Monday, April 19, 2010

కాసుల క్రి'కిట్‌'

వీక్షకులకు ఆనందాలు
నిర్వాహకులకు ధనరాసులు
పెద్దలకు రహస్య వాటాలు
ట కంటే ఎక్కువగా వివాదాలతోనే అందరి దృష్టిని ఆకర్షించే ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఈ సారి కూడా భిన్నంగా ఏమీ సాగడంలేదు. శశిథరూర్‌- లలిత్‌ మోడి గొడవతో మళ్లీ పతాక శీర్షికలకెక్కింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌పై సమగ్ర విశ్లేషణ.
ఐపీఎల్‌ అంటే?
పీఎల్‌కు అంకురార్పణ చేసిందెవరంటే చాలామంది లలిత్‌ మోడీ అని చెబుతారు! కానీ నిజానికి... జీ గ్రూప్‌ అధినేత సుభాష్‌ చంద్ర అని అనటం సబబేమో! ఎందుకంటే... దేశంలో క్రికెట్‌పై బీసీసీఐ పెత్తనాన్ని సవాలు చేస్తూ... సుభాష్‌ చంద్ర ఆరంభించిన ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌ (ఐసీఎల్‌)ను చూసి ఆందోళనతో బీసీసీఐ ఈ ఐపీఎల్‌ను ఆరంభించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు లలిత్‌ మోడి నేతృత్వంలో ఐపీఎల్‌కు అంకురార్పణ జరిగింది. యూరోపియన్‌ సాకర్‌ లీగ్‌ మాదిరిగా ఈ టోర్నీకి రూపకల్పన చేశారు.
దీనికి ఐసీసీ గుర్తింపు ఉందా?
అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఈ ఐపీఎల్‌ను గుర్తించింది. కానీ... ఇది అంతర్జాతీయం మాత్రం కాదు. పక్కాగా భారత దేశవాళీ టోర్నీ! కాకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ ఆటగాళ్ళంతా పాల్గొనటం ఇందులోని ఆకర్షణ! క్రికెట్‌కు కొత్తదైన ఈ పద్ధతే ఐపీఎల్‌ విజయవంతం అవటానికి ప్రధాన కారణం!
ఐపీఎల్‌ బీసీసీఐదా? మోడీదా?
పీఎల్‌... బీసీసీఐ అనుబంధ సంస్థ. దీనికి కమిషనర్‌, ఛైర్మన్‌ లలిత్‌ మోడి. పాలక మండలి కూడా ఉంది. బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌తో పాటు... బోర్డులో కీలక పదవుల్లో ఉన్నవాళ్లే ఈ పాలకమండలిలో సభ్యులు. ప్రముఖ క్రికెటర్లు సునీల్‌ గవాస్కర్‌, రవిశాస్త్రి, మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీలకు కూడా ఇందులో చోటు కల్పించారు.

బీసీసీఐకి ఎంత లాభం?
ఆటగాళ్ళకు వేలం పాట పెట్టి లక్షలు కోట్ల రూపాయల్లో కొనుక్కుంటూ క్రికెట్‌ వ్యాపారాన్ని అత్యున్నత స్థాయికి చేర్చిన టోర్నీ ఇది. ఈ టోర్నీతో బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడా సంఘాల్లో ఒకటిగా ఎదిగింది. ఐపీఎల్‌కు ముందు బీసీసీఐ వార్షికాదాయం రూ.70 నుంచి 80 కోట్లే. ప్రస్తుతం ఆదాయం రూ. 800 కోట్ల పైమాటే!

గత ఐపీఎల్‌లో...
ప్రసార హక్కులు: రూ.182 కోట్లు
థియేటర్ల హక్కులు: 33 కోట్లు
ఫ్రాంఛైజీల ఫీజు: 350 కోట్లు
ఇంటర్నెట్‌ హక్కులు: 25 కోట్లు
ఎంటర్‌టైన్‌మెంట్‌
ఛానెల్‌ హక్కులు: 30 కోట్లు
టైటిల్‌ స్పాన్సర్‌,
ఇతర సెంట్రల్‌ స్పాన్సర్లు: 122 కోట్లు

ఫ్రాంఛైజీల ఎంపికెలా?
తొలి ఐపీఎల్‌ 2008లో ఎనిమిది నగరాలకు చెందిన ఎనిమిది ఫ్రాంఛైజీలతో (జట్లతో) ఆరంభమైంది. ఈ ఫ్రాంచైజీలను బిడ్డింగ్‌ ఆధారంగా ఎంపిక చేశారు. బిడ్డింగ్‌లో చాలా సంస్థలు పాల్గొన్నాయి. ఎక్కువ ధరను ప్రతిపాదించిన సంస్థలు ఆయా నగరాల ఫ్రాంఛైజీలను దక్కించుకున్నాయి.

