రక్షణ. అలా కంచెను బలోపేతం చేయాలంటే బడ్జెట్‌లో పుష్కలంగా నిధులు అవసరం.దేశ భద్రతకు రోజురోజుకూ పెను సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో... మన రక్షణ వ్యవస్థను శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దడం మన ముందున్న ప్రధాన లక్ష్యం.
దేశ ప్రజలేం కోరుకుంటున్నారు?
* మన రక్షణ బడ్జెట్‌ రూ.లక్షన్నర కోట్లతో ఘనం. తరచి చూస్తే మన రక్షణ వ్యవస్థ లోపాలమయం. ఓ ఆయుధం కొనాలంటే దశాబ్దాల పాటు నిరీక్షించాల్సిన దుస్థితి. దీన్నుంచి బయటపడాలి.
* ఆయుధాల దిగుమతిలో కుంభకోణాలతో కొత్త అస్త్రాల కొనుగోలుకు రక్షణ మంత్రులు, అధికారులు భయపడుతున్నారు. ఇది దళాల యుద్ధ సన్నద్ధతపై ప్రభావం చూపుతోంది. మరోపక్క చైనా, పాకిస్థాన్‌లు సరికొత్త ఆయుధాలతో దూసుకుపోతున్నాయి. భారత రక్షణ బడ్జెట్‌ 30 బిలియన్‌ డాలర్లు కాగా.. చైనా బడ్జెట్‌ 130 బిలియన్‌ డాలర్లు. ఏకకాలంలో పాకిస్థాన్‌తో పాటు చైనాతోనూ యుద్ధంచేసే సామర్థ్యాన్ని 2025 నాటికి సంతరించుకోవాలని భారత్‌ భావిస్తోంది. ఆధునికీకరణ జరుగుతున్న తీరును చూస్తే.. ఆ స్థాయిని అందుకోవడం కష్టమే. కాబట్టి ఆధునికత శీఘ్రగతిన సాగాలి.
* పదాతి దళానికి అత్యవసరమైన ప్రాథమిక యుద్ధ సామగ్రికి సంబంధించి రూ.34 వేల కోట్ల విలువైన ప్రతిపాదనలు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. 1962లో చైనా దాడి చేసినప్పుడు సైన్యం వద్ద ఆధునిక రైఫిళ్లు, పర్వత ప్రాంతాల్లో ధరించే ప్రత్యేక దస్తులు, బూట్లు లేవు. పదాతిదళ ప్రస్తుత పరిస్థితి నాటి దుస్థితిని తలపిస్తోంది. నిధులు సకాలంలో విడుదలచేయాలి.
* సైన్యంతో పోలిస్తే ఉగ్రవాదులే అత్యాధునిక ఆయుధాలు వాడుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి 36 ఎం చేతి గ్రెనేడ్లనే ఆర్మీ వాడుతోంది. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న చైనా, పాకిస్థాన్‌ తయారీ గ్రెనేడ్లను సైనికులు ఉపయోగించడం మన దౌర్భాగ్యాన్ని చాటుతోంది. ఇప్పటికైనా మేల్కొనాలి.
* 120 యుద్ధవిమానాల కొనుగోలులో పురోగతే లేదు. మిగ్‌-21 యుద్ధవిమానాలు శరవేగంగా కూలిపోతున్నాయి. వైమానిక దళాన్ని ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలి.
* ఆయుధ తయారీ రంగంలో స్వావలంబనకు ఏర్పాటైన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) పనితీరుపై నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ భారత్‌ 70% ఆయుధాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. గత బడ్జెట్‌లో డీఆర్‌డీవోకు రూ.8,481 కోట్లు కేటాయించారు. దీని పనితీరు, పునర్‌వ్యవస్థీకరణ అంశాల్ని పట్టించుకోకుండా కేవలం నిధుల కేటాయించుకుంటూ పోతే ఒరిగేదేమీ ఉండదు.
* డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 5 క్షిపణుల్లో ఇప్పటిదాకా కేవలం పృథ్వి మాత్రమే సైన్యంలోకి ప్రవేశించింది. మిగతావీ సైన్యానికి చేరాలి.
* తేలికపాటి యుద్ధవిమానాన్ని(ఎల్‌సీఏ) తయారుచేయడానికి రూ.560 కోట్ల అంచనాతో డీఆర్‌డీవోకు 1983లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సవరించిన అంచనాలు ప్రకారం ఇది రూ.5,489 కోట్లకు చేరింది. ఇప్పటిదాకా యుద్ధవిమానం వైమానిక దళం చేతికి అందలేదు. దీంతో 126 బహుళ ప్రయోజన ఫైటర్‌ విమానాలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా ఎల్‌సీఏ తయారుచేయాలి.
* డీఆర్‌డీవో పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం రామారావు కమిటీని నియమించింది. జాయింట్‌ వెంచర్లు, ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచాలని కమిటీ చేసిన సూచనల్ని అమలుచేయాలి.
* అమెరికా వంటి ప్రధాన ఆయుధ ఉత్పత్తి దేశాల్లో రక్షణ పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యం గణనీయంగా ఉంటుంది. భారత్‌ ఇప్పుడిప్పుడే ప్రైవేటుకు అనుమతిస్తున్నా.. ఈ వేగం పెంచాలి.
* సైన్యం ఆధునికీకరణ, వేతనాల పెంపు నేపథ్యంలో తమ బడ్జెట్‌లో 15 నుంచి 20 శాతం పెరుగుదలను రక్షణ శాఖ ఆశిస్తోంది.
'రక్షణ'కు అరకొరే!
* గత ఏడాది భారీ కేటాయింపులతో రక్షణశాఖను కరుణించిన ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఈసారి మాత్రం ఆ శాఖను చిన్నచూపు చూశారు. శుక్రవారం ప్రవేశపెట్టిన 2010-11 కేంద్ర బడ్జెట్‌లో రూ.1,47,344 కోట్లను రక్షణ పద్దుకు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ పెరుగుదల కేవలం నాలుగు శాతంగానే (రూ.5,641 కోట్లు) ఉంది. 2009-10 బడ్జెట్‌లో రక్షణశాఖకు భారీ స్థాయిలో 34 శాతం (రూ.36,103 కోట్లు) మేర అదనపు కేటాయింపులు జరిపారు. ముంబయి దాడుల అనంతరం కొన్ని ఆయుధాలు కొనుగోలు చేయాల్సి రావడం, వేతన సవరణ సంఘం సిఫార్సుల నేపథ్యంలో ఈ పెంపు అవసరమైంది. అయితే గత ఏడాది సవరించిన బడ్జెట్‌ ప్రకారం కేటాయింపులు రూ.1,36,264 కోట్లుకు పడిపోయాయి. ఈ మొత్తంతో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు 7.5% మేర పెరిగినట్లు లెక్క. ఈసారి పెట్టుబడి వ్యయం కింద రూ.60వేల కోట్లు కేటాయించారు. దేశ రక్షణకున్న ప్రాధాన్యం దృష్ట్యా అవసరమైతే మరిన్ని కేటాయింపులు చేస్తామని ప్రణబ్‌ పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్‌.. స్థూల జాతీయోత్పత్తిలో 2.5 శాతంగా ఉంది.

విభాగాల వారీగా కేటాయింపులు ఇవీ..
* సైన్యం- 58,979 కోట్లు
* వైమానిక దళం- 15,803 కోట్లు
* నౌకాదళం-8402 కోట్లు
* రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)- 5230 కోట్లు
* ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలు-246 కోట్లు