నిజానికి 2011కల్లా ఈ కారు భారత్లో విడుదల కావాలి. కానీ కారు ధర, డిజైన్లపై భాగస్వామ్య కంపెనీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. కారు ధర 2,500 డాలర్లు (రూ.1,15,000) ఉండాలని రెనాల్ట్ కోరుకుంది. 2008 మే నెలలో కుదిరిన ఎంఓయూ ప్రకారం యూఎల్సీ సంయుక్త సంస్థలో బజాజ్ 50 శాతం వాటా, రెనాల్ట్, నిస్సాన్లు చెరి 25 శాతం వాటా కలిగి ఉంటాయి. మహారాష్ట్రలోని చకాన్లో సరికొత్తగా నిర్మించే కర్మాగారంలో యూఎల్సీని తయారు చేసి ఏడాదికి 4 లక్షల యూనిట్లను మార్కెట్లోకి తెస్తామని ఈ కంపెనీలు ప్రకటించాయి. ఈ నెల మొదట్లో జెనీవా మోటార్ షో సందర్భంగా నిస్సాన్ మోటర్ కో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కాలిన్ డాడ్జ్ మాట్లాడుతూ, భారత మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని తయారు చేయాలనుకొన్న యూఎల్సీకి ఇంజినీరింగ్ నమూనాను తమ భాగస్వామ్య కంపెనీల్లో ఏదీ కూడా ఇంకా కనుగొనలేదన్నారు.
గత రెండేళ్ల నుంచి యూఎల్సీని తయారుచేసేందుకు బజాజ్ ప్రయత్నాలు చేస్తోందని, దాని రూపకల్పన అంత సులువేం కాదని తొకుయమ చెప్పారు. ఇందుకోసం ఎన్నో రకాల ఇంజినీరింగ్ సేవలు అవసరమవుతాయని వివరించారు. కాగా భారతదేశంలో నిస్సాన్ పదో డీలర్షిప్ను శుక్రవారం ప్రారంభించింది. 2013 నాటికి వీటి సంఖ్యను 82కు పెంచుకొని, ప్రతి ఏటా లక్ష కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.