Saturday, February 27, 2010

అంతర్గత అ'భద్రత'!

అంతర్గత అ'భద్రత'!
ముంబయి దాడుల తర్వాత దేశ అంతర్గత భద్రత ప్రశ్నార్థకమైంది. ఓ వైపు ఉగ్రవాదం, మరోవైపు నక్సలిజం అంతర్గత భద్రతకు పెను సవాలు విసురుతున్నాయి. కాలం చెల్లిన ఆయుధాలు, ప్రణాళికా లోపాలు, నిధుల కొరత, రాజకీయ సంకల్ప లేమి ప్రజాభద్రతకు శాపంగా మారాయి. అంతర్గత భద్రత బలోపేతానికి ప్రస్తుత బడ్జెట్‌లో గణనీయంగా నిధులు అవసరం.
సామాన్యుడి గోడు ఏమిటి?
* ముంబయి తరహా దాడులు మున్ముందు జరగకుండా దేశం రక్షణ వ్యవస్థలన్నీ బలోపేతం కావాలి.
* సరికొత్త పోకడలు పోతున్న తీవ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ఏదో ఒక వ్యూహం సరిపోదు. అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, భద్రత, నిఘా సంస్థల మధ్య సమన్వయం, ముందస్తు దాడులు, కమెండోలకు శిక్షణ లాంటివి చాలా ముఖ్యం.
* ముంబయి దాడులకు పాల్పడిన తీవ్రవాదులు తీరం గుండానే వచ్చారు. కాబట్టి తీరప్రాంత గస్తీని బలోపేతం చేయాలి.
* అంతర్గత భద్రతకు ఇజ్రాయెల్‌ పక్కా వ్యూహాల్ని అమలుచేస్తుంది. సరిహద్దు బయటి ప్రమాదాల్ని 'మొస్సాద్‌', అంతర్గత భద్రతను 'షిన్‌బెట్‌' గూఢచార సంస్థలు చూసుకుంటాయి. పని విభజన స్పష్టం. మన దగ్గర అలా లేదు. ఈ తరహా లోపాల్ని సరిదిద్దాలి.
* నెదర్లాండ్స్‌ లాంటి చిన్న దేశాలు సైతం ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు విమానాశ్రయాల్లో ఫుల్‌బాడీ స్కానర్లను ప్రవేశపెట్టాయి. ఇలాంటివి మన దేశంలోనూ ప్రవేశపెట్టాలన్న వాదన ఉంది.
* నక్సలైట్ల ఏరివేతకు ఉద్దేశించిన ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ లాంటి వాటి వల్ల గిరిజనులకు నష్టం కలగకూడదు. అటవీ ప్రాంతాల్లోని ఖనిజాల్ని పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకే ఈ ఆపరేషన్‌ అన్న విమర్శల్లాంటివి రాకుండా చూసుకోవాలి.
* 20 రాష్ట్రాల్లో.. 223 జిల్లాల్లో.. 2 వేల పోలీసుస్టేషన్ల పరిధిలో మావోయిస్టు కార్యకలాపాలు సాగుతున్నాయి. దీనికి కారణం స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా... మారుమూల పల్లెలు నేటికీ అభివృద్ధికి నోచుకోకపోవడమే. కేంద్రం ఇపుడు గిరిజనాభివృద్ధి మంత్రం విన్పిస్తోంది. ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది.
* దేశంలో అవసరమైన సంఖ్యలో పోలీసుల్లేరు. ప్రతి లక్షమందికి 123 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి సూచించిన ప్రకారం అయితే సాధారణ పరిస్థితుల్లో లక్ష మందికి 246 మంది ఉండాలి.
* దేశీయంగా తలెత్తుతున్న వేర్పాటువాద సమస్యలకు సాధ్యమైనంత త్వరగా రాజకీయ పరిష్కారం కనుగొనాలి.

బడ్జెట్‌ ఏమిచ్చింది..?
* నక్సలైట్లనూ, తీవ్రవాదులను ఎదుర్కొనే పారామిలిటరీకి, ముఖ్యమైన ఇంటిలిజెన్స్‌కూ నిధులను తగ్గించారు. (బ్రాకెట్లలో 2009-10 బడ్జెట్‌ కేటాయింపులు)
* పారామిలిటరీకి 16 శాతం తగ్గింపుతో రూ. 5,745 కేటాయించారు. (రూ. 6,838.84)
* ఇంటిలిజెన్స్‌ బ్యూరో: రూ.779.37 కోట్లు (రూ.918.03 కోట్లు)
* జాతీయ భద్రతా దళాల(ఎన్‌ఎస్‌జీ)కు 10 శాతం ఎక్కువ ఇచ్చారు: రూ. 352.58 (రూ.320.63)
* హోంమంత్రిత్వ శాఖకు ఈ సారి 10 శాతం ఎక్కువ నిధులను కేటాయించారు.
* హోంశాఖ: రూ. 37,136.07 (రూ. 33,809 కోట్లు)
* సరిహద్దు రక్షణ: రూ. 1489.28 కోట్లు
* పోలీసు ఆధునికీకరణ: రూ.1975 కోట్లు
* నేరాలనూ, నేరస్థులనూ పసిగట్టే వ్యవస్థ: రూ.175 కోట్లు (రూ. 104 కోట్లు)
* నేషనల్‌ ఇంటిలిజెన్స్‌ గ్రిడ్‌ (నాట్‌గ్రిడ్‌): రూ. 1.5 కోట్లు
* జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్‌ఐఏ): రూ.16.33 కోట్లు (రూ.15కోట్లు)
* ఢిల్లీ పోలీసులు: రూ.2,805 కోట్లు
* కేంద్ర పోలీసు గృహనిర్మాణం: రూ.444 కోట్లు
* పోలీసు విభాగం మొత్తం: రూ.30,000 కోట్లు
* 2009-10 సంవత్సరంలో అంతర్గతభద్రత బాగానే ఉందని ప్రణబ్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్గత భద్రతకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని చెప్పారు.
* వామపక్ష తీవ్రవాదం ఉన్న 33 జిల్లాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనుల కోసం కేబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
* వామపక్ష తీవ్రవాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రణాళికా సంఘం... ఒక 'సమీకృత కార్యాచరణ ప్రణాళిక'ను రూపొందిస్తోంది.
* కాశ్మీర్‌లో హింస తగ్గింది. ఈ రాష్ట్రం నుంచి అయిదు పారా మిలిటరీ దళాల్లోకి 2 వేల మంది యువతను తీసుకుంటారు.

రాష్ట్రానికి దక్కిందేమిటి..?
నక్సల్స్‌: మావోయిస్టుల నిరోధానికి కేంద్రం నుంచి మరింత సాయం రానుంది. పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు రూ.120 కోట్లు ఇస్తున్నారు. ఇది మరింత పెరగనుంది.