సరకు రవాణా 8.19 లక్షల టన్నులే
కాకినాడ - న్యూస్టుడే

ఎగుమతి- దిగుమతులు సన్నగిల్లాయ్
ఎప్పుడూ భారీ స్థాయిలో ఆదాయాన్ని తెచ్చి పెట్టే మొక్కజొన్న ఎగుమతులు, ఎరువుల దిగుమతులు బాగా తగ్గడంతో లంగరు రేవు భారీగా నష్టపోయింది. గత ఏడాదిలో 7.48 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న మొక్కజొన్న ఎగుమతులు దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నులకు పరిమితం అయ్యాయి. అప్పట్లో 7.20 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న ఎరువుల దిగుమతులు ఈసారి కేవలం 80 వేల మెట్రిక్ టన్నుల మేరకు జరగడంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇంకో వైపు బియ్యం ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడం రేవు వాణిజ్యాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 14.46 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా జరగ్గా, దిగుమతులు 7.46 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా జరగటంతో మొత్తం మీద 21.92 లక్షల మెట్రిక్ టన్నుల కార్గోను సాధించారు. కానీ గత ఆర్థిక సంవత్సరం 2009-10లో మొత్తం ఎగుమతులు 5.29 లక్షల మెట్రిక్ టన్నులు, దిగుమతులు 2.89 లక్షల మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 8.19 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సాధించగలిగింది. అంటే కార్గో పరంగా చూస్తే.. దాదాపు 13.73 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా తక్కువ నమోదైంది. ఆదాయం పరంగా చూస్తే 2008-09లో మొత్తం మీద రూ.16.89 కోట్లు ఆదాయం రాగా, 2009-10లో రూ.11.30 కోట్లు మాత్రమే.
'ప్రభుత్వానికి నివేదిక పంపాం'
లంగరు రేవు స్థితిగతులపై ప్రభుత్వానికి తాజాగా నివేదించినట్లు రేవు ఇన్ఛార్జి 'న్యూస్టుడే'కు చెప్పారు. ప్రయివేటు పోర్టు కోటి టన్నుల కార్గో మైలురాయిని దాటి అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే, ప్రభుత్వ నిర్వహణలో ఉన్న లంగరు రేవు హీనంగా 8.19 లక్షల మెట్రిక్ టన్నుల కార్గోను మాత్రమే సాధించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లంగరు రేవును రక్షించే చర్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించకపోతే ఇకమీదట రేవు పూర్తిగా మూతపడటం ఖాయమని కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.