సంక్షోభం దిశగా విద్యుదుత్పత్తి
తగ్గుముఖం పడుతున్న జలవిద్యుత్తు
ఫలించని ప్రత్యామ్నాయాలు
ఇళ్లకు మరింతగా కోత
క్యాప్టివ్ విద్యుత్పై ఆశలు
ఎండుతున్న పంటలు... ఆందోళనలో రైతులు

వ్యవసాయానికి కూడా అవసరం మేరకు కరెంటు అందించకపోవడంతో నల్గొండ, మెదక్, అనంతపురం, మహబూబ్నగర్ వంటి జిల్లాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. రైతులు సబ్స్టేషన్లు ముట్టడించి ఆందోళనలకు దిగుతున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు, కార్మికులు రోడ్డెక్కుతున్నారు. గురువారంనాడు హైదరాబాద్లో భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించాలని వారు నిర్ణయించాయి. మరో వైపు జలవిద్యుత్ ఉత్పత్తి పడిపోతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులు చేస్తున్న ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ఫలించడం లేదు.
మీరైనా కొనుక్కోండి!
పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా కరెంటు ఇవ్వడంలో విఫలమైన సర్కారు... ఎవరైనా బయట నుంచి కొనుక్కుంటే సరఫరా చేస్తామంటూ ప్రకటించింది. కానీ రోజూ ఒక మెగావాట్ కంటే ఎక్కువ కరెంటును వినియోగించే పరిశ్రమలకు మాత్రమే ఇది వీలవుతుంది. అంతకంటే తక్కువ కరెంటును వినియోగించే పరిశ్రమలకు లోటెన్షన్ లైన్ల ద్వారా కరెంటు ససరఫరా చేస్తున్నారు. ఒకవేళ పరిశ్రమలు బయట కొనుగోలు చేసినా... అవి లోటెన్షన్ లైన్ల పరిధిలో ఉన్నందున సాధారణ కోతలు వీటికీ అమలవుతాయి. ఫలితంగా ప్రత్యేకంగా కరెంటును కొనుగోలు చేసినా ఉపయోగపడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పరిశ్రమలు ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకూ బయట నుంచి కరెంటు కొనుగోలు చేస్తామని పెన్నా సిమెంట్స్, మరో కంపెనీ మాత్రమే ముందుకొచ్చాయని తెలిసింది.