గిట్టుబాటు లేకపోవడమే ప్రధాన కారణం
కొత్తగా నమోదవుతున్న ఇష్యూలకు రిటైల్ మదుపర్లు దూరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల నమోదైన కంపెనీల్లో ఎక్కువ భాగం నష్టాల్లో కదలాడుతుండడం వారిని ఆలోచింపజేస్తోంది. ఈ నెలలో స్టాక్ మార్కెట్లో అయిదు ఇష్యూలు నమోదయ్యాయి. ఇందులో 4 కంపెనీల షేర్ల ధరలు ఇష్యూ ధర కంటే దిగువనే ఉండడం గమనార్హం.ఇక ఈ వారంలో వస్తోన్న మరో ఐదు ఇష్యూలకు స్పందన ఏ మాత్రం ఉంటుందన్న సంగతి తెలియాల్సి ఉంది (ఇప్పటికే ఒక ఇష్యూకు అంతంత మాత్రం స్పందన లభిస్తోంది). స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ప్రదీప్ ఓవర్సీస్, శ్రీ గణేశ్ జువెలరీ హౌస్, ఇంట్రాసాఫ్ట్ టెక్నాలజీస్, గోయెంకా డైమండ్&జువెల్స్.. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇష్యూధర కంటే తక్కువ ధరలవద్ద ట్రేడవుతున్నాయి. ఒక్క పర్సిస్టెంట్ సిస్టమ్ మాత్రమే 29% పైగా లాభంతో ఉంది.
కారణాలేమిటి: మదుపర్లు కొత్త లిస్టింగ్ల పట్ల నిరాసక్తతను ప్రదర్శించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఎందుకంటే తాజా ఇష్యూలు పెద్దగా పనిచేయకపోవడమే కాదు.. ఇష్యూల ధరలు ఉండాల్సిన దాని కంటే అధికంగా ఉండడం(ఓవర్ప్రైసింగ్) కూడా మరో కారణమని మర్చంట్ బ్యాంకర్లు చెబుతున్నారు.
ఇటీవల వచ్చిన ఇష్యూలు అనుకూలంగా లేకపోవడానికి వాటి పారిశ్రామిక నేపథ్యం ఆకర్షణీయంగా లేకపోవడం కూడా కారణమేనని అంటున్నారు. ఇది మదుపర్లు ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించేలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. తాజా ఇష్యూల్లో శ్రీ గణేశ్ జువెలరీ, గోయెంకా డైమండ్లు ఆభరణాల రంగానికి చెందినవి. ఈ రంగం సాధారణంగానే మార్కెట్ను తక్కువగా ఆకర్షిస్తుంది. ఇక ప్రదీప్ ఓవర్సీస్ ఓ జౌళి కంపెనీ కావడం ప్రతికూల అంశంగా మారింది. ఎందుకంటే బలపడుతున్న రూపాయి సహజంగానే ఈ రంగాన్ని దెబ్బకొడుతుందన్న భావన వారిలో ఉంటుంది.ఈ రెండు రంగాల్లోని చాలా కంపెనీల షేర్లు ఇంకా చౌకగా లభిస్తుండడం కూడా నిరాసక్తతకు దారితీసింది.

