Monday, April 19, 2010

ఆంధ్రప్రదేశ్‌ వార్షిక ప్రణాళిక(2010-11)


గత ఏడాది కన్నా 9% ఎక్కువ
గ్రాంటుగా మరో రూ.50 కోట్లు
వివిధ రంగాల పనితీరుకు ప్రణాళికా సంఘం ప్రశంసలు
న్యూఢిల్లీ, : ఆంధ్రప్రదేశ్‌ వార్షిక ప్రణాళిక(2010-11) శుక్రవారంనాడిక్కడ ఖరారయింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా, ముఖ్యమంత్రి రోశయ్యల మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో వార్షిక ప్రణాళికను రూ.36,800 కోట్లుగా ఖరారుచేశారు.
ప్రణాళిక స్వరూపం (రూ.కోట్లలో)...
*ప్రణాళిక మొత్తం-36,800;
*రాష్ట్ర వనరులు-16,155;
*కేంద్ర సాయం-7,720; అప్పులు-12,925
*కేంద్రం అదనపు గ్రాంటు-50 కోట్లు
*గత ఏడాది ప్రణాళిక-33,497
*ఖర్చు చేసింది-33,538
*పెరిగిన మొత్తం-3,303; పెరిగిన శాతం-9
*వ్యవసాయం, నీటిపారుదల సహా ఆర్థిక సేవలపై చేయాల్సిన ఖర్చు- 65 శాతం
కరెంటు ఛార్జీలు పెంచండి
రాష్ట్రానికి అహ్లూవాలియా సూచన
్రపైవేటు భాగస్వామ్యానికి జేజేలు
ప్రణాళిక అమలుతీరు పట్ల అహ్లూవాలియా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూనే.. కొన్ని కీలక సూచనలు చేశారు.

*రాష్ట్రం చాలా ఏళ్లుగా కరెంటు ఛార్జీలు పెంచలేదు. వీటిని పెంచాలి.

* విద్యుత్‌రంగ పనితీరు బాగుంది. లక్ష్యిత ఉత్పత్తిలో రాష్ట్రం ఇప్పటికే 55 శాతం అందుకుంది. మొత్తం లక్ష్యాన్ని సులువుగానే చేరుకుంటుంది.

* రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం తగ్గిపోతుండడం ఆందోళనకరం. అటవీ భూమిని ప్రభుత్వం అభివృద్ధికోసం తీసుకున్నప్పుడు తగిన పరిహారం ఇవ్వాలి.

* సంస్కరణల అమలు, భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడం అభినందనీయం. సత్వరాభివృద్ధికి రాష్ట్రం అనుసరిస్తున్న వినూత్న పద్ధతులు ప్రశంసనీయం. ఈ ప్రయత్నాల్ని 11వ ప్రణాళిక సమీక్షలో ప్రణాళికా సంఘం ప్రస్తావిస్తుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్‌ విజయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమవుతాయి.

* రాష్ట్రం రెవెన్యూ మిగులును కలిగి ఉండటమే కాకుండా, ద్రవ్యలోటును అదుపులోనే ఉంచగలిగింది.

* తలసరి ఆదాయం గణనీయంగా పెరగడం ఆర్థిక నిర్వహణ విజయాన్ని సూచిస్తోంది. ఇదే విజయాల్ని రాష్ట్రం కొనసాగించాలి. ప్రయోజనాల్ని అన్ని ప్రాంతాలకు సమంగా అందేలా చూడాలి.

* నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ ఉపాధి, ఆరోగ్య బీమా పథకాల్లో రాష్ట్రం సాధించిన విజయాలు ప్రశంసనీయం.

* ఆరోగ్య రంగం పనితీరు బాగుంది. శిశుమరణాల రేటు తగ్గింది. అయితే స్త్రీ, పురుష నిష్పత్తిలో చాలా ఎక్కువ తేడా(825-1000) ఉంది.

త్వరలో నిర్ణయం తీసుకుంటాం
ముఖ్యమంత్రి రోశయ్య వివరణ
రాష్ట్ర ప్రణాళికాబద్ధ అభివృద్ధిని ప్రణాళికా సంఘానికి ముఖ్యమంత్రి రోశయ్య వివరించారు. కరెంటు ఛార్జీలు పెంచాలన్న ప్రణాళికా సంఘం సూచనపై ముఖ్యమంత్రి స్పందిస్తూ... ఈ అంశాన్ని తాము పరిశీలిస్తున్నామని, త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రణాళికా సంఘం ముందు రోశయ్య ఏం చెప్పారంటే...

* మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధిపై దృష్టిపెడతాం.

* జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద 31,906 ఇళ్లు నిర్మిస్తాం.

* ప్రైవేటు భాగస్వామ్యంతో రేవులు, చిన్న విమానాశ్రయాలు, వంతెనలు నిర్మిస్తాం. ఇప్పటికే గోదావరి నదిపై వంతెన, పి.వి.నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే, గంగవరం, కృష్ణపట్నం రేవులను ఈ పద్ధతిన చేపట్టాం.

* నీటి పారుదల రంగాన్ని బలోపేతం చేస్తాం.
*బలహీనవర్గాల గృహనిర్మాణ పథకంలో అయ్యే కార్మిక వ్యయాన్ని ఉపాధి హామీ పథకం కింద చూపించేందుకు అవకాశం ఇవ్వాలి.
* గ్రామీణ, పట్టణ కూలి రేట్ల మధ్య అంతరాన్ని తగ్గిస్తాం.

ప్రణాళికకు అహ్లూవాలియా, రోశయ్యలు ఆమోదముద్ర వేయడానికన్నా ముందు.. ప్రణాళికా సంఘానికి, రాష్ట్ర అధికారులకు మధ్య సుదీర్ఘ భేటీ జరిగింది. రాష్ట్ర బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి.ప్రసాద్‌ నాయకత్వం వహించారు. ఆ సమావేశానికి అహ్లూవాలియా, రోశయ్యతో పాటు, ప్రణాళికా సంఘం సలహాదారులు పలువురు, కమిషన్‌ సభ్యులు అభిజిత్‌ సేన్‌, సయీదా హామీద్‌లు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్‌.వి.ప్రసాద్‌తో పాటు, డి.స్వామినాథన్‌, టి.ఛటర్జీ, రేచల్‌ ఛటర్జీ, జన్నత్‌ హుస్సేన్‌, జి.సుధీర్‌, ఎస్‌.కె.జోషి, జె.సత్యనారాయణ, ఎస్‌.భట్టాచార్యలు హాజరయ్యారు.