Saturday, May 8, 2010

4.20 డాలర్లకు అమ్ముతాం కానీ.. కొన్నాళ్లే

17 ఏళ్ల వరకు అంటే సాధ్యం కాదు..
ఆర్‌ఐఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి.ఎం.ఎస్‌.ప్రసాద్‌
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనిల్‌ అంబానీ గ్రూపు కంపెనీ ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌కు ఇంధనాన్ని కేటాయిస్తే ఒక్కో ఎంబీటీయూకు 4.20 డాలర్ల ధరకు కేజీ-డీ6 క్షేత్రం నుంచి గ్యాస్‌ను ఆ కంపెనీకి తాము విక్రయించే అవకాశం ఉందని ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. అయితే గ్యాస్‌ సరఫరా వ్యవధి ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ కోరుతున్నట్లుగా 17 ఏళ్లు కాక చాలా తక్కువగా ఉండాలంది. గ్యాస్‌ ధరను నిర్ణయించడానికి, గ్యాస్‌ వినియోగ విధానాన్ని ఖరారు చేయడానికి ప్రభుత్వానికి ఉన్న హక్కును అంబానీ సోదరులు కుదుర్చుకున్న కుటుంబ ఒప్పందం (ఎంఓయూ) తోసిరాజనజాలదని, రెండు కంపెనీలూ ఇంధన సరఫరాపై మరోమారు సంప్రదింపులకు చొరవ తీసుకోవాలని సుప్రీం కోర్టు శుక్రవారం రూలింగ్‌ ఇచ్చిన వెంటనే ఆర్‌ఐఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి.ఎం.ఎస్‌.ప్రసాద్‌ ఒక వార్తాసంస్థ ప్రతినిధితో మాట్లాడారు. గ్యాస్‌ సరఫరా నిబంధనలు ప్రభుత్వ ధర నిర్ణయం, వినియోగ విధానం లకు లోబడి ఉండాలని ఈ సందర్భంగా ప్రసాద్‌ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే:

* (గ్యాస్‌) సరఫరా వ్యవధి కేజీ-డీ6 క్షేత్రం అభివృద్ధి కోసం ఆమోదించిన ప్రణాళికకు అనుగుణంగా ఉండాలి.
* 2006 జనవరిలో రాసుకున్న గ్యాస్‌ సరఫరా మాస్టర్‌ అగ్రిమెంట్‌ (జీఎస్‌ఎంఏ)పై ఆర్‌ఐఎల్‌ తిరిగి సంప్రదింపులకు సిద్ధం.

* గ్యాస్‌ రంగం ప్రభుత్వ నియంత్రణలో ఉన్నదని, ప్రభుత్వ విధానాల పరిధిలోనే మేం పనిచేయాల్సి ఉంటుందని ఇన్నాళ్లూ ఆర్‌ఐఎల్‌ చెప్తున్న దానిని తీర్పు పూర్తిగా ప్రమాణీకరించింది.

* మంత్రుల సాధికార బృందం (ఈజీఓఎమ్‌) నిర్ణయం, ఉత్పత్తి పంపకపు ఒప్పందం (పీఎస్‌సీ), ప్రభుత్వ విధానం.. వీటికి అనుగుణంగా ఎంఓయూపై మరోమారు చర్చలు జరిపి అవగాహనకు రావాలని కోర్టు చెప్పింది. మేం అదే చేయనున్నాం.

* కాంట్రాక్టరు మార్కెట్‌ ధరను శోధిస్తారు. దానిని మార్పులతో ఆమోదించే, లేదా తిరస్కరించే హక్కు ప్రభుత్వానిదని ఆర్‌ఐఎల్‌ అంటూ వస్తోంది. ప్రభుత్వ హక్కును మేం ఎన్నడూ కాదనలేదు.

* తీర్పు వెలువడ్డాక ముకేశ్‌ అంబానీ ఊరడిల్లారు. మనమంతా ఇక కాఠిన్యాన్ని వదలిపెడదామన్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ వాటాదారులకు విలువను మరింత పెంపొందింపచేయడం కోసం చేతిలో ఉన్న పని పైన దృష్టి సారిద్దామని మా అందరితో అన్నారు.. కాఠిన్యం అనేది ఏ పక్షానికీ మంచిది కాదు అని ఆయనతో పాటు ఆయన సతీమణి నీతా సైతం అభిలషించారు.

కేజీ డీ-6లో 62 ఎంఎస్‌సీఎండీ ఉత్పత్తి
ప్రస్తుతం కేజీ-డీ6 వద్ద నుంచి ఆర్‌ఐఎల్‌ రోజుకు 62- 63 మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తి చేస్తోంది. కేజీ-డీ6 బ్లాకులోని ధీరుభాయ్‌-1, ధీరుభాయ్‌- 3 క్షేత్రాలను 9 సంవత్సరాల పాటు ఉత్పత్తి చేయడానికి, అలాగే ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ దాని అనుబంధ సంస్థలు సహా ఇతర కస్టమర్లకు కూడా సరఫరా చేయడానికి అనుమతించారు. ఉత్తర ప్రదేశ్‌లోని దాద్రిలో ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ విద్యుత్తు కర్మాగారం మూడేళ్ల లోపు రాకపోవచ్చు. ఈ లెక్కన సరఫరాలు అయిదేళ్లకు మించి ఉండకపోవచ్చు.