ఇదో పెద్ద కుంభకోణం
జేపీసీ దర్యాప్తు జరపాలి
పార్లమెంటులో విపక్షాల వాకౌట్
చర్యలు చేపడతాం: ప్రణబ్

ములాయంసింగ్ యాదవ్: ధరల పెరుగుదల అంశంలో శరద్ పవార్ను యూపీఏ ప్రభుత్వం బలి పశువుగా మార్చింది. ఆయన ప్రభుత్వం నుంచి తప్పుకుంటే మంచిది. సమష్టి బాధ్యతగా భావించకుండా ఆయనొక్కడిపైనే భారం మోపడం సరికాదు. యూపీఏ నుంచి పవార్, ఎన్డీఏ నుంచి శరద్ యాదవ్ బయటకు వస్తే మేమంతా కలిసి పనిచేస్తాం.
శరద్ యాదవ్: ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తున్న ధరల పెరుగుదల వంటి అంశాల్ని పట్టించుకోకుండా మీడియా క్రికెట్ను ఆకాశానికెత్తుతోంది.
లాలు ప్రసాద్: నెలలోగా ధరలను దించకుంటే ఇతర పార్టీలతో కలిసి జైల్ భరో చేపడతాం. ప్రభుత్వ గోదాములపై దాడులు చేస్తాం. ప్రభుత్వ విధాన లోపంవల్లే ధరలు భారీగా పెరిగాయి.
గురుదాస్ దాస్గుప్తా: ఆశ్చర్యకరంగా సామాన్యుడికి అవసరమైన నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే విలాసవంతమైన ఆధునిక సెల్ఫోన్లు, కార్ల ధరలు, రైళ్లలో ఏసీ ఛార్జీలు తగ్గుతున్నాయి. యూపీఏ హయాంలో 300 శాతందాకా ధరలు పెరిగాయి.
15శాతం పప్పుల దిగుబడి తగ్గింది... ప్రణబ్: పప్పు ధాన్యాల దిగుబడిలో 15శాతం లోటు ఉందని ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ధరల అంశంపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన వివరణ ఇచ్చారు. కనీస మద్దతు ధరలను పెంచడంతో ధరలు పెరిగాయన్న వాదనను మరోసారి సమర్థించుకున్నారు. దీనికి తోడు దిగుబడిలో లోటు కూడా దెబ్బతీసిందని వెల్లడించారు. వ్యవసాయంపై తగినన్ని పెట్టుబడులు పెట్టడంలేదని ప్రణబ్ అంగీకరించారు. ఈ రంగంలో దీర్ఘకాలిక, మధ్యకాలిక ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదలను నిరోధించేందుకు ప్రభుత్వం వద్ద ఇప్పటిదాకా స్పష్టమైన విధానమేదీ లేదని, పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తామని ప్రకటించారు. టోకు, చిల్లర ధరలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదల విషయంలోనూ సరైన లెక్కలు లేవని, ప్రణాళికా సంఘం అంచనాలనే ప్రామాణికంగా తీసుకుంటున్నామన్నారు.మరోవైపు ధరలు దిగొస్తున్నాయని వ్యవసాయ మంత్రి పవార్ తెలిపారు.
![]() |
సరైన విధానం ఏది? : మైసూరా ఆహార భద్రత ఏదీ?: ఆమ్ ఆద్మీకి ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదనీ, ఇందుకోసం కేంద్రం చేపడుతున్న చర్యలు అంతంత మాత్రమేనని మైసూరా విమర్శించారు. అవసరం మేరకు నిల్వ ఉంచుకొని సరైన ధరకు విక్రయించాలన్నారు. ధరలేక రైతు, ధరాఘాతంతో సామాన్యుడు అవస్థపడుతున్నట్లు ఆయన చెప్పారు. రాజ్యసభలో... బృందా కారత్: వైఫల్యాన్ని అంగీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. చక్కెర ధరల్లో కుంభకోణం చోటుచేసుకుంది. జేపీసీ దర్యాప్తుగానీ, శ్వేతపత్రంగానీ ప్రకటించి దీనికి బాధ్యులెవరో తేల్చాలి. ఇంకా రాజ్యసభలో ధరల అంశపై సమాజ్వాదీ సభ్యుడు బ్రిజ్భూషణ్ తివారీ, బీఎస్పీ సభ్యుడు బ్రజేశ్ పాఠక్, ఏఐఏడీఎంకే సభ్యుడు మలైస్వామి, జేడీయూ సభ్యుడు శివానంద తివారీ, సీపీఐ సభ్యుడు డి.రాజా తదితరులు ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. కేశవరావు: ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం లేదనడం నిజం కాదు. రాష్ట్రపతి ప్రసంగంలోనే ఈ అంశానికి అధిక ప్రాధాన్యమిచ్చాం. ప్రభుత్వ చర్యలతో గత మూడు నెలలుగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంది. |