ఆదాయం ఎలా వస్తుందంటే...
టీమ్‌ స్పాన్సర్‌షిప్స్‌: (రూ.20 కోట్లు)
*ప్రతి జట్టుకూ ఓ ప్రధాన స్పాన్సర్‌, ఉప స్పాన్సర్లున్నారు.
*ఈ స్పానర్లు ఆటగాళ్ళ దుస్తులు, బ్యాట్లు, ఇతరత్రా క్రీడా పరికరాలపై తమ లోగోలను అడ్వర్టయిజ్‌ చేసుకోవచ్చు
*ఆటగాళ్ళను ఉపయోగించుకొని స్పాన్సర్లు అడ్వర్టయిజ్‌మెంట్లు, వాణిజ్యపరమైన పోటీలు నిర్వహించుకోవచ్చు
*స్పాన్సర్లకు, అడ్వర్టయిజ్‌మెంట్లకు వీలుగా ప్రతి ఆటగాడూ 4-5 రోజులు ఫ్రాంఛైజీకి ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాడు.
గేట్‌ టికెట్లు (15 కోట్లు): స్టేడియంలో 80 శాతం సీట్లను ఫ్రాంఛైజీలు అమ్ముకోవచ్చు. ప్రతి ఫ్రాంజైజీకి సొంత గడ్డపై ఏడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.

స్టేడియం లోపల వాణిజ్యప్రకటనలు (5 కోట్లు): బౌండరీ చుట్టూ ఉండే బోర్డుల ద్వారా అడ్వర్టయిజ్‌మెంట్‌ ఆదాయం
దుస్తులు... ఇతరత్రా 2-5 కోట్లు:రీబాక్‌లాంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని టీషర్టులు, టోపీలు, ఇతరత్రా క్రికెట్‌ సామగ్రిని తయారు చేయించి అమ్మటం
మీడియాతో ఒప్పందాలు (రూ.కోటి): రియాల్టీ షోలు, క్రికెటర్ల ప్రతిభానేష్వణ, ఛీర్‌లీడర్స్‌ ఎంపికల తదితరాల్లో టీవీ ఛానెళ్ళతో ఒప్పందాలు

*సెట్‌మాక్స్‌ నుంచి వచ్చే 8,200 కోట్ల (పదేళ్ళకు) రూపాయల్ని బీసీసీఐ, ఫ్రాంఛైజీల మధ్య పంచుతారు.
*తొలి 3 ఏళ్ళ వరకు ప్రసార హక్కుల ఆదాయంలో 20 శాతం బీసీసీఐకి; 80 శాతం ఫ్రాంఛైజీలకు
*4-5 ఏళ్ళలో బీసీసీఐ 30%; ఫ్రాంఛైజీలకు-70%
*6-10 ఏళ్ళలో బీసీసీఐ 40%; ఫ్రాంఛైజీలకు 60%
*ఐపీఎల్‌ సెంట్రల్‌ స్పాన్సర్ల ద్వారా వచ్చే ఆదాయం 135 కోట్లలో 60 శాతం వాటా.

