Monday, April 5, 2010

ప్రశాంత నిద్ర దూరం చేస్తున్న ఒత్తిడి


పరిశోధనల్లో ఔషధ సంస్థల పోటాపోటీ
రూ.14000 కోట్ల మార్కెట్‌ అంచనా
'పాపాయిల నిద్రకు అమ్మ జోలపాట ఎలాగో.. మీ చక్కటి నిద్రకు మేము తోడున్నాం' అంటున్నాయి ఔషధ తయారీ కంపెనీలు. రోజంతా కష్టపడే మనిషికి కనీసం 8 గంటల నిద్ర అవసరం. అలాంటిది కనీసం 5 గంటలైనా ప్రశాంతంగా పడుకునే పరిస్థితి పట్నవాసుల్లో కరవైంది. నిత్యం ఒత్తిళ్లతో గడిపే ఉద్యోగస్థుల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటోంది. పట్నవాసుల్లో 93% మంది 8 గంటల నిద్రకూ ముఖం వాచినట్లు గుర్తించడం వైద్య పరిశోధనలకు ఓ కొత్త ఊపు తెచ్చిపెట్టింది. 'మీ నిద్ర సంగతి మేం చూసుకుంటాం.. కాకపోతే కాస్త ఖర్చవుతుంది అంతే' అంటూ వినూత్న పద్ధతులు, ఔషధాలను మార్కెట్‌లోకి తెస్తున్నారు.

నీల్సన్‌ సంస్థ సర్వే
గత నవంబరు, డిసెంబరు నెలల్లో నీల్సన్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఏం తేలిందంటే..

* పట్టణాల్లో 93% మందికి 8 గంటల నిద్ర కరవవుతోంది.
* నిద్ర లేమితో 11 శాతం మంది విధులకు ఎగనామం పెడుతున్నారు.
* ఉద్యోగం చేస్తూ నిద్రలోకి జారిపోయేవారు మరో 11% మంది ఉంటున్నారు.
* ఇక నిద్ర కరవై, పనిలో ఇబ్బంది పడేవారు 58% మంది ఉంటున్నారు.
* శ్వాస సంబంధ సమస్యలకు గురైన వారు 62% మంది

భారీ మార్కెట్‌ అవకాశాలు
దేశంలో నిద్రా బాధితులు 4 కోట్ల నుంచి 7 కోట్ల మంది ఉంటారని, ఏటా ఈ సంఖ్య 25% పెరగవచ్చని ఒక అంచనా. అంతేకాదు.. సుఖ నిద్రకు అనువైన మందులు, కిటుకులు నేర్పే మార్కెట్‌ విలువ రూ.14,000 కోట్లు ఉంటుందని లెక్కలేశారు. అమెరికాలో రూ. లక్ష కోట్ల (23 బిలి.డాలర్లు) పైనేనట!

* దేశంలో 100 వరకు స్లీప్‌ ల్యాబ్‌లున్నాయి. ఫిలిప్స్‌ హెల్త్‌కేర్‌ మరో 100 స్లీప్‌ల్యాబ్‌లు నెలకొల్పుతోంది. ఢిల్లీకి చెందిన మెడిసిటీ, ఫోర్టిస్‌ శాఖలు, ఆర్‌&ఆర్‌, ముంబయికి చెందిన హిందుజా, సెవెన్‌హిల్స్‌ వంటి సంస్థలకూ ఇందులో భాగస్వామ్యం ఉంది.

* జీఎస్‌కే కన్జూమర్‌ హెల్త్‌కేర్‌ ముక్కులో వేసుకునే చుక్కల మందు, మోడీ ఒమేగా ఫార్మా కంపెనీలు గురక నివారణ కోసం గొంతులోకి స్ప్రే చేసుకునే ఔషధాలను విడుదల చేశాయి. వీటిని దేశమంతా మందుల దుకాణాల్లో విక్రయించేందుకు ప్రయత్నాలు ఆరంభించాయి.

* షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఎదురయ్యే శ్వాస సంబంధ ఇబ్బందుల పరిష్కారానికి 'నిరంతరం స్వచ్ఛమైన గాలిని అందించే' యంత్రాలను జీఈ హెల్త్‌కేర్‌ మనదేశంలో ప్రవేశపెట్టింది. ఇప్పటికే 3,500 యంత్రాలను అమర్చినట్లు కంపెనీ చెబుతోంది.

వ్యాధులకు చికిత్స పొందడం కంటే, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై శ్రద్ధ వహించేలా పట్టణవాసుల దృక్పథంలో మార్పు తెస్తామంటున్నాయి ఈ కంపెనీలు.

స్లీపింగ్‌ ల్యాబ్‌లో ఏం చేస్తారంటే..
నిద్రా బాధితులను పరీక్షించి, వారి సమస్యలు నిర్థారించి, వైద్యులకు నివేదిక ఇవ్వడం స్లీపింగ్‌ ల్యాబ్‌ విధి. అంతర్జాతీయంగా వీటి ఏర్పాటులో ముందున్న ఫిలిప్స్‌ రెస్పిరోనిక్స్‌ భారత్‌లో నెలకొల్పుతోంది. ఫిలిప్స్‌ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల సరఫరాతో పాటు సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తోంది. ఆలిస్‌ 5, ఆలిస్‌ పీడీఎక్స్‌ వంటి పరికరాలు ఈ ల్యాబ్‌లో ఉంటాయి.

రోగికి పాలీసోనోగ్రామ్‌ (పీఎస్‌జీ) పరీక్ష నిర్వహిస్తారు. అంతా కంప్యూటర్‌ ఆధారితంగా, సూచీల ఆధారంగా జరుగుతుంది. అందువల్ల నెప్పి ఏమీ ఉండదు.

రోగి తల, ఛాతీ, కాళ్లకు అమర్చిన సెన్సర్‌ల సహాయంతో పూర్తిస్థాయిలో పరీక్షిస్తారు. వీటి ద్వారా వచ్చిన వివరాల ఆధారంగా, నిద్రలేమి ఏ స్థాయిలో ఉందో నిర్థారిస్తారు.

నిద్రకు ఆటంకం కలిగేలా శ్వాస సంబంధ సమస్య ఉన్నట్లు గుర్తిస్తే, తగిన సూచీలతో నివేదిక సిద్ధం చేస్తారు. వైద్యులు ఇది పరిశీలించి సమస్య సున్నితమా, మధ్యస్థాయిలో ఉందా, అధికమా అనేది తెలుసుకుని, అందుకనుగుణంగా చికిత్స చేస్తారు.

సరైన నిద్ర లేకుంటే..
ర్ధరాత్రిళ్లు మెలకువ రావడం.. వేకువజామునే లేచి, అవిశ్రాంతంగా కనపడటం.. .. ఇవన్నీ దేశంలో కోట్ల మంది పడుతున్న ఇబ్బందులే అంటున్నారు వైద్యులు.

ఇందువల్ల చేసే పనిలో సామర్థ్యం తగ్గుతుంది. ఏదైనా విషయంపై దృష్టి కేంద్రీకరించలేకపోవడంతో పాటు మతిమరుపు ఆవహిస్తుంది. చికాకు ఎక్కువవుతుంది.

శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. తరచు జలుబు, ఫ్లూతో పాటు ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులకు గురౌతారు.