Tuesday, March 30, 2010

రాష్ట్రంలో తగ్గిన చక్కెర ఉత్పత్తి

తగ్గుదల 8.61 లక్షల క్వింటాళ్లు
రికవరీదీ అదే వరుస..
ముగిసిన చెరకు క్రషింగ్‌
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాష్ట్రంలో 2009-10 చెరకు గానుగాడే సీజను ముగిసింది. గత ఏడాది నెలకొన్న తీవ్ర కరవు, వర్షాభావ పరిస్థితులు చక్కెర ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. గత ఏడాది 59.91 లక్షల టన్నుల చెరకు గానుగాడగా ఈ సంవత్సరం 55 లక్షల టన్నులకు పరిమితమయింది. అదే విధంగా గతేడాది 59.27 లక్షల క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తవగా ఈ ఏడు 50.66 లక్షల క్వింటాళ్లు మాత్రమే అయింది. మొత్తంమీద 8.61 లక్షల క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి తగ్గింది.

కారణాలు ఇవీ
అంతక్రితం సంవత్సరం చెరకు మద్దతు ధరపై నెలకొన్న అనిశ్చితిప్రభావం సాగు విస్తీర్ణంపై పడింది. 2008-09లో 1.96 లక్షల హెక్టార్లలో చెరకు సాగు కాగా 2009-10 సంవత్సరంలో అది కాస్తా 1.20 లక్షల హెక్టార్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో దేశీయంగా పంచదార ధరలు భారీగా పెరిగాయి. కిలో ధర రూ.15 నుంచి రూ.45ను తాకింది. బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరగడంతో రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువే రైతులకు చెల్లించాయి. కేంద్రం ప్రతిపాదించిన లాభదాయకమైన ధర.. రూ.1,298..తో నిమిత్తం లేకుండా, టన్ను చెరకుకు రూ.1,700 నుంచి రూ.2,200 వరకు చెల్లించాయి.

కరవు - వరదలు
రికవరీపై కరవు, వరదలు ప్రభావాన్ని చూపించాయి. ముఖ్యంగా సహకార రంగంలో నడుస్తున్న కర్మాగారాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. గత ఏడాది 9.66% రాగా ఈ ఏడు అది 8.44 శాతంగా ఉంది. సంయుక్త రంగంలో నడుస్తున్న కర్మాగారాలోనూఅదే క్షీణత కనిపించింది. ప్రైవేటు వాటిల్లో ఫరవాలేదనిపిస్తోంది. మొత్తంమీద 35 కర్మాగారాల పరిధిలో రికవరీ శాతం నిరుటి కన్నా 0.69% తగ్గింది. ఇది గతేడాది 9.89% ఉండగా, ఈసారి 9.20% ఉంది.