జౌళికి ఉద్దీపనలు ఉండాల్సిందే ః మారన్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఉద్దీపనల పాక్షిక ఉపసంహరణ ఉండవచ్చునని అంతా భావిస్తున్న తరుణంలో, టెక్స్టైల్స్ శాఖ మంత్రి దయానిధి మారన్ మాత్రం టెక్స్టైల్స్ రంగానికి తప్పనిసరిగా ఉద్దీపనలు కొనసాగించాలని కోరారు. ఆర్థిక సంక్షోభం నుంచి ఈ పరిశ్రమ ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలిపారు. మరికొద్ది కాలం ఈ ప్యాకేజీలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పరిశ్రమ కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు. మంగళవారం నాడిక్కడ ఆయన కార్పెట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రదర్శనను ప్రారంభించారు.ఈ ఉద్దీపనల ప్యాకేజీల కింద టెక్స్టైల్ పరిశ్రమ క్యాపిటల్ గూడ్స్పై దిగుమతి సుం కాల తిరిగి చెల్లింపు, సర్వీస్ టాక్స్ రిఫండ్, క్లస్టర్ వృద్ధి లాంటి ప్రయోజనాలను పొందింది. రిజర్వు బ్యాంకు పరిధిలో, వడ్డీరేటు సబ్సిడీని కూడా ఈ పరిశ్రమ పొందగలిగింది. 2008-09లో పరిశ్రమ వృద్ధి 2 శాతం పడిపోయింది. టెక్స్టైల్ పరిశ్రమకు ఉద్దీపనలు కొనసాగే అవకాశం ఉందని మారన్ పేర్కొన్నారు. 2008 ఏప్రిల్-నవంబర్తో పోలిస్తే, 2009లో అదే కాలానికి ఎగుమతులు 15 శాతం మేర తగ్గిపోవడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. డిసెంబర్, జనవరిలో మాత్రం నెలవారీగా ఎగుమతులు 5 శాతం పెరిగాయని మారన్ అన్నారు.