ఎంపికంతా పారదర్శకమేనా?
అనుమానాలున్నాయి. లలిత్‌ మోడికి చెందిన బంధువులకే రెండు ఫ్రాంఛైజీల్లో వాటాలున్నాయి. ఇక బీసీసీఐ కార్యదర్శి ఎన్‌. శ్రీనివాసన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును దక్కించుకున్న విజయ్‌ మాల్యా.. కర్ణాటక క్రికెట్‌ సంఘం ఉపాధ్యక్షుడు. చాలా జట్లలో రాజకీయ నాయకులకు కూడా రహస్య వాటాలున్నాయన్న అనుమానాలున్నాయి. శరద్‌ పవార్‌, ప్రఫుల్‌ పటేల్‌ పేర్లు ఎప్పటి నుంచో వినబడుతున్నాయి!
తాజా వివాదమేంటి?
చ్చే ఐపీఎల్‌ నుంచి ప్రస్తుతమున్న 8 ఫ్రాంఛైజీలకు అదనంగా మరో రెండు చేరనున్నాయి. ఇందుకు ఐపీఎల్‌ బిడ్‌లను ఆహ్వానించింది. ఇందులో పుణె ఫ్రాంఛైజీని సుబ్రతోరాయ్‌ నేతృత్వంలోని సహారా గ్రూప్‌ రూ. 1702 కోట్లు, కోచిని రాండీవూ గ్రూప్‌ రూ. 1533 కోట్లు వెచ్చించి దక్కించుకున్నాయి. కోచి ఫ్రాంఛైజీని రాండీవూ నెగ్గడంలో కేంద్ర మంత్రి శశి థరూర్‌ది కీలక పాత్ర. ఐతే తాను కేరళవాసిని కాబట్టి కేవలం నైతిక మద్దతును మాత్రమే ఇచ్చానని మంత్రి పేర్కొన్నారు. కానీ థరూర్‌ సన్నిహితురాలు సునంద పుష్కర్‌కు రాండీవూ గ్రూప్‌లో వాటా ఉందని ఐపీఎల్‌ కమిషనర్‌ లలిత్‌ మోడి ట్విటర్‌లో బయటపెట్టడంతో వివాదం చెలరేగింది. రాండీవూ గ్రూపులో సునంద వాటా విలువ రూ.70 కోట్లు. కోచి కన్సార్టియం ఐపీఎల్‌ బిడ్‌ గెలవడంలో కీలక పాత్ర వహించినందుకే ఈ మొత్తం థరూర్‌ సన్నిహితురాలికి ఉచితంగా దక్కిందనేది ఆరోపణ
ఎవరీ సునంద?
కాశ్మీర్‌ లోయలోని బొమ్మై గ్రామం సునంద స్వస్థలం. తండ్రి రిటైర్డ్‌ ఆర్మీ అధికారి. ఉగ్రవాదులు సునంద ఇంటిని తగులబెట్టడంతో ఆమె కుటుంబం శ్రీనగర్‌కు వలసవచ్చింది. బారాముల్లా ఆర్మీ పాఠశాల విద్య అభ్యసించింది. 1991లో జమ్మూ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా అందుకుంది. ఢిల్లీలోని ఓ హోటల్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తూ... అక్కడే పరిచయమైన సంజయ్‌ రైనాను పెళ్ళాడింది. తర్వాత అతనికి విడాకులిచ్చింది. దుబాయ్‌కు వెళ్ళి ఈవెంట్‌ మేనేజర్‌, అగ్నిమాపక పరికరాల డీలర్‌ సుజిత్‌ మీనన్‌ అనే కేరళ వ్యక్తి వివాహం చేసుకుంది. కేంద్ర మంత్రి శశి థరూర్‌కు సన్నిహితురాలని పేరు!
మోడీ ఎందుకు బయటపెట్టారు
నిబంధనల ప్రకారం కన్సార్టియంలో భాగస్వాముల వివరాలు బయటపెట్టకూడదు. ఈ మేరకు రహస్య నిబంధన ఉంది. చాలా ఫ్రాంఛైజీల్లో అసలు వాటాదారులెవరో ఇప్పటికీ తెలియని పరిస్థితికి కారణం ఈ నిబంధనే. ఈ నేపథ్యంలో మోడి కోచి కన్సార్టియం భాగస్వాముల వివరాలను ట్విటర్‌లో బయటపెట్టడం విశేషం. మోడికి సంబంధించిన వ్యక్తులకు (అహ్మదాబాద్‌కు) బిడ్‌ దక్కలేదన్న అక్కసే ఇందుకు కారణమనేది అతడి వ్యతిరేకుల వాదన.

రాండీవూ గ్రూప్‌కే ఎందుకు?
కోచిని రాండీవూ గ్రూప్‌ దక్కించుకోగానే చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెద్దపెద్ద సంస్థలను పక్కనబెట్టి ఊరూపేరూ లేని గ్రూపు ఐపీఎల్‌ జట్టును ఎలా దక్కించుకుందన్న అనుమానాలు చెలరేగాయి. అయితే దీని వెనుక మంత్రాంగం చాలానే నడించింది. థరూర్‌ మద్దతుతో పాటు... బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌ ఈ కన్సార్టియంకు తన ఆశీస్సులందించినట్లు సమాచారం.

