అదనంగా ఉత్పత్తికి
డిస్టిలరీలకు అనుమతి
దొడ్డిదారిన రూ.600 కోట్ల ఆదాయం

ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం మద్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త పన్నులు వేయట్లేదంటూనే అదనపు మద్యం ఉత్పత్తికి అనుమతించి దొడ్డిదారిన భారం వేసింది. రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు నెలల కాలంలో 2.55 కోట్ల ప్రూఫ్ లీటర్ల మేర అదనంగా మద్యం ఉత్పత్తి చేసుకునేందుకు డిస్టిలరీలకు అనుమతించింది. గత నవంబరులో 1.12 కోట్ల ప్రూఫ్ లీటర్లు, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నాటికి మరో 1.43 కోట్ల ప్రూఫ్ లీటర్ల మద్యం అదనంగా ఉత్పత్తి చేసుకునే వీలు కల్పించింది. 2.55 కోట్ల ఫ్రూఫ్ లీటర్ల ద్వారా సుమారు 38 లక్షల కేసుల మద్యం ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. వీటి విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.600 కోట్ల ఆదాయం సమకూరుతుంది.
ఒక్కో కేసుపై రూ.1550 ఆదాయం: ప్రభుత్వం కేసుకు రూ.450 లోపు ధర ఉన్న మద్యాన్ని మాత్రమే అదనంగా ఉత్పత్తి చేసేందుకు అనుమతించింది. ఉత్పత్తి విలువ రూ.400 ఉన్న కేసు మద్యంపై ఎక్సైజ్ డ్యూటీ, అమ్మకం పన్ను, ఏపీబీసీఎల్ మార్జిన్, అదనపు ట్రేడ్ మార్జిన్ కలిసి అది రూ.1949కి చేరుతోంది. ఇందులో కేసు మద్యం ఉత్పత్తి విలువ రూ.400 తీసివేస్తే ప్రభుత్వానికి ఒక్కో కేసుద్వారా రూ.1549 ఆదాయం లభిస్తుంది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో 38 లక్షల కేసుల అదనపు మద్యం ఉత్పత్తికి అనుమతిచ్చింది. అంటే ప్రభుత్వం సుమారు రూ.600 కోట్లు ఆర్జించనుందన్నమాట.