Thursday, February 25, 2010

నా హయాంలోనే లాభాలు: లాలు

నా హయాంలోనే లాభాలు: లాలు
న్యూఢిల్లీ: మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో కొత్తదనం ఏమీ లేదని రైల్వే శాఖ మాజీ మంత్రి లాలు ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. రైల్వేలు వ్యతిరేక దిశలో వెళ్తున్నాయని విమర్శించారు. ఆమె బడ్జెట్లో ఎన్నో ప్రాజెక్టులు ప్రకటించారు. సర్వేల అనంతరం అవన్నీ అసాధ్యమని తేలుతాయని వ్యాఖ్యానించారు. మమత గత డిసెంబరులో పార్లమెంటులో ప్రవేశపెట్టిన 'శ్వేతపత్రం' అంశాన్నీ ఆయన ప్రస్తావించారు. ''నా హయాంలో అకౌంటిగ్‌ విధానంపై మమత వేలెత్తి చూపారు. నేనిప్పుడు ఆమెను వినమ్రంగా అడుగుతున్నా.. ఆమె ఆ అకౌంటింగ్‌ విధానాన్ని మార్చారా లేక దాన్నే వాడుతున్నారా?'' అని. గత ఎన్డీఏ ప్రభుత్వంలో రైల్వేమంత్రులుగా పనిచేసిన మమతా బెనర్జీ, నితీశ్‌ కుమార్‌ల నేతృత్వంలో రైల్వే పరిస్థితిని ఉదహరిస్తూ.. ''వారు నిధుల కోసం ప్రభుత్వం వద్దకు వెళ్లేవారు. డివిడెండ్లు చెల్లించడంలో విఫలమయ్యారు'' అని ఎద్దేవా చేశారు. శ్వేతపత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు తప్పుల తడకేనని లాలు అన్నారు. అది శ్వేతపత్రంకాదు, శ్యామపత్రమని పార్లమెంటులోనే వ్యాఖ్యానించారు.

లాలు లెక్కల వెనుక కథేంటి?
తన ఐదేళ్ల హయాం(2004-09)లో రైల్వేకు రూ.88,669 కోట్ల మిగులు ఉన్నట్లు రైల్వే మంత్రిగా లాలు లెక్కలు చెప్పారు. ఈ లెక్కల వెనుక ఓ మతలబు ఉందని డిసెంబరు 18న శ్వేతపత్రం విడుదల సందర్భంగా మమత వ్యాఖ్యానించారు. డివిడెండ్లు చెల్లించడానికి ముందున్న నగదు మిగులు, పెట్టుబడికి వినియోగించే మిగులు, 6వ వేతన సంఘం బకాయిల పద్దుల్లోని సర్దుబాటు మొత్తాలు వెరసి రైల్వే ఆదాయాన్ని పెంచాయని వెల్లడించారు. ''డివిడెండ్ల చెల్లింపునకు ముందున్న నగదు నిల్వ, పెట్టుబడికి వినియోగించే మిగులు, తరుగుదల రిజర్వు నిధిని తీసివేస్తే.. లాలు చెప్పిన రూ.88,669 కోట్లు కాస్త రూ.39,411 కోట్లే అవుతుంది. పెట్టుబడి మిగులు రూ.66,804 కోట్ల నుంచి రూ.20,268 కోట్లకు తగ్గుతుంది.'' అని మమతా వెల్లడించారు.

శ్వేతపత్రం ఏమి చెబుతోంది...
*2004-05 నుంచి 2008-09 వరకు లాలు హయాంలో భారతీయ రైల్వే సాధించిన అభివృద్ధి సగటు కంటే తక్కువ.
*గత ఐదేళ్లలో రైల్వేశాఖ వద్ద రూ.89వేల కోట్ల మిగులు నిధులు ఉన్నట్లు చూపారు. నిజానికి ఇది రూ.39,411 కోట్లే.
*జీడీపీలో రైల్వే వాటా ఐదేళ్లుగా 1.18% వద్దే స్థిరంగా ఉంది.
*సరకు రవాణా ఆదాయం 14.11%, ఆహార ఉత్పత్తుల రవాణా ఆదాయం 44%, ఎరువుల రవాణా ఆదాయం 35% పెరిగింది.
*ఎగువ తరగతి, తత్కాల్‌ ఛార్జీలను స్వల్పంగా పెంచడంతో ఆదాయం 1.27% పెరిగింది.
*లాలు పరిపాలనా కాలం స్వర్ణయుగం కాదు
*రైల్వేలో స్వర్ణయుగంగా చెప్పుకొనే కాలం ఏదైనా ఉంటే... అది పీవీ నరసింహరావు హయాంలో 1991-96 మధ్య సి.కె.జాఫర్‌ షరీప్‌ రైల్వే మంత్రిగా పనిచేసిన కాలం. ఈ కాలంలో రైల్వే వ్యవస్థ గొప్ప విజయాలు సాధించింది.