Tuesday, May 11, 2010

రూ.45 లక్షల కోట్లతో సంక్షోభ నిధి
గ్రీస్‌, ఇతర దేశాల చేయూతకు ప్రణాళిక
ఈయూ, ఐఎంఎఫ్‌ల తాజా చొరవ
వూరడిల్లిన అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లు
బంగారం ధరల్లో క్షీణత
బెర్లిన్‌: తీవ్రమైన అప్పుల భారంలో కూరుకుపోయి దివాలా ముంగిట నిలచిన గ్రీస్‌, మరికొన్ని దేశాలను గట్టెక్కించటానికి, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఉమ్మడి కరెన్సీ అయిన యూరో విలువ మరింతగా పతనం కాకుండా కాపాడటానికి 750 బిలియన్‌ యూరోల (ఒక లక్ష కోట్ల డాలర్ల)తో ''అత్యవసర సంక్షోభ సహాయ నిధి''ని సృష్టించనున్నారు. (లక్ష కోట్ల డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ.45లక్షల కోట్లకు సమానం.) రెండేళ్ల కిందట లేమాన్‌ బ్రదర్స్‌ పతనం దరిమిలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవకుండా చూడటానికి గ్రూప్‌ ఆఫ్‌ ట్వంటీ దేశాధినేతలు ప్రకటించిన ఆర్థిక సహాయ పథకం కన్నా ఇది మరెంతో భారీ ప్యాకేజి కావడం విశేషం. అంతే కాదు, 16 దేశాలకు సభ్యత్వం ఉన్న యూరో జోన్‌ ఇదివరకటి సహాయ పథకం కన్నా పెద్దదే. 27 దేశాల కూటమి అయిన యూరో కేంద్ర కార్యాలయం ఉన్న బ్రస్సెల్స్‌లో ఈయూ ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల అధిపతులు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అధికారులు ఆదివారం రాత్రి సమావేశమై 12 గంటల సేపు చర్చలు జరిపారు. ఈ మేరకు ఈయూ, ఐఎంఎఫ్‌లు ఒక అంగీకారానికి వచ్చాయి. సోమవారం ఫైనాన్షియల్‌ మార్కెట్లలో స్పెక్యులేటర్లు వారి కార్యకలాపాలను ప్రారంభించే కన్నా ముందే ఈ సంక్షోభ నిధి విషయం వెల్లడి అయింది. ప్యాకేజి రాశి విశ్లేషకులను ఆశ్చర్యచకితుల్ని చేసింది. యూరో సుమారు 2 శాతం బలపడింది. ఆసియా వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు లాభాల బాటలో దూసుకుపోయాయి. బంగారం ధరలు గత వారం రికార్డు స్థాయిలో ఎగసినా, తాజాగా ఒకటిన్నర శాతం క్షీణించాయి.

అన్ని వైపుల నుంచి మద్దతు: యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) స్థిరీకరణ ప్రయత్నాల్లో తాను కూడా పాలుపంచుకొని ప్రభుత్వ, ప్రయివేటు బాండ్‌ మార్కెట్లలో కొనుగోళ్లు జరిపేటందుకు చొరవ తీసుకోనున్నట్లు ప్రకటించింది. అటు యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ అనేక కేంద్ర బ్యాంకులకు కరెన్సీ మార్పిడికి తలుపులు తెరిచింది. డాలర్ల లభ్యతపై మార్కెట్లకు భరోసా కల్పించడానికే యూఎస్‌ ఫెడ్‌ ఇలా చేసింది. సంపన్న దేశాల కూటమి గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌, గ్రూప్‌ ఆఫ్‌ ట్వంటీలు ఈయూ సహాయక చర్యల పథకాన్ని స్వాగతించి, అండగా ఉంటామని ప్రకటనలు చేశాయి.

గత వారం కుదేలైన స్టాక్‌ మార్కెట్లు
గ్రీస్‌ తీవ్రమైన అప్పుల సంక్షోభంలో పడిపోవడంతో గత కొద్ది వారాలుగా అమెరికా డాలర్‌తో పోలిస్తే యూరో భారీ ఒడిదొడుకులకు గురి అయింది. పోర్చుగల్‌, స్పెయిన్‌, ఐర్లండ్‌ల వంటి దేశాలు క్రమంగా చేతులు ఎత్తేసి మరో ప్రపంచ ఆర్థిక విలయం తలెత్తవచ్చన్న ఆందోళనలతో అనేక ఫైనాన్షియల్‌ మార్కెట్లు కుదుపులకు లోనైన సంగతి తెలిసిందే. తాజాగా గత గురువారం అమెరికా మార్కెట్‌ తీవ్ర కనిష్ఠాలను చవిచూసింది. కాగా ఇదివరకే ఈయూ, ఐఎంఎఫ్‌లు గ్రీస్‌కు 100 బిలియన్‌ యూరోల ప్యాకేజిని ప్రకటించాయి. (ఐఎంఎఫ్‌ తన వంతుగా 30 బిలియన్‌ యూరోలు అందిస్తానంది.) ఈ సహాయాన్ని అందుకోవడానికి గ్రీస్‌ ప్రభుత్వం తన వంతుగా పలు మిత వ్యయ చర్యలను అమలు చేస్తానని హామీ ఇచ్చింది.

సహాయం ఎలా అందిస్తారంటే..
* ఈయూ 60 బిలియన్‌ యూరోలు, యూరో జోన్‌ 440 బి. యూరోలు, ఐఎంఎఫ్‌ 250 బి. యూరోలు సమకూరుస్తాయి.
* ఈయూలోని మొత్తం 16 సభ్యత్వ దేశాలకు ఈ రక్షణ నిధి నుంచి సహాయం పొందడానికి అర్హత ఉంటుంది.
* పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ లోన్‌లను మంజూరు చేస్తారు.
* కొత్త రుణాలకు ప్రభుత్వాలు పూచీ పడతాయి.
* ఈయూలోని ప్రభుత్వాలు ద్వైపాక్షిక పూచీలను ఇచ్చి పుచ్చుకొంటాయి.
ఎవరేమన్నారంటే
'' ఒక్కో దేశం అవసరాలను బట్టి ఐఎంఎఫ్‌ సాయం ఉంటుంది.''
- డామినిక్‌ స్ట్రాస్‌ కాన్‌, ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌
'ఇది రుగ్మతలను నివారించగలుగుతుందే తప్ప వ్యాధిని కాదు'.
- కొంత మంది ఆర్థికవేత్తల వ్యాఖ్య.
'ఐరోపా పరిణామాల్ని మేం నిశితంగా గమనిస్తున్నాం. మన దేశంలో ఇంతవరకైతే ఎలాంటి ప్రతికూల ప్రభావమూ లేదు.. కానీ, పరిస్థితులను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాం.'
- ఆనంద్‌ శర్మ, భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి