మూతపడుతున్న తయారీ కేంద్రాలు మగువల మనసుదోచిన వెంకటగిరి నూలు చీరలకు గడ్డుకాలం వచ్చినట్లుంది.. ముడిసరకుల ధరలు పెరగడం వల్ల రెండున్నర దశాబ్దాలుగా విరాజిల్లుతూ వస్తున్న ఈ వ్యాపారం సంక్షోభంలో చిక్కుకుంది. ఫలితంగా చీరల ప్రింటింగ్ యూనిట్లు మూతపడుతున్నాయి.
నాలుగో వంతుకు పడిపోయిన వ్యాపారం
ముడిసరకుల ధర పెరగడం వల్లే
వెంకటగిరి - న్యూస్టుడే

నాడు చౌక: హోల్సేల్ వ్యాపారులకు వెంకటగిరి ఉత్పత్తిదారుల నుంచి గతంలో ఒక్కో చీర రూ.82కే లభించేది. దీంతో వినియోగదారులకు రూ.100లోపు ధరకే వచ్చేది. అందువల్ల వేసవిలో మహిళలు ఈ కాటన్ ప్రింటింగ్ చీరలను రోజువారీ వినియోగానికి భారీగానే కొనుగోలు చేసేవారు. టై అండ్ డై, చుట్టి చంగావి రకాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ చీరలు మార్కెట్లో హాట్కేక్లుగా అమ్ముడుపోయేవి.
పెరిగిన ముడిసరకుల ధరలు: ఈ చీర తయారీకి మనరాష్ట్రంలోని వస్తువులు, తమిళనాడులోని ఈరోడ్ తదితర ప్రాంతాల మిల్లుల నుంచి తెల్లచీర తెప్పిస్తారు. ఈ చీరలకు రంగులద్ది వెంకటగిరి నుంచి మార్కెట్లోకి విడుదలచేస్తారు. ఈ తెల్లచీర ధర రూ.55గా ఉండేది. నేడు ఈ ధర రూ. 70కు చేరింది. గంజిపిండి 8 కిలోల సంచి రూ.120 నుంచి రూ.330కి పెరిగింది. ఇస్త్రీ ఛార్జీలు, కూలీలు, డైయింగ్ ఖర్చులు రెట్టింపయ్యాయి. చివరికి రంగులు, రసాయనాల ధరలు కూడా 30శాతం పెరిగాయి. దీంతో ఇప్పుడు హోల్సేల్ వ్యాపారులకే ఇక్కడి తయారీదారులు ఒక చీరను రూ. 100 వంతున అమ్మాల్సి వస్తోంది.హైదరాబాదు, ఇంకా ఇతర ప్రాంతాల్లో తయారయ్యేకాటన్ చీరలతో వెంకటగిరి ప్రింటింగ్ చీర పోటీపడలేక వెనుకబడుతోంది. హోల్సేల్ వ్యాపారుల నుంచి ఆర్డర్లు పెద్దగా రావడం లేదు. ఫలితంగా ఉత్పత్తిదారుడు ఈ చీరల తయారీని తగ్గించేశారు. వెంకటగిరిలో 40కుపైగా ఈ చీరల తయారీ యూనిట్లు ఉండగా, వారానికి 25 వేల నుంచి 30 వేల చీరలు తయారయ్యేవి. ఇప్పుడది నాలుగైదు వేలకు పడిపోయింది. ఈ పట్టణంలో మొత్తం 40 తయారీ యూనిట్లు ఉండగా అందులో ప్రస్తుతం పది మాత్రమే నడుస్తున్నాయి.
రూ.కోటి నుంచి రూ.25 లక్షలకు పతనం: సీజన్లో ఏటా మార్చి నుంచి నెలకు రూ.కోటి విలువైన వ్యాపారం జరిగే వెంకటగిరిలో నేడు రూ.25 లక్షల వ్యాపారం కూడా జరగడం లేదు. దీంతో ప్రత్యక్షంగా1,500 మంది పరోక్షంగా మరో 1,000 మంది భవిత అగమ్యగోచరంలా మారింది. మొత్తం మీద ఈ ఆరునెలల్లో కనీసం రూ.5 కోట్లకుపైగా జరగాల్సిన వ్యాపారం సంక్షోభంలో పడినట్లయింది.