Wednesday, March 24, 2010

జాప్యం ఖరీదు..!

మౌలిక రంగం ఖర్చులు తడిసిమోపెడు
ఉసూరుమంటున్న 850 ప్రాజెక్టులు
దేశ ఆర్థికాభివృద్ధిలోనైనా మౌలిక రంగానిదే ప్రధాన పాత్ర. మన దేశమూ ఇందుకు మినహాయింపు కాదు. ఏటా బడ్జెట్లో మౌలిక రంగానికి పెంచుతున్న కేటాయింపులు చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది.

విషాదమేమిటంటే.. ఏ ఒక్క ప్రాజెక్టూ సకాలంలో పూర్తి కాలేకపోవడం. ఆరంభ శూరత్వంలా ప్రాజెక్టుల ప్రకటన.. ఆ తర్వాత పూజాపునస్కారాల వరకూ సజావుగానే సాగుతోంది. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతోంది. అత్యధిక శాతం ప్రాజెక్టులు జాప్యం కోరల్లో చిక్కుకుని.. వాస్తవ పెట్టుబడి ప్రణాళికలకు, అవి పూర్తయ్యే నాటి ఖర్చుకు పొంతన లేకుండా పోతోంది. 1992-2009 మధ్య కాలంలో మొత్తం 1035 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇందులో 41 శాతం అంచనా వ్యయాన్ని మించిపోయాయి. 82 శాతం ప్రాజెక్టుల పనుల్లో తీవ్ర జాప్యం తప్పలేదు. కేపీఎమ్‌జీ, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా చేపట్టిన సర్వే చెప్పిన నిష్ఠుర సత్యమే ఇది.

ఇవీ కారణాలు..
* ప్రాజెక్టులు ఆలస్యం కావడానికీ.. బడ్జెట్‌ మించిపోవడానికి సరైన డిజైన్‌, పథక రూపకల్పన లేకపోవడంతో పాటు సామగ్రి ధరలు పెరిగిపోవడం.
* నియంత్రణ సంస్థల నుంచి అనుమతుల్లో అలసత్వం, భూసేకరణలో అవాంతరాలు.
* తరచూ డిజైన్లను మార్చడం వ్యయం పెరిగిపోవడానికి మరో కారణం.

74,465 కోట్ల నష్టం
దేశంలో మొత్తం కేంద్ర ప్రాజెక్టుల్లో సగానికిపైగా ఆలస్యమైనవే. వీటి వల్ల రూ.74,465 కోట్ల నష్టం వచ్చింది. రూ.20 కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం అయ్యే మొత్తం 951 ప్రాజెక్టుల్లో(ఇవి గణాంకాల, పథక అమలు శాఖ పర్యవేక్షణలో ఉంటాయి) 309 ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయని.. వీటివల్ల అదనంగా రూ.74,465 కోట్లు వెచ్చించాల్సి వస్తోందని ప్రభుత్వ నివేదిక(ఏప్రిల్‌-జూన్‌ 2009) చెబుతోంది. ఇది ఆ మూడు నెలల వ్యవధికి కేటాయించిన వ్యయంలో 55.22 శాతం కావడం గమనార్హం. అంటే కేవలం ఆలస్యం మూలంగా సగానికి పైగా వ్యయాన్ని అదనంగా భరించాల్సి వస్తోందన్నమాట.
నివేదికలో ముఖ్యాంశాలు
* మొత్తం ప్రాజెక్టులు(30.06.09 నాటికి) : 951
* వీటిపై మొత్తం అంచనా వ్యయం : రూ.5,41,648.68 కోట్లు
* తాజాగా అనుమతించిన మొత్తం వ్యయం : రూ.5,51,273.93 కోట్లు
* మొత్తం సంభావ్యతా వ్యయం : రూ.6,07,187.57 కోట్లు
* త్రైమాసికం చివరినాటికి చేసిన వ్యయం : రూ.2,43,430.85 కోట్లు
* మొత్తం మీద అంచనా వ్యయంతో పోలిస్తే అదనంగా వెచ్చించాల్సిన మొత్తం శాతంలో:12.10
* తాజాగా అనుమతించిన వ్యయంతో పోలిస్తే అదనంగా వెచ్చించాల్సిన మొత్తం శాతంలో: 10.14%
* అంచనా వ్యయంతో పోలిస్తే అధిక వ్యయం చేయాల్సి వస్తున్న ప్రాజెక్టుల సంఖ్య: 309
* గడువు మీరి కొనసాగుతున్న ప్రాజెక్టుల సంఖ్య : 474(1-192 నెలలు)
* ఆలస్యమవుతున్న 474 ప్రాజెక్టుల అదనపు వ్యయ శాతం: 13.55%
* 2009-10కి ప్రారంభం కావాల్సి ఉన్న మొత్తం ప్రాజెక్టులు: 502
* ఇప్పటిదాకా పూర్తయినవి : 35
* పూర్తయిన ప్రాజెక్టుల వ్యయం : రూ.8310.09 కోట్లు