Friday, February 26, 2010

ఈ సిఫార్సులు అమలు చేస్తే...

ఈ సిఫార్సులు అమలు చేస్తే..
ఆర్థిక పరిపుష్టికి రాష్ట్రాలు అవలంబించాల్సిన విధానాలను 13 ఆర్థిక సంఘం నిర్దేశించింది. ఆర్థిక సంఘం సిఫార్సులు, వాటికి అనుగుణంగా మన రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలు ఇలా ఉన్నాయి...
విద్యుత్‌ పంపిణీ నష్టాలు
సిఫార్సు : విద్యుత్‌ పంపిణీ, సరఫరాలో నష్టాలు తగ్గించడానికి పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. ఇందుకు వ్యవసాయ, గ్రామీణ, పారిశ్రామిక ఫీడర్లు ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలి. హైఓల్టేజ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టం (హెచ్‌వీడీఎస్‌)ను వేగవంతం చేయాలి. పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగించాలి. చౌర్యం అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. పంపిణీ, సరఫరా సామర్థ్యం పెంచడానికి పంపిణీ ఫ్రాంఛైజింగ్‌, కరెంటు సర్వీసుల కంపెనీ(ఈఎస్‌సీవో)లు ఏర్పాటు చేయాలి.
ప్రభావం: రాష్ట్రంలో ప్రత్యేక ఫీడర్లు, హెచ్‌వీడీఎస్‌ అమలవుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు, ఈఎస్‌సీవోలు ఏర్పాటు చేయాలంటే సబ్‌స్టేషన్లను ప్రైవేటురంగానికి అప్పగిస్తారు. ముంబై, ఒరిస్సాలో ఈ విధానం అమలు తీవ్ర వివాదాలకు దారితీసింది. రాష్ట్రంలో నగరాల్లోని సబ్‌స్టేషన్లను ప్రైవేటీకరించాలని ఎప్పటి నుంచో కేంద్రం ఒత్తిడి తెస్తోంది. 2007లో ప్రపంచబ్యాంకు నివేదిక కూడా ఇవే విషయాలను నొక్కి చెప్పింది. రాయితీలు, ఉచిత పథకాలు ఎత్తివేయడమే దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం. 2001లో విద్యుత్‌ఛార్జీల ఉద్యమం వీటికి వ్యతిరేకంగా వచ్చిందే కావడం గమనార్హం.
జీతాల పద్దుల్లో పారదర్శకత
సిఫార్సు: ఉద్యోగుల సంఖ్య, వారి జీతాల ఖర్చులు, ఏయే పద్దుల ద్వారా చెల్లిస్తున్నదీ కచ్చితమైన వివరాలు వెల్లడించాలి. కార్యాలయాల నిర్వహణ ఖర్చులనూ బయటపెట్టాలి.
ప్రభావం: ప్రస్తుతం ఇటువంటి కచ్చితమైన వివరాలను రాష్ట్రం బయటపెట్టటంలేదు. ఖాళీలకు కూడా జీతాలను లెక్కగట్టి జీతాల పద్దును భారీగా చూపిస్తున్నారనేది ఉద్యోగుల వాదన. కొత్త సిఫార్సు వల్ల ఈ అనుమానాలు నివృత్తి అవుతాయి.
కరెంటు కొనుగోలు
సిఫార్సు: అత్యధిక ధరకు విద్యుత్‌ కొనడం సాధ్యమైన మేరకు తగ్గించాలి. ఇందుకోసం కేస్‌1 బిడ్డింగ్‌ పద్ధతిని అనుసరించాలి. తద్వారా పీక్‌ డిమాండ్‌ ధరను నివారించవచ్చు.
ప్రభావం: విద్యుత్‌ సరఫరా లోటు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ముందున్నాం. కేస్‌1 బిడ్డింగ్‌కు ట్రాన్స్‌కో ఇప్పటికే సన్నాహాలు చేసింది. ఈ విధానంలో విద్యుత్‌ సరఫరా దారులతో సగటు ధరకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంటారు. పీక్‌ డిమాండ్‌ ఏర్పడిన సందర్భాల్లో అదే ధరకు వాడుకునే విధంగా ఒప్పందాలు చేసుకోవచ్చు. తద్వారా వేసవి, వ్యవసాయ సీజన్లలో అధిక ధరకు కరెంటు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండబోదు.
వేతన సవరణలు
సిఫార్సు: వేతన సవరణ సంఘం సిఫార్సులు ఎప్పటి నుంచి అమలవుతాయో ఆ తేదీ నుంచి మాత్రమే బకాయిలను చెల్లించాలి.
ప్రభావం: సిఫార్సులను జనవరిలో ఆమోదించి ఫిబ్రవరి నుంచి బకాయిలు ఇస్తున్నారు. ఇకపై కూడా ఈ పద్ధతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే అవకాశాలున్నాయి.
పొదుపులో సంస్కరణలు
సిఫార్సు: చిన్న మొత్తాల పొదుపును పెంచుకొనేందుకు రాష్ట్రాలు సంస్కరణలు తేవాలి.
ప్రభావం : ప్రస్తుతం ఈ మొత్తాల సేకరణ బాగా తగ్గిపోయింది. సంస్కరణల ద్వారా ఈ మొత్తం పెరిగితే అదనపు అప్పులకు ఇప్పటి మాదిరిగా ఎగపడాల్సిన పరిస్థితి తప్పుతుంది.
రవాణా పాసుల్లో మార్పులు
సిఫార్సు: రాష్ట్రం మీదుగా ప్రయాణించే సరుకుల వాహనాలకు ట్రాన్సిట్‌ పాస్‌ల జారీ విధానంలో మార్పులు అవసరం. జాప్యం లేకుండా వాహనాలు వెళ్లగలగాలి.
ప్రభావం: ట్రాన్సిట్‌ పాస్‌ల జారీ విధానం లోపభూయిష్టంగా ఉన్నట్టు కాగ్‌ అనేక సార్లు ఏకరవుపెట్టింది. ఇటువంటి లోపాల వల్ల పన్నేమీ చెల్లించకుండానే అనేక వస్తువులు రాష్ట్రంలోకి వచ్చిపడుతున్నాయి.
జలవిద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం
సిఫార్సు: 2012 నాటికి దేశంలో విద్యుత్‌ అవసరాలకు తగ్గ స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యం సాధించాలి. జల విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పూర్తిచేయాలి.
ప్రభావం: జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు ప్రధాన అడ్డంకి అనుమతుల జారీ. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నుంచి మొదలుకొని అనేక పెద్ద ప్రాజెక్టులు చేపట్టింది. కానీ ప్రభుత్వ పెట్టుబడి పైసా ఇవ్వలేదు. ఫలితంగా జాప్యం చోటుచేసుకుంటోంది.
రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రాజెక్టులు

