Thursday, April 1, 2010

ప్రైవేటు వ్యక్తులకు గ్యాస్‌ బావులు

'నెల్ప్‌'తో సంబంధం లేకుండా...
చమురు క్షేత్రాలకు టెండర్లు
కేజీ బేసిన్‌ చరిత్రలో మొదటిసారి
ఓఎన్‌జీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రాధాన్యం
న్యూస్‌టుడే, రాజమండ్రి
కృష్ణా గోదావరి బేసిన్లో లాభసాటిగాని చిన్నపాటి సహజవాయువు క్షేత్రాలను ఓఎన్‌జీసీ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వబోతోంది. రోజుకు 50 వేల క్యూబిక్‌ మీటర్లు మాత్రమే గ్యాస్‌ ఉత్పత్తి చేయగల చిన్నపాటి బావుల కోసం టెండర్లు పిలిచింది. ఓఎన్‌జీసీలో ఉద్యోగవిరమణ చేసినవారికి తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటి వరకు 16 క్షేత్రాల్లో ఎనిమిదింటిని రిటైర్డ్‌ ఉద్యోగులే కైవసం చేసుకున్నారు. నేషనల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ లైసెన్సింగ్‌ పాలసీ(నెల్ప్‌)తో సంబంధం లేకుండా టెండర్లు పిలవడం కేజీ బేసిన్‌ చరిత్రలో ఇదే మొదటిసారి.

సొసైటీలుగా మాజీ ఉద్యోగులు: ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వడం కోసం ఓఎన్‌జీసీ ఏడాది క్రితం 16 క్షేత్రాలకు టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటివరకు 10 మంది టెండర్లు రాగా.. ఎనిమిది ఓఎన్‌జీసీలో పని చేసిన మాజీ ఉద్యోగులవు. ఆసక్తి ఉన్న రిటైర్డ్‌ ఉద్యోగులు ఒక సొసైటీగా ఏర్పడి ఈ టెండర్లలో భాగస్వాములయ్యారు. మొదటిసారి ఇలా చిన్నపాటి పెట్టుబడిదారులకు క్షేత్రాల్లో అవకాశం కల్పించడంతో స్థానికంగా డబ్బున్న కొందరు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. చమురు క్షేత్రాలను పొందినవారు సంబంధిత బావి నుంచి ఎన్నాళ్లు గ్యాస్‌ వస్తే అన్నేళ్లు ఉత్పత్తి చేసుకునే వెసులుబాటుంది. వచ్చే లాభంలో 40 శాతం ఓఎన్‌జీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. బావిలో గ్యాస్‌ లేకుంటే పెట్టిన పెట్టుబడికి ఓఎన్‌జీసీ బాధ్యత వహించదు. ఒక్కో బావిపై కనీసం రూ. 50 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ బావి విజయవంతమైతే ఒక్కో బావి ద్వారా ఏడాదికి రూ.కోటి వరకు లాభార్జన చేసే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం భారీ నష్టం తప్పదు. ప్రస్తుతం టెండర్లు దక్కించుకున్న వారెవ్వరూ ఇంకా డ్రిల్లింగ్‌ ప్రారంభించలేదని సమాచారం. రాబోయే రోజుల్లో ఇలా స్థానికంగానే ప్రైవేటు టెండర్లను పిలిచేందుకు ఓఎన్‌జీసీ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.