Saturday, May 8, 2010

చెల్లకపోతే చిక్కులే!

ఎం.వి.దుర్గాప్రసాద్‌
ప్రముఖ న్యాయవాది
రోజువారీ ఆర్థిక వ్యవహారాల్లో చెక్కుల ప్రాధాన్యం ఎంతో.. నగదుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే చెక్కులతో చిక్కులూ అంతే.. మరి ఇంతటి కీలకమైన చెక్కుల విషయంలో తాజాగా సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను సూచించింది.
ఖాళీ చెక్కులిస్తే చాలు.. ఎలాంటి హామీ లేకుండా రుణం పొందవచ్చు. చెక్కులకున్న ప్రాధాన్యం అలాంటిది మరి. చట్టం కల్పించిన అనేక హక్కుల వల్లే వీటికి ఇంతటి రుణ పరపతి. చెల్లని చెక్కు ఇస్తే శిక్షార్హమైన నేరంగా పరిగణించడం మొదలుపెట్టిన తర్వాత ఇవి ఇంకా బాగా చెలామణిలోకి వచ్చాయి. ఆర్థిక లావాదేవీలన్నింటిలో సివిల్‌ చర్యలు మానేసి, చెక్కుల ప్రాతిపదికన క్రిమినల్‌ చర్యలకు ఉత్సాహం చూపడం ప్రారంభించారు. ఫలితంగా క్రిమినల్‌ కోర్టుల్లో రద్దీ విపరీతంగా పెరిగి పోయింది. క్రిమినల్‌ చర్యలకు కోర్టు ఫీజు లేక పోవడం, వాయిదా వాయిదాకు నిందితుడు కోర్టుకు రావాల్సి ఉండటం, రాకపోతే అరెస్టు వారెంటు జారీ అవుతుందనీ, నేరం రుజువైతే జైలుకు పోవాల్సి వస్తుందనే భయం వల్ల నిందితుడు త్వరగా రాజీకి వస్తాడన్న ఆశ వ్యాపార సంస్థలు, ప్రజలు క్రిమినల్‌ కోర్టులను ఆశ్రయించడానికి కారణమవుతోంది.

ఇందుకు ఆలస్యం..
బాకీ తీర్చడం లేదన్న కారణంతో చాలామంది చెల్లని చెక్కు ఇచ్చాడంటూ కేసులు వేస్తుంటారు. అయితే, కేసుల రద్దీ వల్ల కొన్ని కోర్టుల్లో కేసును స్వీకరించే ప్రక్రియలోనే ఆలస్యం జరుగుతోంది. క్రిమినల్‌ కేసుల్లో నిందితునికి సమన్లు అందడం తప్పనిసరి. సివిల్‌ కేసుల్లో లాగా అతడు తప్పించుకుంటున్నాడన్న కారణంపై పేపర్లో ప్రత్యామ్నాయ నోటీసులు ఇచ్చి విచారణ చెయ్యడం సాధ్యం కాదు. ఎందుకంటే క్రిమినల్‌ కేసు విచారణ నిందితుడు సమక్షంలోనే జరగాలి. దీనివల్ల నిందితుడికి సమన్లు అందకపోతే, కేసు పురోగతిని నోచుకోదు. సమన్లు అందించేందుకు అధికారికంగా పెద్ద ఫీజులు కట్టక్కర్లేదు. కానీ పోలీసుల ద్వారా సమన్లు అందించాలి. కాబట్టి, పెద్ద మొత్తంలోనే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. స్పీడు పోస్టు, కొరియర్‌ ఖర్చులు అదనం. వాయిదా వాయిదాకు కేసు వేసిన ఫిర్యాదుదారు కూడా కోర్టుకు హాజరు కావాలి. లేదా అతని గైర్హాజరును కోర్టు క్షమించాలి. అందుకు అర్జీ పెట్టుకోవాలి. క్రిమినల్‌ కేసులో నిందితుడు సాక్ష్యం పెట్టుకోనక్కర్లేదు. అతడు సాక్ష్యానికి రానందుకు అతనికి వ్యతిరేకంగా పురోభావన చెయ్యడానికి వీల్లేదు. దానివల్ల కూడా కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా కోర్టులకు సందేహ నివృత్తి కానప్పుడు కేసులను కొట్టివేసే అవకాశం ఉంది. పైగా సాంకేతిక కారణాలు, క్రిమినల్‌ కేసుల్లో ఎక్కువ నష్టం కలిగిస్తాయి. ఈ కేసు పరిష్కారానికి సంవత్సరాలు పట్టేస్తే ఈ లోపల సివిల్‌ కేసు వెయ్యాలి. లేకపోతే మూడేళ్లకు సివిల్‌ చర్యలకు కాల దోషం పట్టేస్తుంది. అప్పుడు రుణదాత పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అవుతుంది.

* జైలుకైనా వెళ్లేందుకు సిద్ధపడిన వ్యక్తిని కోర్టులు ఏమీ చేయలేవు. శిక్ష పడ్డాక కూడా అప్పీలు, ఆ పైన హైకోర్టు, ఇంకా ఓపిక ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. అన్ని కోర్టుల్లోనూ ఓడిపోయిన తర్వాత డబ్బు కట్టేస్తానంటే ఏ రుణదాత అయినా సంతోషంగా రాజీ పడిపోతాడు. ఈ లోపల రుణం ఇచ్చిన వ్యక్తికి బోలెడంత ఖర్చు. ఎగ్గొట్టేవారికి వడ్డీ లెక్క పెట్టుకున్నా ఖర్చులు కలిసి వస్తాయి. ఇవీ క్రిమినల్‌ కేసుల్లో కష్టాలు.

