దేశంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు నానాటికీ తమ పరిధి పెంచుకుంటున్నాయి. అంతేకాదు.. కొత్త సంస్థలూ అరంగేట్రం చేస్తున్నాయి. ప్రస్తుతం 41 సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తూండగా.. మరో 23 సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రస్తుత 41 సంస్థల మొత్తం ఆస్తులు రూ.8,00,000 కోట్ల వరకు ఉండటం గమనార్హం. 22 ఏళ్ల క్రితం వీటి ఆస్తుల విలువ రూ.6,700 కోట్లే. దాంతో పోలిస్తే ఇప్పటి ఆస్తుల విలువ ఏకంగా 116 రెట్లు పెరిగింది. గత రెండు మూడేళ్లలో ఈ పరిశ్రమ మరింతగా విస్తరిస్తోంది. కొత్తగా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్న కంపెనీలు విదేశీ భాగస్వామ్యంతో, వినూత్న వ్యూహాలతో వస్తున్నాయి. పెట్టుబడులపై అత్యధిక రాబడి హామీలు గుప్పిస్తూ.. మదుపర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయి.మన మార్కెట్లపై విదేశీ మదుపర్లకు పట్టు ఎక్కువే. వాళ్లు కొంటే మార్కెట్లు దూసుకుపోతాయి. వాళ్లు అమ్మేస్తే కుప్పకూలిపోతాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో మదుపర్లకు నష్టభయాన్ని తగ్గించేవి కచ్చితంగా మ్యూచువల్ ఫండ్లే.
రూ.8,00,000 కోట్లకు ఆస్తులు
రంగంలో 41 సంస్థలు.. సిద్ధంగా మరో 23
ఓ పెద్ద మార్పు...: ఫండ్ల పరిశ్రమ గత రెండు మూడేళ్ల నుంచి ఫర్వాలేదనిపిస్తున్నా.. ఈ రంగానికి అసలు మేలుమలుపు మాత్రం గత ఆగస్టులోనే వచ్చిందని చెప్పొచ్చు. అదీ ప్రవేశ రుసుము తొలగింపుతో. అంతక్రితం ప్రవేశ రుసుము ఫండ్ పరిశ్రమకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే అంశం. సాధారణంగా ఇది 2-3 శాతంగా ఉంటుంది. ఈ ఆదాయాన్ని ఏఎమ్సీలు తమ పంపిణీదార్ల(డిస్ట్రిబ్యూటర్లు)తో పంచుకుంటూ ఉండేవాళ్లు. ఆర్థిక రికవరీ మొదలైందన్న సంకేతాలు.. స్టాక్ మార్కెట్లు మళ్లీ గాడిలో పడటంతో ఆయా రంగాల్లోని అగ్రశ్రేణి సంస్థలు మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలోకి భారీ నిధులతో తరలిరావడం మొదలెట్టాయి. అంతక్రితం ప్రోత్సాహకాలు(ప్రవేశ రుసుము) పోవడంతో వెనుకంజ వేసిన పంపిణీదార్లు ప్రస్తుత నేపథ్యంలో తిరిగి ఫండ్ వ్యాపారంలోకి అడుగుపెడుతుండడం శుభసూచకమేనని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. (ఆ సమయంలో దాదాపు డిస్ట్రిబ్యూటర్లందరూ కొంత మంది వినియోగదార్లకు ఫండ్లకు మారుగా యులిప్లను ఇవ్వజూపారు కూడా)
|
|
* వృత్తి నిబద్ధత, బహుముఖ పెట్టుబడి, సానుకూల పాలన, తిరిగి చెల్లించే శక్తి, తక్కువ ఖర్చులు, ద్రవ్యత్వం, పారదర్శకత, సరళత, పథకాలను ఎంచుకునే అవకాశం, పన్ను రాయితీలు, చక్కని నియంత్రణ కలిగి ఉండటం వల్ల సామాన్యులను మ్యూచువల్ ఫండ్లు ఆకర్షిస్తున్నాయి. |
![]() |
ఓపెన్ ఎండెడ్: ఈ పథకంలో వాటాలను (యూనిట్లు) ఎప్పుడైనా కంపెనీ నుంచే నేరుగా కొనుగోలు/అమ్మకం చేయవచ్చు. క్లోజ్డ్ ఎండెడ్: నియమిత కాలంలో, వాటాలను పరిమితంగా విక్రయిస్తారు. అనంతరం మదుపుదార్లు లేదా బ్రోకరేజీ సంస్థల వద్దే కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇంటర్వెల్ పథకాలు: ఓపెన్ ఎండెడ్, క్లోజ్డ్ ఎండెడ్ పథకాల లక్షణాలను మిళితం చేసినవి. వాటాల విక్రయం, తిరిగి కొనుగోళ్లకు పరిమిత కాలంలో అనుమతిస్తారు. గ్రోత్ స్కీమ్: భారీ మూలధన లాభాలను ఆర్జించే సామర్థ్యమున్న కంపెనీల వాటాలను కొనుగోలు చేస్తారు. ఇన్కమ్ స్కీమ్: సంప్రదాయంగా డివిడెండ్లను అందించే కంపెనీల వాటాల కొనుగోలుకు పెట్టుబడులు పెడతారు. బాలన్స్డ్ స్కీమ్స్: పెట్టుబడులకు ప్రమాదం ఏర్పడకుండా చూసేందుకు విభిన్న కంపెనీల వాటాలు, బాండ్లు, విభాగాలు, దేశాల్లో కూడా పెట్టుబడులకు ఉపక్రమించేవి. మనీ మార్కెట్ స్కీమ్స్: మ్యూచువల్ ఫండ్ ఆస్తుల్లో 26% అమెరికాలో ఉంటాయి. తక్కువ రాబడి/నష్ట ప్రమాదాన్ని ఇచ్చే పథకాలివి. ఏ సమయంలో అయినా కొనుగోలు/అమ్మకం చేయవచ్చు. ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్: ఆదాయపన్ను చట్టంలోని 80సి నిబంధన ప్రకారం పెట్టుబడులపై పన్ను రాయితీ లభిస్తుంది. వేర్వేరు విభాగాలు, పరిశ్రమల్లో పెట్టుబడులు పెడతారు కనుక, కాలపరిమితితోనే నగదుగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇండెక్స్ స్కీమ్స్: నిర్దేశిత మార్కెట్ సూచీల కదలికలకు అనుగుణంగా రాబడినిచ్చేవి. |