Wednesday, February 24, 2010

ఎరువుల కృత్రిమ కొరతతో రైతు బేజారు


కృత్రిమ కొరతతో రైతు బేజారు
వ్యాపారులు చెప్పిందే ధర
బస్తాకి గరిష్ఠంగా రూ.125వరకు అధికం
చేష్టలుడిగిన వ్యవసాయశాఖ
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఎరువుల మార్కెట్‌లో యూరియా మాయాజాలం మొదలైంది. మరికొద్ది రోజుల్లో చేతికందే వరి పంటకు అవసరమైన యూరియా నల్ల బజారుకు చేరింది. కొన్నిచోట్ల సరిపడ లభ్యత లేకపోగా.. మరికొన్ని చోట్ల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించారు. గిరాకీని బట్టి బస్తాకి గరిష్ఠంగా రూ.125 వరకు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి యూరియా ధర పెంచుతామన్న కేంద్రం ప్రకటనను వ్యాపారులు ఇప్పట్నుంచే అమల్లోకి తెచ్చారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఏ జిల్లాలోనూ యూరియాకి కొరత రాకూడదు. ఆచరణలో మాత్రం వరి అధికంగా సాగయ్యే ప్రతిచోటా కృత్రిమ కొరత నెలకొంది. రబీలో ఈసారి సాధారణ విస్తీర్ణానికి కాస్త ఎక్కువగా 12.43 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. పంటకు ఫిబ్రవరిలో ఎక్కువగా యూరియా వాడుతుంటారు. ఈ నెలలో రాష్ట్రానికి 1.61 లక్షల టన్నులు అవసరమని అంచనా. తాజాగా సరఫరా అయిన యూరియాతో కలిపి ఇప్పటికే 1.41 లక్షల టన్నులు జిల్లాలకు చేరింది. ఈ నెలఖారుకు మరో 30వేల టన్నులు అందుతుందని వ్యవసాయశాఖ చెబుతోంది. అంటే ఎక్కడా కొరత ఉండకూడదు. కానీ, వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.

దోచేస్తున్నారిలా..: అధికారికంగా బస్తా ధర రూ.250.80
*సాగర్‌ ఆయకట్టు పరిధిలోని ఖమ్మం జిల్లాలో కొన్నిచోట్ల రూ.375కి విక్రయిస్తున్నారు. అంటే 50శాతం అధిక ధర.
*నల్గొండజిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో రూ. 100 వరకు ఎక్కువ ధరకు కొనాల్సిన పరిస్థితి.
*ప్రకాశం జిల్లాలో రూ.100 అధిక ధరకు విక్రయిస్తున్నారు.
*కడప జిల్లాలో నాలుగు రోజుల కిందటి వరకు యూరియా నిల్వలే లేవు. తాజాగా సరుకు వచ్చినా ఎక్కువ ధర పెట్టక తప్పడం లేదు.
*వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి సొంత జిల్లా అనంతపురంలోనూ బస్తాకి రూ.30 అధిక ధర పెట్టాల్సి వస్తోంది.
*మెదక్‌ జిల్లాలో రైతులకు అవసరం లేని గుళికల మందులు కొంటేనే యూరియా అమ్ముతామని కొందరు వ్యాపారులు షరతు విధిస్తున్నారు. ఈ జిల్లాలో 2వేల టన్నుల కొరత ఉందని అంచనా.
*కరీంనగర్‌ జిల్లాలో కొరత అధికంగా ఉంది. అదనంగా మరో 9వేల టన్నులు అవసరమని అంచనా.
*తూర్పు గోదావరి జిల్లాలో రూ.70వరకు అధికం.
*గుంటూరు జిల్లాలో రూ.60 వరకు అధిక ధర ఉండగా.. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో ఏకంగా రూ.125కి పైగా ఎక్కువకు విక్రయిస్తున్నట్లు సమాచారం.

కృత్రిమ కొరత, అధిక ధరలపై వ్యవసాయ శాఖ దృష్టి సారించడం లేదు. పకడ్బందీగా తనిఖీలు చేయడం లేదు. ఈ పరిస్థితిపై 'న్యూస్‌టుడే' వ్యవసాయశాఖ కమిషనర్‌ సునీల్‌శర్మను సంప్రదించగా అధిక ధరకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పడం గమనార్హం.