Thursday, May 13, 2010

హమ్మయ్య... ఉద్యోగాలు

జోరందుకున్న నియామకాలు
ఐటీ, బీమా రంగాల్లో ఎక్కువ
న్యూఢిల్లీ: ఏప్రిల్‌లో దేశీయంగా ఉద్యోగ నియామకపు ప్రక్రియ రికార్డు స్థాయికి చేరినట్లు నౌకరీ డాట్‌ కామ్‌ వెల్లడించింది. ఐటీ, బీమా, బ్యాంకింగ్‌ రంగాల్లో నియామకాలు జోరందుకోవడమే ఇందుకు ముఖ్యకారణమని సంస్థ విశ్లేషించింది. గత నెలలో నౌకరీ డాట్‌ కామ్‌ సంస్థ నియామకపు సూచీ 6 శాతం పైకెగసి 1,019కు చేరినట్లు సంస్థ తెలిపింది. 2008 తరువాత ఉద్యోగ నియామకపు సూచీ ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. మార్చిలో నియామకపు సూచీ 962 వద్దనే నిలిచింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఉద్యోగ నియమకాలు ఆశావహంగానే మొదలయ్యాయని, కొత్తవారిని కొలువుల్లోకి తీసుకొనే ప్రక్రియ దేశంలోని అన్ని పరిశ్రమలు, నగరాల్లోనూ తిరిగి జోరందుకున్నట్లు ఇన్ఫోఎడ్జ్‌ మార్కెటింగ్‌, కమ్యూనికేషన్స్‌ జాతీయ విభాగం అధినేత సుమీత్‌ సింగ్‌ తెలిపారు.
* గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే పోయిన నెలలో ఐటీ రంగంలో ఉద్యోగ నియామకపు ప్రక్రియ 48 శాతం వృద్ధి చెందింది.
* మార్చితో పోలిస్తే ఐటీ, బీమా రంగాల నియామకాల్లోగరిష్ఠస్థాయి వృద్ధి కనిపించింది.
* ఈ రంగాల ఉద్యోగ సూచీలు వరుసగా 16%, 11% ఎగిశాయి.
* ఇదే కాలంలో బెంగళూరు, హైదరాబాద్‌, పుణెలలో నియామక ప్రక్రియ వరుసగా 18%, 17%, 10% మేర పెరిగాయి.
* విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఇంకా పెద్దగా పుంజుకోకపోవడంతో చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు భారత్‌కు తిరిగి రావాలని చూస్తున్నట్లు సంస్థ తెలిపింది.

అయిదో నెలలోనూ ఆన్‌లైన్‌ నియామకాలు ముందుకే
వ్యాపారాభివృద్ధిపై నమ్మకం పెరుగుతుండడంతో భారత్‌లో కార్పొరేట్‌ సంస్థల ఆన్‌లైన్‌ ఉద్యోగ నియామకాలు జోరందుకున్నట్లు మాన్‌స్టర్‌ ఇండియా సంస్థ తెలిపింది. ఆన్‌లైన్‌ ఉద్యోగ నియామకాలు వరుసగా అయిదో నెల కూడా వృద్ధి పథంలోనే ముందుకు సాగినట్లుగా ఈ నియామక సేవల సంస్థ ఒక విశ్లేషణలో వివరించింది. ఏప్రిల్‌లో సంస్థ ఉద్యోగ నియామక సూచీ 7 శాతం పెరిగి 125కి చేరింది, మార్చిలో ఇది 117గా ఉంది. ఆన్‌లైన్‌ జాబ్‌సైట్‌లలోని ఎక్కువగా ఎంపికచేసిన ఉద్యోగ సంస్థలు వెలువరించిన ఉద్యోగ అవకాశాలను సమగ్రంగా విశ్లేషించి మాన్‌స్టర్‌ ఈ సూచీని గణిస్తుంది.