మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే ధార్మికత గురించి హెచ్చరిస్తూ సర్వీస్ ప్రొవైడర్లు, తయారీదారులు ప్రమాదానికి గురి కాగల అవకాశమున్న వర్గాలు-పిల్లలు,ల గర్భిణులను చూపిస్తూ తయారుచేసే ప్రచార ప్రకటనలు తప్పించాలని ప్రభుత్వం కోరింది.
మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు వినియోగదారుని మెదడు లోని కణజాలానికి తీవ్ర నష్టం కలిగించగలవని ఇటీవల టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలతో కూడిన ప్రకటనలో తెలిపింది.
ఈ ముసాయిదా మార్గదర్శక సూత్రాల ప్రకారం పిల్లలు, గర్భిణులు, గుండె వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు మొబైల్ ఫోన్లను పరిమితంగా వినియోగించాల్సి ఉంటుంది.
భారత్లో మొబైల్ ఫోన్లు వినియోగించే వారి సంఖ్య చాలా అధికంగా ఉంటోంది. 2010 నాటికి ఇది 500 మిలియన్ల సంఖ్యను దాటవచ్చని అనుకుంటున్నారు. వీరిలో అధికభాగం బాలలే.
భద్రతా కారణాల దృష్ట్యా పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. ఎప్పుడూ కూడా వారేం చేస్తున్నారో కనిపెట్టి ఉంటున్నారు.
మొబైల్ ఫోన్లు/ రేడియో ప్రసార కేంద్రాలు, తరంగ దైర్ఘ్య శక్తిని విడుదల చేస్తాయని అందువల్ల కణజాలం ఉష్ణానికి గురవుతుందని ఇది మానవ ఆరోగ్యానికి భంగకరం కావచ్చని మార్గదర్శకసూత్రాలు చెపుతున్నాయి.
మొబైల్ ఫోన్లను వినియోగించినపుడు వాటిని చెవికి దగ్గరగా పెట్టుకోవటంతో అది మెదడుకు సమీపంలో పెట్టినట్లవుతుంది. చాలాసేపు మొబైల్ ఫోన్లో మాట్లాడటం వల్ల కొన్ని మెదడు కణజాలానికి నష్టం సంభవించవచ్చు.
సాధ్యమైనంతవరకు ఎక్కువ సేపు మాట్లాడటం తప్పనపుడు "హ్యాండ్స్ ఫ్రీ' గా మొబైల్ వినియోగించాలని( మొబైల్ చేతిలో పట్టుకోకుండా స్పీకర్లు తగిలించుకుని మాట్లాడటం) ఆ నివేదికలో సలహాఇచ్చారు. కాగా 16 ఏళ్ల లోపు పిల్లలు సెల్ ఫోన్లు వినియోగించకుండా నిరుత్సాహపరచాలని ఎందుకంటే వారి కణజాలం చాలా మృదువుగా ఉంటుందని వారు మరింతగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
అంతేగాక మొబైల్ ఫోన్లు/ రేడియో టెర్మినల్స్ వినియోగించేటపుడు అదే సమయంలో వైద్యసహాయక పరికరాలైన వినికిడి సాధనాలు, డిఫిబ్రిల్లేటర్స్(గుండెవేగాన్ని అదుపు చేసేవి) పేస్ మేకర్స్(గుండె పని తీరును నియంత్రించేవి) ఇంప్లాంట్స్(శరీరంలో అమర్చేవి) వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని ఆ నివేదికలో కోరారు.
సెల్ఫోన్ల వల్ల అపాయం కలిగే అవకాశాలున్న ఆస్పత్రులలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(అత్యవసర చికిత్సా విభాగం) లాటి విభాగాలలో వీటని పూర్తిగా నిషేధించాలని లేదా తగ్గించాలని ఆమేరకు ఆస్పత్రి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.