Thursday, May 13, 2010

బాబోయ్‌... బంగారం

పదిగ్రాములు రూ.18,255
ఇదే ఆల్‌టైమ్‌ గరిష్ఠం
రూ.30,000 దాటిన కిలో వెండి
ముంబయి: అంచనాలకు అనుగుణంగానే పసిడి ధరలు దూసుకెళుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో రికార్డు స్థాయికి చేరడంతో బుధవారం స్థానిక మార్కెట్లోనూ బంగారం ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరాయి. మరో వైపు పారిశ్రామిక అవసరాల కోసం విపరీతమైన గిరాకీ రావడంతో కిలో వెండి ధర రూ.30,000 దాటింది.

పదిగ్రాముల ఆభరణాల బంగారం(99.5 స్వచ్ఛత) రూ.285 పెరిగి ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి రూ.18,255కు చేరింది. డిసెంబరు 2, 2009లో ఇది రూ.18,225 వద్ద స్థిరపడగా.. ఆ తర్వాతి రోజు ఒక దశలో రూ.18,255నూ తాకిన సంగతి తెలిసిందే. ఇక 10 గ్రా. స్వచ్ఛమైన బంగారం(99.9) సైతం రూ.280 పెరిగి కొత్త గరిష్ఠ స్థాయి రూ.18,340గా పలికింది. ఇది గతేడాది డిసెంబరు 3న రూ.18,310గా పలికింది. ఒక దశలో రూ.18,340కూ చేరింది.

కిలో వెండి ధర రూ.790 ఎగసి రూ.30,000పైన రూ.30,065గా పలికింది. దీని ధర కూడా గతేడాది డిసెంబరు 3న రూ.30,085 వద్ద స్థిరపడడం గమనార్హం.

మలబార్‌ గోల్డ్‌ అక్షయ తృతీయ ఆఫర్‌
హైదరాబాద్‌: అక్షయ తృతీయ(16న) రోజున తమ షోరూమ్‌లో 20 గ్రా. పైగా బంగారు ఆభరాణాలు కొన్నవారికి ఒక బంగారం నాణెం ఉచితంగా ఇవ్వనున్నట్లు మలబార్‌ గోల్డ్‌ చెబుతోంది. నగరంలోని సోమాజిగూడ వద్దగల తమ షోరూమ్‌కు ఆ ప్రత్యేకమైన రోజు వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతోంది. డివైన్‌ హెరిటేజ్‌ జువెలరీ, మైన్‌ డైమండ్‌ అన్‌లిమిటెడ్‌లతో కలిసి బంగారు ఆభరణాలు, వజ్రాలను ఇక్కడ ప్రదర్శిస్తోంది. రూ.2500 నుంచి ధరలు మొదలవుతాయని.. తేలికపాటి బరువుండే నెక్లెస్‌ సెట్‌(చెవిదిద్దులు సహా) రూ.74,800కు మైన్‌ కలెక్షన్స్‌లో లభ్యమవుతుందని మలబార్‌ గోల్డ్‌ బుధవారమిక్కడ ఒక ప్రకటనలో పేర్కొంది.