సుప్రీం చెప్పిందిదీ..
చెక్కులకు సంబంధించి క్రిమినల్‌ కోర్టుల్లో అనేక కేసులు పేరుకుపోయాయి. వీటిల్లో రద్దీ తగ్గించాలని సుప్రీంకోర్టు కొత్త ఆలోచన చేసింది. ఈ నెల మూడో తేదీన ఓ సంచలనాత్మక తీర్పు చెప్పింది. క్రిమినల్‌ కేసుల్లో రాజీలకు సంబంధించి మార్గదర్శక సూత్రాల్ని రూపొందించింది.

అవి ఏమిటంటే..
సమన్లు అందగానే నిందితుడు నేరాన్ని అంగీకరించి రాజీ కోరితే ఎలాంటి ఖర్చులు వెయ్యరాదు. అలా అని సమన్లలో పొందుపర్చాలి. తర్వాత అంటే ఒకటి, రెండు వాయిదాల తర్వాత రాజీ కోసం అర్జీ పెట్టుకుంటే, చెక్కు సొమ్ములో పది శాతాన్ని న్యాయ సేవాధికార సంస్థకు కట్టేలా షరతు విధించాలి.

* నేరం రుజువై శిక్ష పడిన తర్వాత అప్పీలులోనో, హైకోర్టులోనే రాజీ కొస్తే చెక్కు సొమ్ములో 15 శాతాన్ని ఖర్చులు విధించాలి.

* అదే సుప్రీంకోర్టులో రాజీ కోరితే నిందితునిపై ఖర్చులు చెక్కు సొమ్ములో 20 శాతం వడ్డించాలి. ఈ ఖర్చులు కష్టపడి పోరాడిన ఫిర్యాదుదారుకు మాత్రం కాదండోయ్‌. న్యాయసేవాధిక సంస్థకు జమ చెయ్యాలి.

* ఫిర్యాదీదారు కేసు ఉపసంహరించుకుంటే సుప్రీంకోర్టు తీర్పు వర్తించదు.

వేధించే వారి మాటేమిటి?
ఈ చెక్కు కేసుల్లో చెక్కులిచ్చిన వారికే కాదు. చెక్కులపై కేసులు వేసే వారికి కూడా ముకుతాడు వేయాలని తీర్మానించింది సుప్రీంకోర్టు.

* చెక్కులిచ్చిన వారిపై వివిధ కోర్టుల్లో కేసులు వేసి వేధించే వారిపై కూడా ఖర్చులు వేయాలంది. ఎలాగంటే, ఇక నుంచి దాఖలు చేసే ఫిర్యాదుల్లో తప్పనిసరిగా ఈ లావాదేవీ గురించి మరెక్కడా, మరే ఫిర్యాదు దాఖలు చెయ్యలేదని విధిగా ప్రకటించాలి. ఈ ప్రకటన ప్రమాణ పూర్వకంగా పత్రాన్ని దాఖలు చేసి మరీ చెప్పాలి. పలు కేసులున్నాయని రుజువైతే, కేసులన్నింటినీ మొదటి కేసున్న కోర్టుకే బదిలీ చేయాలి. అంతేకాదు.. ఫిర్యాదుదారుపై భారీగా ఖర్చులు వడ్డించాలి.

కష్టాలొచ్చాయా?
న్యాయస్థానాల్లో క్రిమినల్‌ కేసు (చెక్కుకేసు)లు పేరుకుపోయిన మాట వాస్తవం. కానీ దానికి ఫిర్యాదుదార్లు నిందితులు మాత్రమే బాధ్యులని చెప్పలేం. చెక్కు చెల్లకపోవటం నేరంగా మారిన ఈ ఇరవై ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ కొన్ని వందల రెట్లు పెరిగింది. అలాగే లావాదేవీలు కూడా పెరిగాయి. నిజానికి ఆర్థిక పురోగతికి చెక్కుల చట్టం కూడా ఒక కారణం. అయితే, సుప్రీంకోర్టు మార్గదర్శకాల వల్ల కక్షిదార్లకు కొత్త కష్టాలే వచ్చాయని చెప్పవచ్చు. నేర స్మృతిలో కానీ, చెక్కుల చట్టంలోకానీ జరిమానా కాక ఖర్చులు విధించే ఏర్పాటు లేదు. జరిమానాలో నుంచే ఖర్చులు, పరిహారం ఫిర్యాదీకి ఇప్పించే అవకాశం ఉంది. చట్టం చెప్పిన జరిమానా కాకుండా ఈ ఖర్చులు అదనమా అన్నది తీర్పులో స్పష్టంగా లేదు. జరిమానా సొమ్మును ఎలా వినియోగించాలనే విషయంలో నేరస్మృతిలో స్పష్టంగా వివరించారు. అన్నింటికీ మించి వివిధ కోర్టుల్లో కేసులు వేస్తే ఖర్చులు వేసి వాటిని బదిలీ చేయాలన్న సూత్రం కొత్త చిక్కుల్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఇక నుంచి ప్రతి నిందితుడు సంబంధం లేని కేసులన్నీ ఒకే లావాదేవీకి సంబంధించినవని కొత్త వాదన చేయవచ్చు. బదిలీ కోరవచ్చు. అసలు వివాదం పక్కకు పోయి కొత్త వాదనలతో హైకోర్టులో కేసులు పేరుకుపోవచ్చు.