Saturday, February 27, 2010

ఆశించాం... నిరాశే మిగిలింది

ఆశించాం... నిరాశే మిగిలింది
ప్ర
త్యేకంగా భారం, అదనపు ప్రోత్సహకాలు ప్రకటించనప్పటికీ.. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమను బడ్జెట్‌ కొంత మేరకు నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) పథకం ప్రకారం ఆదాయపు పన్ను చట్టంలోని 10ఎ, 10బి సెక్షన్ల కింద ఐటీ కంపెనీలకు లభిస్తున్న పన్ను రాయితీలను బడ్జెట్‌లో పొడిగిస్తారని ఆశించాం. ఇదే పరిశ్రమ ప్రధాన కోరిక. కానీ అలా జరగలేదు. ఇది 2011 మార్చితో రద్దవుతుంది. ఈ పథకం ప్రయోజనాలు లభించకపోతే ప్రత్యేక ఆర్థిక మండలాలలో కార్యకలాపాలు నిర్వహించే పెద్ద కంపెనీలు, బయట ఉండే చిన్న కంపెనీల మధ్య వ్యత్యాసం బాగా పెరుగుతుంది. అయితే.. ఎస్‌టీపీఐ పథకానికి ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కనీస ప్రత్యమ్నాయ పన్నును 18 శాతానికి పెంచడం కూడా ఐటీ కంపెనీలపై ప్రభావాన్ని చూపుతుంది.
కాగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఐటీ అమలుపై చేయనున్న వ్యయం ఐటీ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చనుంది. ప్రత్యేక గుర్తింపు కార్డుల ప్రాజెక్టుకు రూ.1900 కోట్ల కేటాయింపు, నందన్‌ నిలేకని ఆధ్వర్యంలో టెక్నాలజీ సలహా బృందం ఏర్పాటు ఐటీ పరిశ్రమకు మేలు చేసే అవకాశం ఉంది. ఐటీ పరిశ్రమపై సేవల పన్ను మదింపు నిబంధనలను సరళీకరించినందున కంపెనీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రిఫండ్‌లు త్వరగా లభిస్తాయి.
-బి.వి.ఆర్‌.మోహన్‌ రెడ్డి,
సీఎండీ ఇన్ఫోటెక్‌ ఎంటర్‌ప్రైజెస్‌