సునీల్ మిట్టల్తో సమావేశం
న్యూఢిల్లీ: తనకు ఎంతో ఇష్టమైన టెలికాం రంగంలోకి ప్రవేశించేందుకు ముకేశ్ అంబానీ రంగం సిద్ధం చేసుకుంటున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూపు (అడాగ్)లు తమ మధ్య ఇదివరకటి పోటీ రహిత ఒప్పందాన్ని (నాన్-కంపీట్ అగ్రిమెంట్) రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన రోజుల వ్యవధిలోనే, టెలికాం రంగంలో సౌహార్దపూర్వక పోటీకి తెర లేవనున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయంపైనే భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్తో ముకేశ్ అంబానీ సమావేశమయ్యారని సమాచారం. ఈనెల 26న ప్రధాని నేతృత్వంలో జరిగిన వాణిజ్య, పారిశ్రామిక మండలి సమావేశంలో పాల్గొనేందుకు ముకేశ్ ఢిల్లీ వచ్చినపుడు ఈ సమావేశం చోటు చేసుకొందని విశ్వసనీయ సమాచారం. ఇందులో సీఐఐ అధ్యక్షుడు హరి ఎస్. భర్తియా కూడా పాల్గొన్నారని తెలిసింది. అయితే ఆర్ఐఎల్ అధికార ప్రతినిధి మాత్రం సమావేశం జరిగిందో లేదో వెల్లడించేందుకు నిరాకరించారు. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యం అవిభక్తంగా ఉన్నపుడు, రిలయన్స్ ఇన్ఫోకామ్ పేరిట టెలికాం వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ముకేశ్ ఏర్పాట్లు చేశారు. అన్నదమ్ములు విడిపోయినప్పుడు, టెలికాం వ్యాపారం సోదరుడు అనిల్ అంబానీకి వెళ్లింది. ఆయన ప్రస్తుతం రిలయన్స్ కమ్యూనికేషన్స్ను నిర్వహిస్తున్న సంగతి విదితమే.
కొన్ని సంస్థలతో చర్చలు..: దేశంలో ఇప్పటికే టెలికాం సేవలను అందిస్తున్న సంస్థలో ముకేశ్ వాటా తీసుకుంటారని భావిస్తున్నారు. 2008లో లైసెన్సు పొందిన సంస్థనే ఎంచుకుంటారని చెబుతున్నారు. ఆ ఏడాది కొత్తగా లైసెన్సు పొందిన సంస్థలతో ఆయన చర్చలు జరిపారని సమాచారం. ఇప్పటికే దేశ వ్యాప్త సేవలందించేందుకు లైసెన్సు పొందిన వీడియోకాన్, సేవల విస్తరణకు పెట్టుబడి పెట్టగల భాగస్వామి కోసం ఎదురు చూస్తోందని తెలిసింది.
ఈనెల 23న వెలువడిన ప్రకటన ప్రకారం అనిల్ నేతృత్వంలోని అడాగ్ గ్రూప్ చమురు, గ్యాస్, రిటైల్, పెట్రోరసాయనాల వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి వీలు ఏర్పడనుంది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) టెలికం, విద్యుత్తు, ఫైనాన్షియల్ రంగాలలోకి ప్రవేశించగలుగుతుంది. సౌహార్దపూర్వక చొరవలో భాగంగా 2022 వరకు తమ సంస్థ (రిలయన్స్)కే చెందిన కేప్టివ్ గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్లాంట్ల వ్యాపారం మినహా గ్యాస్ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టబోనని ఆర్ఐఎల్ ప్రకటించింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు కేజీ బేసిన్ గ్యాస్ విక్రయానికి సంబంధించి ఆరు వారాలలోగా సంప్రదింపులు ప్రారంభిస్తామని కూడా ఇరు సంస్థలూ వెల్లడించాయి.
గుజరాత్లోని బ్లాకులో మరోచోట చమురు లభ్యం
గుజరాత్, కాంబే బేసిన్లోని సీబీ-ఓఎన్ఎన్-2003/1 బ్లాకులో మరో చోట చమురు లభ్యమయ్యిందని ఆర్ఐఎల్ వెల్లడించింది. ఈ బ్లాకులోనే ఇది అయిదోది. ఇక్కడ నుంచి రోజుకు 255 బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేయవచ్చని సంస్థ తెలిపింది. దీనిని 'ధీరుభాయ్ 48'గా వ్యవహరిస్తున్నారు.