ఎందుకింత మోజు
45 రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రజల్ని విస్తృత స్థాయిలో చేరడానికి కంపెనీలకు ఇదో సులభమార్గం. అందుకే... 10 సెకన్ల వాణిజ్యప్రకటనకు రూ.5 లక్షల రూపాయలు పెట్టినా డిమాండ్‌ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఇన్నాళ్ళూ క్రికెట్‌ను తమ వ్యాపార ప్రసార సాధనంగా భావించని కంపెనీలు కూడా ఈ ఐపీఎల్‌-3 నుంచి లాభపొందటానికి ప్రయత్నిస్తున్నాయి.

ముంబయి ఇండియన్స్‌: ఈ జట్టు యజమాని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ. ఇందులో రిలయన్స్‌ వాటా 95 శాతం. అన్షూజైన్‌ అనే ఆర్థికవేత్తకు కూడా 5 శాతం వాటా ఉంది.
బిడ్‌: 514.7 కోట్లు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: ప్రముఖ మద్యం వ్యాపారి, యూబీ గ్రూప్‌ అధినేత విజయ్‌ మాల్యా ఈ జట్టు యజమాని. ఇందులో చాలా మంది భాగస్వాములున్నారు. .
బిడ్‌: 513.4 కోట్లు

రాజస్థాన్‌ రాయల్స్‌: ఐపీఎల్‌ కమిషనర్‌ లలిత్‌ మోడి బావమరిది సురేష్‌ చెల్లారామ్‌ (44.1%)ది ఈ జట్టులో అత్యధిక వాటా. ఎమర్జింగ్‌ స్పోర్ట్స్‌ మీడియాకు చెందిన మనోజ్‌ బదాలెకు 32.4 శాతం వాటా ఉంది.
బిడ్‌: 308.2 కోట్లు

చెన్నై సూపర్‌ కింగ్స్‌: ఇండియా సిమెంట్స్‌ అధినేత ఎన్‌. శ్రీనివాసన్‌ది ఈ జట్టు. ఇతడు బీసీసీఐ కార్యదర్శి కూడా. బీసీసీఐలో అత్యుతన్నత పదవి ఉండడం వల్లే శ్రీనివాసన్‌కు చెన్నై హక్కులు దక్కాయన్న విమర్శలూ లేకపోలేదు. త్వరలో ఈ జట్టును స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో నమోదు చేసే అవకాశముంది.
బిడ్‌: 418.6 కోట్లు

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌: బాంబే డైయింగ్‌కు చెందిన నెస్‌వాడియా, మోహిత్‌ బర్మన్‌(డాబర్‌), కరణ్‌పాల్‌, ప్రీతిజింటా.. ఇంకా చాలా మంది భాగస్వామ్యులు. ఇందులో మోహిత్‌ బర్మన్‌ తమ్ముడు గౌరవ్‌.. లలిత్‌ మోడికి అల్లుడు. ప్రస్తుత ఈ జట్టును అమ్మేసే యోచనలో ఉన్నారు. వీడియోకాన్‌, హీరోహోండా కంపెనీలు కొనేందుకు పోటీపడుతున్నాయి.
బిడ్‌: 349.6 కోట్లు

కోల్‌కత నైట్‌రైడర్స్‌: బాలీవుడ్‌ నటులు షారూక్‌ఖాన్‌, జూహీచావ్లా కలిసి ఏర్పాటు చేసిన రెడ్‌చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ జట్టుకు యజమాని.
బిడ్‌: 345.5 కోట్లు

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌: యజమాని జీఎమ్మార్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన గ్రంధి మల్లికార్జునరావు.
బిడ్‌: 386.4 కోట్లు

డెక్కన్‌ ఛార్జర్స్‌: డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌కు చెందిన టి.వెంకట్రామ్‌రెడ్డి ఈ జట్టు యజమాని. ఇందులో గ్రూప్‌ ఎమ్‌ అనే సంస్థకు కూడా 20శాతం వాటా ఉందంటున్నారు!
బిడ్‌: 492.2 కోట్లు

పుణె 1702 కోట్లు; కోచి: 1533 కోట్లు.