రూ.15వేల కోట్ల విక్రయాలకు రంగం సిద్ధం
ప్రారంభ వేలం ధర పెంపుతో జరిగేదిదే
యువత దారి తప్పే ప్రమాదం


తాజా లైసెన్సు ఫీజుల ఫలితంగా గ్రామ గ్రామాన మద్యం దుకాణాలు వెలిసి అక్కడి యువత మద్యానికి బానిసయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.20 లక్షల వరకూ బెల్టు దుకాణాలు ఉన్నట్లు అంచనా. ఇవి మరింతగా విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇండియా ఆల్కహాల్ పాలసీ అలయెన్స్, ఆల్కహాల్ అండ్ డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఏడీఐసీ) అనే స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా ఒక సర్వే ప్రకారం మద్యపానం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. సర్వేలోని ముఖ్యాంశాలు.
* దేశవ్యాప్తంగా మద్యం ప్రియులు 12-20 శాతం మంది
* నిత్యం సేవించేవారు 6-10 శాతం
* దేశంలో సగటున ఒక పౌరుడు సేవించే మద్యం ఏడాదికి 2 లీటర్లు
* ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే కేరళ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో మద్యపానం అధికం.
* మద్యపానాన్ని మొదలుపెట్టేవారి వయస్సు గతంలో 30ఏళ్లు కాగా ఇప్పుడు 19 ఏళ్లు. కేరళలో ఇప్పుడు అది 14 ఏళ్ల వయసుకు చేరుకుంది.
* మద్యం సేవించే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.
* ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, గాయాలపాలవడం, నేరాలు, ఆత్మహత్యలు, కుటుంబ కలహాలు, గృహ హింస, విడాకులు, పనిచేసే ప్రదేశాల్లో సమస్యలు పెరుగుతున్నాయి.
* 95 శాతం మంది మహిళలు మద్యపానాన్ని వ్యతిరేకిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి 2009-10 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా రూ. 6,200 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.7,500 కోట్లు ఎక్సైజ్ ఆదాయంగా వస్తుందని అంచనా వేస్తోంది. అమ్మకం పన్ను, ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చే ఆదాయం అదనం. ఇంత ఆదాయం సమకూరాలంటే విక్రయాలు రూ. 15వేల కోట్లకు చేరుకోవాల్సి ఉంటుంది.