సిఫార్సు: బొగ్గు వనరులున్న రాష్ట్రాలతో కలిసి పొరుగు రాష్ట్రాలు సంయుక్త భాగస్వామ్యంతో థర్మల్‌ విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు నెలకొల్పాలి. రవాణా, ఇతర ఖర్చులు తగ్గించేందుకు బొగ్గు వనరులున్న ప్రాంతాల్లోనే వీటిని నిర్మించాలి.
ప్రభావం: నదీ పరివాహక ప్రాంతాల్లోనే బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో మన రాష్ట్రం ఒకటి. అయితే థర్మల్‌ ప్రాజెక్టులపై స్థానిక ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఇతర రాష్ట్రాలతో కలిస్తే ఉత్పత్తి విద్యుత్‌ను పంచుకోవాల్సి వస్తుంది. బొగ్గు వనరులున్న మనలాంటి రాష్ట్రాలకు ఇది సానుకూలాంశం కాదు. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వంటి వనరులున్న రాష్ట్రాలతో కలిసి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా కరెంటు వాటా పొందొచ్చు. ఇది సానుకూలాంశం.
వినియోగదారుల్లో ప్రచారం
సిఫార్సు: విద్యుత్‌ సంబంధిత విషయాల్లో వినియోగదారుల్లో చైతన్యం తేవాలి. విద్యుత్‌ నియంత్రణ మండలిని బలోపేతం చేయాలి. బహుళ సంవత్సరాల టారిఫ్‌ను ప్రారంభించాలి. విద్యుత్‌ రంగంలో కార్పొరేట్‌ పాలనను పెంపొందించాలి.
ప్రభావం: ప్రతిఏటా లేదా నిర్ణీత గడువులోగా విద్యుత్‌ ఛార్జీలు పెంచేందుకు ఇదో ప్రణాళిక. ఏయే సమయంలో ఎంత ఛార్జీలు పెంచుతారో ముందుగానే నిర్ణయిస్తారు. రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో కార్పొరేట్‌ పాలన మొదలైంది. కానీ వినియోగదారుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఆవశ్యకతను విస్మరించాయి.
ప్రభుత్వరంగ సంస్థలు
సిఫార్సు: నడవలేని స్థితిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను వచ్చే ఏడాది మార్చి మాసాంతానికి మూసివేసేందుకు మార్గసూచీ తయారు చేయాలి. పెట్టుబడుల ఉపసంహరణతో పాటు ప్రైవేటీకరణకు చర్యలు చేపట్టాలి.
ప్రభావం: రాష్ట్రంపై ప్రభావం పెద్దగా ఉండదు. 2006లో ప్రభుత్వం భారీఎత్తున ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, ప్రైవేటీకరణ కోసం జీవో నెం.5 జారీ చేసింది. దీనిపై రాజకీయంగా పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో జీవోను ఉపసంహరించుకుంది. ఆ తర్వాత ఒక్క సంస్థనూ మూసివేయలేదు. ప్రస్తుతం ఏ ఒక్క సంస్థను మూసివేసే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వ రంగసంస్థలు సరకులను ఉత్పత్తి చేసేవి కాకుండా సంక్షేమ దృక్పథం, అనుబంధ కార్యకలాపాల నిర్వహణలో ఉన్నవే అయినందున మూసివేతకు ఆస్కారం లేదు.

సిఫార్సు: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, మూసివేతకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని నియమించాలి. ప్రతిపాదనల పరిశీలనకు ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో సాంకేతిక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలి.
ప్రభావం: ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల్లోని అదనపు సిబ్బందిని గుర్తించి తొలగించేందుకు ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సచివాలయం ఉంది.