Friday, April 9, 2010

సిగరెట్ల తయారీలో విదేశీ పెట్టుబడులు నిషేధం

ఈబీసీ కమిషన్‌ గడువు పొడిగింపు
చిత్రహింసల నిరోధక బిల్లుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం
న్యూఢిల్లీ: సిగరెట్ల తయారీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. గురువారం ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం హోంమంత్రి చిదంబరం విలేకరులతో మాట్లాడారు. ఈ నిర్ణయంతో ధూమపాన వ్యతిరేక వైఖరిపై ప్రభుత్వం తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకుందన్నారు. దేశీయ వినియోగం లేదా ఎగుమతుల కోసం తయారుచేసే సిగరెట్ల విషయంలోనూ ఎఫ్‌డీఐని అనుమతించబోమని స్పష్టం చేశారు. సిగరెట్‌ తయారీకి ఉద్దేశించిన ప్రత్యేక ఆర్థిక మండళ్లలోనూ ఇది వర్తిస్తుందన్నారు. ఈ రంగంలో ప్రస్తుతం ఉన్న విదేశీపెట్టుబడులపై ఎలా వ్యవహరించాలన్న దానిపై సమావేశంలో ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం సిగరెట్ల ఉత్పత్తి రంగంలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వెసులుబాటు ఉంది. ఇదేరోజు కేంద్రమంత్రి వర్గం పలు ఇతర నిర్ణయాలు తీసుకుంది. వాటిని సమాచార ప్రసారాల శాఖ మంత్రి అంబికాసోనీ వెల్లడించారు. అవి...

* ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) కమిషన్‌ గడువును జులై 31 వరకు (నాలుగు నెలలపాటు) పొడిగించారు. ఈబీసీ కోటా విధివిధానాలపై అధ్యయనం చేయడానికి 2004లో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

* అమానుష, క్రూరమైన హింసను నిరోధించేందుకు వీలుగా రూపొందించిన 'చిత్రహింసల నిరోధక బిల్లు-2010'కు ఆమోదం తెలిపారు. దీన్ని త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడతారు. అమానుష హింసకు వ్యతిరేకంగా 1975లో ఐక్యరాజ్య సమితి చేసిన ఓ తీర్మానానికి అనుగుణంగా భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తీర్మానంపై భారత్‌ 1997లో సంతకం చేసింది.

* ఆకాశవాణి, దూరదర్శన్‌లకు చెందిన ట్రాన్స్‌మిటర్లు, స్టూడియోలు, అనుసంధాన వ్యవస్థలను డిజిటలైజ్‌ చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. నాణ్యమైన ప్రసారాలు అందించేందుకు, ప్రైవేటు రంగంనుంచి పోటీని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రూ.1540 కోట్లు వెచ్చిస్తారు.

* యూఎన్‌డీపీ ఆధ్వర్యంలోని విపత్తు నిర్వహణ కార్యక్రమానికి నిధుల కేటాయింపును 3.4 కోట్ల డాలర్ల నుంచి 4.1కోట్ల డాలర్లకు పెంచారు. అదనపు నిధులతో తమిళనాడులోని మరో ఏడు జిల్లాల్లో సునామీ సహాయ కార్యక్రమాలు చేపడతారు.

* చెన్నైలోని భారత మారిటైమ్‌ యూనివర్సిటీకి రూ.282.25కోట్ల మేర ఆర్థికసాయం అందించే ప్రతిపాదనను ఆమోదించారు.