తొలి ముసాయిదా ప్రకారం..: డీటీసీపై తొలి చర్చాపత్రాన్ని ఆర్థికశాఖ గత ఏడాది ప్రజల ముందుకు తెచ్చింది. ఈ ప్రకారం వార్షికాదాయం రూ.25 లక్షలు దాటితేనే 30% పన్ను విధిస్తారు. ప్రస్తుతం ఈ శ్లాబ్ రూ.8 లక్షల పైనే ఉంది. మిగతా శ్లాబ్ల్లోనూ ఇటువంటి మార్పులే ఉన్నాయి. దీంతోపాటు దీర్ఘకాల పొదుపు పథకాల నుంచి సొమ్ము వాపసు తీసుకునేప్పుడు పన్ను విధించాలని, కంపెనీల ఆస్తులపై కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) విధించాలనే ప్రతిపాదనలు ఈ ముసాయిదాలో ఉన్నాయి. వీటిపై ప్రజలు, పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర స్పందన వచ్చింది.
పారదర్శక విధానాల కోసం..: పారదర్శక పద్ధతులను తెలపాలంటూ 65 దేశాలకు ప్రభుత్వం లేఖలు రాసింది. చర్చలు, పన్ను సమాచార మార్పిడి ఒప్పందం కోసం పన్ను లేని, తక్కువగా ఉన్న 20 దేశాలను గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది. స్విస్ బ్యాంకు ఖాతాల్లో భారతీయులకు చెందిన వేల కోట్ల రూపాయలున్నాయని గత ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఆరోపణలు గుప్పించడంతో పారదర్శకత అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
జులై 24న ఆదాయపు పన్ను దినోత్సవం: తొలి ఆదాయపు పన్ను చట్టం 1860, రూపొందించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జులై 24న 'ఇన్కంట్యాక్స్ డే'గా ఆదాయపుపన్ను శాఖ ఉత్సవాలు జరపనుంది. ప్రథమ ఆర్థిక శాఖ సభ్యుడైన జేమ్స్ విల్సన్ 1860లో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను చట్టాన్ని, అదే ఏడాది జులై 24న నాటి గవర్నర్ జనరల్ ఆమోదించడంతో వెంటనే అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం (1961) స్థానంలో వచ్చే ఏడాది ప్రత్యక్ష పన్నుల చట్టం ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా శాఖ తరఫున పలు కార్యక్రమాలు ప్రారంభించి, పూర్తిచేస్తామని సీబీడీడీ సభ్యుడు (రెవెన్యూ) దుర్గేశ్ శంకర్ పీటీఐతో చెప్పారు. పన్ను చెల్లింపు, రిఫండ్కు సంబంధించి ఈ ఏడాదే కొన్ని సేవలు ప్రవేశ పెట్టాలని ఆదాయపు పన్ను శాఖ ప్రణాళికలు రూపొందించింది. టీడీఎస్ డైరెక్టరేట్ను ప్రారంభించడంతో పాటు పన్ను చెల్లింపులు, రిఫండ్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రత్యక్ష పన్నుల్లో టీడీఎస్ వాటా 40% ఉందని దుర్గేశ్ తెలిపారు.