అనేక సంస్థల బురిడీ
కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు
2005 పారిశ్రామిక విధానంలో భారీ ఎత్తున పెట్టుబడుల సేకరణను ప్రధానాంశంగా ఎంచుకోవడంతో దేశ, విదేశీ సంస్థల నుంచి ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. వచ్చిన వారందరితో ఒప్పందాలు చేసుకుని భూ కేటాయింపులూ చేపట్టింది. రాయితీలను ప్రకటించింది. పెట్టుబడుల సమీకరణ సమయంలోనే ఆ సంస్థల బండారం బయటపడింది. భారీ పెట్టుబడులు తెస్తామన్న సంస్థలు భాగస్వాములు దొరకడం లేదని... బ్యాంకులు ముందుకు రావడం లేదని...ఆర్థికమాంద్యమని ఇప్పుడు సాకులు చెబుతున్నాయి.
ఉదంతాలెన్నో...!
* రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో ఒడిస్సీ సైన్స్ సిటీని ఏర్పాటు చేస్తామని జురాంగ్ కన్సార్టియం కంపెనీతో ప్రభుత్వం అట్టహాసంగా ఒప్పందం కుదుర్చుకుంది. భూసేకరణ చేపట్టింది. ఆకంపెనీ చేతులెత్తేయడంతో రూపాయి పెట్టుబడి రాలేదు.
* రూ. 40 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ లక్ష్యం చేపట్టిన ఫ్యాబ్సిటీలో ఇప్పటికి రూ. 500 కోట్ల పెట్టుబడితో ఒక్కపరిశ్రమే ప్రారంభమైంది.
* రాష్ట్రం నుంచి 106 సెజ్లు అనుమతులు పొందాయి. ఒక్కో సెజ్లో వేయి కోట్ల పెట్టుబడి పెట్టినా రూ. లక్ష కోట్లు సమకూరేవి. అది జరగలేదు. సెజ్ల ద్వారా ప్రభుత్వం రూ.75 వేల కోట్ల పెట్టుబడులను అంచనా వేయగా ఇప్పటికి రూ.పది వేల కోట్లే సమకూరింది.
కోరినంత గడువు:ఒప్పందాల ప్రకారం పెట్టుబడులకు ముందుకొచ్చిన కంపెనీలు ఆరు నెలల నుంచి ఏడాది లోపు వాటి ఆర్థిక సామర్థ్యం నిరూపించుకోవాల్సి ఉంది. చాలా కంపెనీలు ఇది చేయలేదు. నిబంధనల ప్రకారం ఒప్పందాన్ని పాటించని సంస్థల భూకేటాయింపులను రద్దు చేయాలి. ఆ సంస్థలకు ప్రభుత్వం ఏళ్ల తరబడి గడువు పొడగిస్తోంది. పదే పదే గడువు పొడగించినా అనేక సంస్థలలో స్పందన లేదు. దీంతో వాటికి పరిశ్రమల శాఖ నోటీసులు ఇచ్చింది. నోటీసులకు సైతం గడువును పొడిగిస్తోంది. ప్రభుత్వం గత ఆరేళ్లలో ఇప్పటి వరకు ఒక్క సంస్థ నుంచి భూములను వెనక్కి తీసుకున్న దాఖలాలు లేవు. ఫ్యాబ్సిటీలో ఒక సంస్థ నుంచి భూమి స్వాధీనానికి పూనుకోగా సదరు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ ఆగింది. నెల్లూరు జిల్లాలో కపారో సంస్థకిచ్చిన భూములను వెనక్కి తీసుకునేందుకు నిర్ణయించినా దానిపై ఉత్తర్వులకు వెనుకాడుతోంది.