Saturday, February 27, 2010

రాష్ట్రానికి ఏఐ'బీపీ'!

రాష్ట్రానికి ఏఐ'బీపీ'!
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి భారీగా నిధులు పొందాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. 2009-10 ఆర్థిక సంవత్సరం కేటాయింపు కన్నా నామమాత్రంగానే సత్వర సాగునీటి ప్రయోజన పథకానికి(ఏఐబీపీ) బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగాయి. నిధులు పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ కొన్నేళ్లుగా కోరుతున్నా ఫలితం లేదు. ఐదేళ్లలో ఏఐబీపీ కింద కేంద్రం రూ.20,394 కోట్లు ఖర్చుచేస్తే, దాంట్లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది రూ.3660 కోట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో ఒక సంవత్సరంలో రాష్ట్రం కోరుకున్నట్లు రూ.4000 కోట్లు వచ్చే అవకాశం లేదని నీటిపారుదల శాఖ వర్గాలే అంటున్నాయి.
* 2009-10 ఆర్థిక సంవత్సరంలో ఏఐబీపీ, ఇతర సాగునీటి పథకాలకు రూ.9700 కోట్లు కేటాయించగా, ఇందులో 2009 డిసెంబరు ఆఖరు వరకు చేసిన ఖర్చు 44 శాతమే. ఈ ఏడాది రూ.11,500 కోట్లు కేటాయించినా, దీంట్లో ఏఐబీపీకి సుమారు రూ.10,000 కోట్లు మాత్రమే. నీటిపారుదలకు రూ.200 కోట్లు పెంచి రూ.1105 కోట్లు కేటాయించారు. మధ్య తరహా నీటిపారుదలకు రూ.424.77కోట్లు చిన్ననీటి తరహాకు రూ.210.81 కోట్లు కేటాయించారు.
రాష్ట్రం ఏం కోరుతోంది?
* సాగునీటి ప్రాజెక్టులకు చేయూత అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) ఆశించిన ఫలితాల్ని సాధించలేకపోతోంది. దీనికి మెరుగులు దిద్దాల్సి ఉంది.

* ప్రణాళికా సంఘం నుంచి పెట్టుబడి అనుమతులున్న ప్రాజెక్టులకే ఏఐబీపీ నిధులు అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఒక ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే ఇంకో ప్రాజెక్టు చేపట్టాలన్న నిబంధన కూడా సమస్యగా మారింది. కేంద్ర బడ్జెట్‌లో ఏఐబీపీ కింద కేటాయింపుల్ని కేంద్రం అరకొరగా ఇస్తోంది. దీన్ని పెంచాలని రాష్ట్రం కోరుతోంది.
* ప్రధానమంత్రి ప్రత్యేక ప్యాకేజీ కిందికి వచ్చే జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందిస్తోంది. నిబంధనలు మాత్రం ఏఐబీపీవే. ఈ ప్యాకేజీ కింద ఎంపికచేసిన నాలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ 38 సాగునీటి ప్రాజెక్టులకు అందిన సాయం కేవలం రూ.4490 కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2658 కోట్లు.
కర్ణాటకకు రూ.497.85 కోట్లు, కేరళకు రూ.3.62 కోట్లు, మహారాష్ట్రకు రూ.1330.67 కోట్లు వచ్చాయి.
* నికరజలాల్లేని ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు లేవు. దీంతో అనంతపురం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ప్రాజెక్టులకు ఈ ప్యాకేజీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

రాష్ట్రానికేం ఒరిగింది?
* 2010-11 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి సత్వర సాగునీటి ప్రయోజనం(ఏఐబీపీ) ద్వారా రూ.4000 కోట్లు వస్తాయని అంచనావేసి రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయింపులు చేసింది.
* ఇందులో 14 భారీ ప్రాజెక్టులకు రూ.3326 కోట్లు, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటివనరులకు రూ.674 కోట్లు వస్తాయని అంచనావేసింది.

* అత్యధికంగా పోలవరం ప్రాజెక్టుకు రూ.వెయ్యికోట్లు, శ్రీరామసాగర్‌ వరదకాలువకు రూ.550 కోట్లు, భీమాకు రూ.404.55 కోట్లు, దేవాదులకు రూ.295 కోట్లు, ఎస్సారెస్పీకి రూ.250 కోట్లు, తోటపల్లి రూ.124 కోట్లు, గుండ్లకమ్మకు రూ.75 కోట్లు వస్తాయని ఆశించింది. ప్రాణహిత-చేవేళ్ల మినహా మిగిలిన అన్ని ప్రాజెక్టులు ఏఐబీపీ నిధులు పొందడానికి అర్హత సాధించినవే.

* అనుమతులుండి ఆర్థిక సాయం పొందేందుకు అర్హత ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం నిధులు వ్యయం చేయలేకపోవడంతోపాటు, కేంద్రం కూడా ఏదో ఒక సాకుతో విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది.

* 2009-10 ఆర్థిక సంవత్సరంలోనూ ఏఐబీపీ కింద రూ.4000కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనావేసింది. కానీ ఇప్పటివరకు ఏమీరాలేదు. రూ.660 కోట్లు వచ్చినా, అవి 2008-09 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆలస్యంగా విడుదలైనవే.

* పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తే కొంత ఎక్కువగా నిధులు వచ్చే అవకాశం ఉంది. 2009 ఫిబ్రవరి నుంచి జాతీయ ప్రాజెక్టులను గుర్తించి నిధులను విడుదల చేస్తోంది. దేశంలో 14 ప్రాజెక్టులకు జాతీయహోదా లభించగా, వాటిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒక్కటీ లేదు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన తర్వాత, నిర్మాణం పూర్తి చేయడానికి కావలసిన వ్యయంలో 90 శాతం కేంద్రం ఇస్తోంది.